ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కు సరిసాటి మన ఆకాశ్!
భూమి మీద నుంచి ఆకాశంలోని టార్గెట్లను చేధించేందుకు వీలుగా సిద్ధం చేసిన రక్షణ క్షిపణులు ఆకాశ్. దీని పరిధి 30 కిలోమీటర్లు.
By: Tupaki Desk | 16 May 2025 10:44 AM ISTఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు.. క్షిపణుల్ని మార్గమధ్యంలోనే అడ్డుకోవటం.. వాటి అంతు చూడటంలో కీలకభూమిక పోషించింది ఆకాశ్. తుర్కియో.. చైనా అందించిన క్షిపణుల్ని.. డ్రోన్లను భారత్ మీదకు ప్రయోగించిన పాక్ కు అవమానభారాన్ని మిగిల్చటంలో కీలకభూమిక పోషించింది ఆకాశ్ క్షిపణులు. ఇంతకూ ఈ క్షిపణి వ్యవస్థ ఎలా పని చేస్తుంది? దీని పరిధి ఎంత? ఇప్పుడు అప్ గ్రేడ్ చేస్తున్న ఆకాశ్ పరిది ఎంత? ఇది ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ కు సరిసాటి అవుతుందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..
భూమి మీద నుంచి ఆకాశంలోని టార్గెట్లను చేధించేందుకు వీలుగా సిద్ధం చేసిన రక్షణ క్షిపణులు ఆకాశ్. దీని పరిధి 30 కిలోమీటర్లు. శత్రు క్షిపణుల్ని.. డ్రోన్ల అంతుచూడటంలో ఆకాశ్ సత్తా ఎంతన్నది తాజాగా చోటు చేసుకున్న ఉద్రిక్తతల నడుమ ప్రపంచానికి తెలిసింది. గగనతలంపై నిఘా ఉండే రాడార్లు.. ఇతర డ్రోన్లు.. క్షిపణులు.. రాకెట్లు వచ్చే దిశ.. ఎత్తు తదితర అంశాల్ని గమనిస్తాయి. దాదాపు 120కిలోమీటర్ల పరిధిలో ఈ రాడార్లు కన్నేసి ఉంచుతాయి.
ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. అగ్నికి వాయువు తోడైతే విధ్వంసం ఎంత ఎక్కువగా ఉంటుందో.. సరిగ్గా అదే తీరులో ఆకాశ్ సత్తా చాటేందుకు రాజేంద్ర (రాడార్ వ్యవస్థ) తోడుగా ఉంటుంది. దీంతో.. శత్రువులకు చుక్కలు చూపించటమే కాదు.. వారి ఎత్తుల్ని చిత్తు చేయటంతో వీరిద్దరి కాంబినేషన్ అదరహో అన్నట్లుగా ఉంటుందని చెప్పాలి. ఆకాశ్ క్షిపణులకు రాజేంద్ర అనే రాడార్ వ్యవస్థ దన్నుగా నిలుస్తుంది.
ఏదైనా అనుమానిత వస్తువు మన గగనతలంలోకి వస్తే వెంటనే ఆ సమాచారాన్ని ఆకాశ్ ఉన్న మొబైల్ లాంచర్ కు సమాచారాన్ని అందిస్తాయి. ఆ వెంటనే ఆకాశ్ క్షిపణి వెళ్లి మన గగనతలంలోకి వస్తున్న లక్ష్యాల్ని నిర్వీర్యం చేస్తుంది. అవసరానికి అనుగుణంగా తాను వెళ్లే మార్గాన్ని మార్చుకునే సౌలభ్యం ఆకాశ్ కు ఉండటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఆకాశ్ ను మరింత మెరుగుపర్చే అంశంపై పరిశోధనలు సాగుతున్నాయి. అందుకు తగ్గట్లే కొత్తతరం ఆకాశ్ లు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే వీటికి సంబంధించిన పరీక్షలు విజయవంతం అయ్యాయి. ఆకాశ్ క్షిపణుల రేంజ్ ను ఇప్పుడున్న దానికి రెట్టింపు కంటే ఎక్కువ చేయనున్నారు. ఇప్పుడు వీటి రేంజ్ 70కిలోమీటర్లకు పెంచనున్నారు.