Begin typing your search above and press return to search.

67 మంది ప్రాణాలు కాపాడిన శునకం

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంఘటన మానవతా చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది.

By:  Tupaki Desk   |   8 July 2025 5:11 PM IST
67 మంది ప్రాణాలు కాపాడిన శునకం
X

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంఘటన మానవతా చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది. సియతి గ్రామంలో ఒక శునకం చేసిన హెచ్చరికతో నిండు గ్రామం ప్రాణాలతో బయటపడింది. ప్రకృతి ప్రకోపాలు ఎప్పుడు వస్తాయో తెలియకపోయినా, కొన్నిసార్లు జంతువులు మనుషులకు అందని సంకేతాలను గ్రహించి ముందస్తు హెచ్చరికలు ఇస్తాయని ఈ సంఘటన నిరూపించింది.

విపరీత వర్షాలు, ప్రాణాంతక పరిస్థితులు

మండి జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 30 అర్ధరాత్రి సమయంలో సియతి గ్రామంలో ఒక కొండచరియ ఒక్కసారిగా విరిగిపడింది. సరిగ్గా అదే సమయంలో గ్రామంలోని ఒక భవనంలో రెండో అంతస్తులో నిద్రిస్తున్న ఒక కుక్క భయంకరంగా అరవడం ప్రారంభించింది. ఆ శబ్దానికి దాని యజమాని మేల్కొని పైకి వెళ్లగా, గోడలు పగిలినట్లు కనిపించాయి. అంతేకాకుండా, ఇంట్లోకి వరదనీరు ప్రవేశించడం మొదలైంది.

-ఒక్క కుక్క అరుపుతో గ్రామస్థుల రక్షణ

కుక్క హెచ్చరికను తేలికగా తీసుకోకుండా యజమాని అప్రమత్తమయ్యాడు. వెంటనే కుక్కను తీసుకుని కిందికి వచ్చి, ఇతర గ్రామస్థులను కూడా లేపి, వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాడు. కొద్ది నిమిషాల్లోనే కొండచరియ విరిగిపడి గ్రామంలోని అనేక ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే, కుక్క అరుపుతో అలర్ట్ అయిన మొత్తం 63 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో కొన్ని ఇళ్లు మాత్రమే దెబ్బతినకుండా ఉండగా, మిగతావన్నీ నాశనమయ్యాయి.

ప్రస్తుతం ఆ గ్రామస్థులంతా తియంబాలా గ్రామంలోని నైనా దేవి ఆలయంలో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. అనేక మంది తమ ఆస్తులు కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొందరికి అధిక రక్తపోటు సమస్యలు కూడా తలెత్తాయి. అయినప్పటికీ, ఆ కుక్క అరుపుతో ప్రాణాలతో బయటపడినందుకు తాము కృతజ్ఞతలతో నిండిపోయామని వారు అంటున్నారు.

మండి జిల్లాలో మరో విపత్తు

మండి జిల్లాలోని తునాగ్ ప్రాంతంలో ఉన్న ఒక కోఆపరేటివ్ బ్యాంక్ కూడా వరదలతో పూర్తిగా మునిగిపోయింది. బ్యాంకులో ఉన్న బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువుల స్థితిగతులు ఇంకా తెలియరాలేదు. వాటిని దొంగల నుంచి రక్షించేందుకు గ్రామస్థులు వంతుపాటు రక్షణ చర్యలు చేపట్టారు.

వర్షాల ఉధృతి కొనసాగుతుంది

ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు వరదల కారణంగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగనున్నట్లు అధికారులు హెచ్చరించారు.

ఒక శునకం చేసిన అద్భుతం

ఒక శునకం చేసిన హెచ్చరిక ఒక గ్రామాన్నే కాపాడింది. జంతువులు మనకంటే ముందే ప్రమాదాలను గుర్తించగలవని మరోసారి నిరూపితమైంది. ఆ కుక్క చేసిన సహాయాన్ని ఆ గ్రామస్తులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఒక్కసారి ఆ అరుపు వినకపోయినా, పరిస్థితి ఎంత దారుణంగా మారేదో ఊహించలేం. ఈ సంఘటన మనకు మరోసారి చెబుతోంది. ప్రకృతితో పాటు మనం జంతువుల సంకేతాలను కూడా గౌరవించాలి.