లిక్కర్ స్కాంలో బిగ్ వికెట్లు ఔట్.. బిగ్ బాస్ కు ముప్పేనా?
లిక్కర్ స్కాంలో ఏ31గా ధనుంజయ్ రెడ్డి, ఏ 32గా క్రిష్ణమోహన్ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి.
By: Tupaki Desk | 16 May 2025 11:28 PM ISTఏపీ మద్యం స్కాంలో ఇద్దరు ప్రధాన నిందితులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు క్రిష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం సిట్ అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ఇద్దరి అరెస్టుకు దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకున్నారు. లిక్కర్ స్కాంలో ఏ31గా ధనుంజయ్ రెడ్డి, ఏ 32గా క్రిష్ణమోహన్ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం ఇద్దరు నిందితులు పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో సిట్ అధికారులు నిందితులను అరెస్టు చేశారు.
గత ప్రభుత్వంలో ధనుంజయ్ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఒకరు సీఎంవో కార్యదర్శిగా ప్రభుత్వాన్ని శాసిస్తే, మరొకరు సీఎం ఓఎస్డీగా ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా పనిచేశారని చెబుతారు. ఆ స్థాయిలో పనిచేసిన ఇద్దరు మాజీ అధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితులు అంతా ఈ ఇద్దరి పాత్రపై తమ వాంగ్మూలాలివ్వడంతో సిట్ అధికారులు వారి అరెస్టుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.
ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు ఇతర నిందితులు ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి పాత్రపై వాంగ్మూలమిచ్చినట్లు చెబుతున్నారు. దీంతో అరెస్టు భయంతో ఆ ఇద్దరు హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత వారి బెయిల్ పిటిషన్లు విచారించిన ఉన్నత న్యాయస్థానాలు అరెస్టు విషయంలో రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితులు శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు సూచనలతో సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు నెల రోజులుగా అరెస్టు భయంతో అజ్ఞాత వాసంలో ఉన్న నిందితులు సుప్రీం సూచనలతో బయటకు వచ్చారు.
అయితే శుక్రవారం వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంతో నిందితుల అరెస్టుకు సిట్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించింది. దీంతో మూడో రోజు విచారణకు హాజరైన నిందితులను విజయవాడలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సుప్రీం తీర్పు వచ్చిన మరుక్షణమే నిందితుల అరెస్టుపై క్లారిటీ ఉన్న సిట్ మరో అవకాశం ఇస్తుందనే ఆలోచన కొంత వరకు ఉత్కంఠ రేపింది. అయితే గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని సిట్ చాన్స్ తీసుకోలేదని అంటున్నారు.
మద్యం స్కాంలో ఇద్దరు కీలక నిందితుల అరెస్టుతో కుంభకోణంలోని అంతిమ లబ్ధిదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. స్కాంలో రూ.3,200 కోట్లు కమీషన్ గా వసూలు చేసి బిగ్ బాస్ కు అందజేసినట్లు నిందితులు చెబుతున్నారని అంటున్నారు. అయితే బిగ్ బాస్ ఎవరనేది స్పష్టత రావాల్సివుందని అంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో స్కాంలో 90 శాతం ఛేదించినట్లేనని అంటున్నారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారును తెరపైకి తెస్తే దర్యాప్తు ముగిసినట్లేనని అంటున్నారు. అయితే అంతిమ లబ్దిదారు అయిన బిగ్ బాస్ ను టచ్ చేస్తారా? లేదా? అనేదే సస్పెన్స్ గా మారింది.