Begin typing your search above and press return to search.

30 ఏళ్లకే సత్తా చాటిన శాస్త్రవేత్త... ఆకాశ్‌ విజయ రహస్యం వెనుక ఉన్నది ఈయనే

ఈ అద్భుతమైన క్షిపణి వెనుక అద్భుతమైన మేధస్సు, అంకితభావం దాగి ఉన్నాయి. ఆయనే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దిగ్గజ శాస్త్రవేత్త ప్రహ్లాద రామారావు!

By:  Tupaki Desk   |   16 May 2025 1:00 PM IST
Prahlada Rama Rao - The Missile Genius Behind Akash Who Secured Indias Skies
X

భారతదేశపు రక్షణ రంగ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సరిహద్దులు దాటి వచ్చిన శత్రు ముప్పును సమర్థవంతంగా తిప్పికొడుతూ భారతీయ ఆకాశాన్ని ఒక దుర్బేద్యమైన కోటలా మార్చిన అస్త్రం గురించి తెలుసా? అదే 'ఆకాశ్' క్షిపణి! ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్‌'లో ఈ క్షిపణి తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. శత్రువుల డ్రోన్లను, క్షిపణులను పిట్టల్లా కూల్చి, భారత గగనతలాన్ని కాపాడింది. ఈ అద్భుతమైన క్షిపణి వెనుక అద్భుతమైన మేధస్సు, అంకితభావం దాగి ఉన్నాయి. ఆయనే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దిగ్గజ శాస్త్రవేత్త ప్రహ్లాద రామారావు!

కర్ణాటకలో ఒక విద్యావంతుల కుటుంబంలో జన్మించిన ప్రహ్లాద రామారావు, ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన తర్వాత అనేక అవకాశాలు వచ్చినా, ఉన్నత విద్యపై మక్కువతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISc)లో చేరారు. అక్కడే, హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ ల్యాబ్‌లో పనిచేసే అవకాశం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ ఆయన భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను కలిశారు. ఆ క్షణం నుంచి కలాంను తన గురువుగా భావించి ఆయనతో కలిసి పనిచేయడం ప్రారంభించారు.

అబ్దుల్ కలాం నేతృత్వంలోని బృందం 1970ల చివర్లో ప్రతిష్టాత్మకమైన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP)ను ప్రారంభించింది. అగ్ని, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగ్ వంటి ఐదు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. 1983లో IGMDP పూర్తిస్థాయిలో ప్రారంభం కాగా, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ అభివృద్ధి బాధ్యతను ప్రహ్లాద రామారావు స్వయంగా స్వీకరించారు. అబ్దుల్ కలాం ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచి ఈ కీలకమైన విభాగాన్ని అప్పగించారు. ఆ సమయంలో రామారావు కేవలం 30 ఏళ్ల యువకుడు కావడం విశేషం.

ఈ ఐదు క్షిపణి వ్యవస్థల్లో ఆకాశ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భూమి నుండి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రం నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉండేది. IGMDP బడ్జెట్‌లో కూడా దీనికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. క్షిపణి అభివృద్ధి పూర్తయిన తర్వాత 1990లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. అనేక దశల్లో దానిని మెరుగుపరుస్తూ వచ్చారు. 2005 నాటికి అత్యంత వేగంగా దూసుకొస్తున్న లక్ష్యాలను సైతం గుర్తించడంలో ఆకాశ్ అద్భుతమైన కచ్చితత్వాన్ని సాధించింది. తద్వారా భారతీయ రక్షణ వ్యవస్థలో ఒక తిరుగులేని ఆయుధంగా నిలిచింది. దీని వెనుక ప్రహ్లాద రామారావు అలుపెరగని కృషి ఎనలేనిది.

ఆకాశ్ క్షిపణిని తన సొంత బిడ్డగా అభివర్ణించే ప్రహ్లాద రామారావు, అది తన లక్ష్యాన్ని కచ్చితత్వంతో తాకడం తన జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణాల్లో ఒకటని చెబుతారు. 2000 సంవత్సరంలో డీఆర్ఢీవో నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఆయన తన సేవలను కొనసాగించారు. డిఫెన్స్ టెక్నాలజీ యూనివర్సిటీ-పుణె వైస్-ఛాన్సలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ప్రపంచ ఇంధన సమస్యలకు ఒక విప్లవాత్మక పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో కోల్డ్ ఫ్యూజన్ రియాక్టర్‌పై పరిశోధనలు చేస్తున్నారు.

తాజాగా పాకిస్థాన్‌పై జరిగిన ఆపరేషన్‌లో ఆకాశ్ క్షిపణి కీలక పాత్ర పోషించడంతో ప్రహ్లాద రామారావు పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. భారతదేశంలోని అత్యంత గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. కేవలం ఆకాశ్ క్షిపణి మాత్రమే కాదు, బ్రహ్మోస్ క్షిపణి తయారీలో కూడా ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనది. బ్రహ్మోస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2015లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.