Begin typing your search above and press return to search.

అతుల్ కుల‌క‌ర్ణి పహల్ గాం పర్యటన.. ఒక చర్య కాదు.. అది ఒక బలమైన ప్రతిఘటన

క‌శ్మీర్ లోయ.. కొన్ని వారాల క్రితం వ‌ర‌కు ప‌ర్యాట‌కుల సంద‌డితో క‌ళ‌క‌ళ‌లాడింది. శాంతిభ‌ద్ర‌త‌లు మెరుగుప‌డ‌టం, ఉగ్ర‌దాడులు త‌గ్గ‌డంతో ప‌లు సంవ‌త్స‌రాల త‌ర్వాత క‌శ్మీర్ ప‌ర్యాట‌క రంగం తిరిగి పుంజుకుంది.

By:  Tupaki Desk   |   28 April 2025 12:24 PM IST
Atul Kulkarni Brave Visit to Kashmir A Strong Message of Unity and Support
X

క‌శ్మీర్ లోయ.. కొన్ని వారాల క్రితం వ‌ర‌కు ప‌ర్యాట‌కుల సంద‌డితో క‌ళ‌క‌ళ‌లాడింది. శాంతిభ‌ద్ర‌త‌లు మెరుగుప‌డ‌టం, ఉగ్ర‌దాడులు త‌గ్గ‌డంతో ప‌లు సంవ‌త్స‌రాల త‌ర్వాత క‌శ్మీర్ ప‌ర్యాట‌క రంగం తిరిగి పుంజుకుంది. ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌కు నిల‌య‌మైన క‌శ్మీర్‌ను సంద‌ర్శించేందుకు దేశ‌విదేశాల నుంచి ప‌ర్యాట‌కులు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. అంతా సాఫీగా సాగిపోతుంద‌నుకుంటున్న స‌మ‌యంలో 'మినీ స్విట్జ‌ర్లాండ్'గా పేరొందిన ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన పాశ‌విక దాడి ప‌రిస్థితిని ఒక్క‌సారిగా మార్చేసింది. ఈ దాడిలో 26 మంది అమాయ‌కుల‌ను పొట్ట‌న‌పెట్టుకోవ‌డం క‌శ్మీర్ ప‌ర్యాట‌క చ‌రిత్ర‌లోనే అత్యంత దారుణ ఘ‌ట‌న‌గా నిలిచింది.

ఈ దాడి త‌ర్వాత క‌శ్మీర్ లోయ‌లో భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. అక్క‌డున్న ప‌ర్యాట‌కులు భ‌యంతో వెన‌క్కి రావ‌డం ప్రారంభించారు. భ‌విష్య‌త్ కోసం బుకింగ్స్ చేసుకున్న వారు పెద్ద సంఖ్య‌లో ర‌ద్దు చేసుకున్నారు. దీంతో ప‌ర్యాట‌కులు లేక హోట‌ళ్లు, రెస్టారెంట్లు, షికారా బోట్లు, ట్యాక్సీలు - ఇలా ప‌ర్యాట‌కంపై ఆధార‌ప‌డిన అన్ని రంగాలు కుదేల‌య్యాయి. క‌శ్మీర్ ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు.

ఇటువంటి క్లిష్ట ప‌రిస్థితిలో క‌శ్మీర్‌కు వెళ్ల‌డానికి అంద‌రూ భ‌య‌ప‌డుతున్న త‌రుణంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడైన బాలీవుడ్ న‌టుడు అతుల్ కుల‌క‌ర్ణి ప‌హ‌ల్గాంతో స‌హా క‌శ్మీర్‌లో ప‌ర్య‌టించ‌డం విశేషం. ఆయ‌న ఈ ప‌ర్య‌ట‌న ద్వారా స్ప‌ష్ట‌మైన, బ‌ల‌మైన సందేశాన్ని దేశానికి ఇవ్వాల‌ని ఉద్దేశించారు.

అతుల్ కుల‌క‌ర్ణి మాట్లాడుతూ ప‌హ‌ల్గాం దాడి ద్వారా క‌శ్మీర్‌కు ఎవ్వ‌రూ రావొద్ద‌నే సంకేతాల‌ను టెర్ర‌రిస్టులు ఇవ్వాల‌ని చూస్తున్నార‌ని, దేశంలో విభ‌జ‌న తేవాల‌నేది వారి కుట్ర అని అన్నారు. వారి ల‌క్ష్యాన్ని మ‌నం నెర‌వేర్చ‌కూడ‌ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. దాడి త‌ర్వాత 90 శాతం ప‌ర్యాట‌క బుకింగ్స్ ర‌ద్ద‌య్యాయ‌ని, ఇది క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా బాధిస్తోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

"క‌శ్మీర్ అద్భుత‌మైన ప్ర‌దేశం. అక్క‌డి ప్ర‌జ‌లు ఎంతో మంచివారు. ఉగ్ర‌వాదుల భ‌యానికి త‌లొగ్గి ప‌ర్యాట‌కాన్ని ఆపేస్తే, అది ఉగ్ర‌వాదుల‌కు మ‌నం దొరికిపోయిన‌ట్లే. మ‌నం ఉగ్ర‌వాదుల మీద పోరాటం ఆప‌కూడ‌దు, అదే స‌మ‌యంలో క‌శ్మీర్‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డాలి. దేశ ప్ర‌జ‌లంతా క‌శ్మీర్‌ను సంద‌ర్శించి, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉన్నామ‌ని చాటాలి" అని అతుల్ కుల‌క‌ర్ణి స్ప‌ష్టం చేశారు. తాను ఇక‌ముందు కూడా క‌శ్మీర్‌ను సంద‌ర్శిస్తూనే ఉంటాన‌ని ఆయ‌న తెలిపారు.

అతుల్ కుల‌క‌ర్ణి చ‌ర్య కేవ‌లం ఒక ప‌ర్య‌ట‌న కాదు.., అది ఒక బ‌ల‌మైన ప్ర‌తిఘ‌ట‌న‌. ఉగ్ర‌వాదంపై, భ‌యంపై ఆయ‌న వేసిన అడుగు. భ‌యం, అభ‌ద్ర‌తా భావంతో వెనుక‌డుగు వేస్తున్న స‌మ‌యంలో, ధైర్యంగా ముందుకు వ‌చ్చి క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌కు సంఘీభావం తెల‌ప‌డం ఆయ‌న గొప్ప మ‌న‌స్సుకు, ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం. క‌శ్మీర్ ప‌ర్యాట‌క రంగాన్ని, త‌ద్వారా అక్క‌డి ప్ర‌జ‌ల జీవ‌నోపాధిని కాపాడ‌టం కూడా ఉగ్ర‌వాదంపై పోరాటంలో ఒక భాగ‌మేన‌ని ఆయ‌న త‌న చ‌ర్య ద్వారా చాటిచెప్పారు.

అతుల్ కుల‌క‌ర్ణి సాహ‌సోపేత ప‌ర్య‌ట‌న‌, ఆయ‌న ఇచ్చిన స్ఫూర్తిదాయ‌క సందేశం ప్ర‌శంస‌నీయం. ఇది దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఒక గుణ‌పాఠం. ఉగ్ర‌వాదుల ల‌క్ష్యాల‌ను భ‌యం ద్వారా నెర‌వేర్చ‌కుండా, ఐక్య‌మ‌త్యంతో, ధైర్యంతో క‌శ్మీర్‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను అతుల్ గుర్తుచేశారు. ఆయ‌న స్ఫూర్తితో మ‌రెంద‌రో క‌శ్మీర్‌ను సంద‌ర్శించి, అక్క‌డి ప‌రిస్థితిని మామూలు స్థితికి తీసుకురావ‌డంలో భాగ‌స్వాముల‌వుతార‌ని ఆశిద్దాం. ఇటువంటి ప‌ట్టుద‌ల‌, సామాజిక బాధ్య‌త క‌లిగిన న‌టుడికి నిజంగా స‌లాం కొట్టాల్సిందే.