లైంగిక వేధింపుల్లో నటుడిపై సంచలన తీర్పు
మహిళా నటీమణి అనుమతి లేకుండా ఆమెను రాజ్ తాకాడనేది ఆరోపణ. ఆమె ముసుగును సరిచేసేందుకు తాకాడని, ఆమె ప్రదర్శన గురించి కామెంట్లు చేశాడని ఆరోపించింది ఆ నటి.
By: Tupaki Desk | 16 May 2025 11:27 PM ISTఅన్ని సినీపరిశ్రమల్లో లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అంతర్గత క్రమశిక్షణ కమిటీలు కొంతవరకూ పరిష్కారం చూపుతుంటే, కొన్ని కోర్టు గడప వరకూ వెళుతున్నాయి. తాజాగా లైంగిక వేధింపుల కేసులో నటుడు విజయ్ రాజ్ పై వచ్చిన అన్ని అభియోగాల నుంచి ఆయనను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఇది 2020 నాటి కేసు. విద్యాబాలన్ నటించిన `షెర్ని` సినిమా షూటింగ్ సందర్భంగా ఒక మహిళా సహోద్యోగి ఈ కేసు దాఖలు చేశారు. బుధవారం మహారాష్ట్రలోని గోండియాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ పూర్తయిన తర్వాత నటుడు విజయ్ రాజ్ ని నిర్దోషిగా ప్రకటించింది. విజయ్ రాజ్ దోషి అని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని కోర్టు తీర్పు చెప్పింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354-A (లైంగిక వేధింపులు) మరియు 354-D (వెంబడించడం) కింద అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి మహేంద్ర కేషావో సోర్టే అన్నారు. ఫలితంగా రాజ్ నిర్దోషిగా విడుదలయ్యారు.
మహిళా నటీమణి అనుమతి లేకుండా ఆమెను రాజ్ తాకాడనేది ఆరోపణ. ఆమె ముసుగును సరిచేసేందుకు తాకాడని, ఆమె ప్రదర్శన గురించి కామెంట్లు చేశాడని ఆరోపించింది ఆ నటి. తరువాత ఆమె తన సీనియర్లకు సమాచారం ఇచ్చి రామ్నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. విజయ్ రాజ్ను 4 నవంబర్ 2020న మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో అరెస్టు చేసి, అదే రోజు బెయిల్పై విడుదల చేశారు. దర్యాప్తులో పోలీసులు సిసిటివి ఫుటేజ్లను సేకరించి సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. అయితే కోర్టు విచారణలో తేలిన నిజాలు వేరుగా ఉన్నాయి. సాక్షులు ఎవరూ ఈ సంఘటనను నేరుగా చూడలేదు. సిసిటివి ఫుటేజ్లు వాదనలకు స్పష్టంగా మద్దతు ఇవ్వలేదు. ప్రధాన ఫిర్యాదుదారు విచారణ ముగిసేలోపు మరణించారు. ఇతర సాక్షులు తమ వాంగ్మూలాలను మార్చుకున్నారు లేదా సాక్ష్యాలను సమర్ధించలేకపోయారు. ఈ కారణాల వల్ల నటుడు రాజ్ ని దోషిగా నిర్ధారించేంత బలంగా కేసు లేదని కోర్టు తీర్పు ఇచ్చింది.
రాజ్ తరపున వాదించిన న్యాయవాది సవీనా బేడి సచార్ మాట్లాడుతూ-``తన క్లయింట్ అన్యాయంగా సినిమా షూటింగ్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చిందని, ఆరోపణల కారణంగా తన పనిని కోల్పోయాడ``ని తెలిపారు. ఎవరినైనా తీర్పు చెప్పే ముందు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండటం ఎందుకు ముఖ్యమో ఈ కేసు చూపిస్తుందని లాయర్ అన్నారు. రాజ్ బెయిల్ బాండ్ను రద్దు చేయాలని, పూచీకత్తు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ను నాశనం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే అప్పీల్ దాఖలు చేస్తే తన హాజరును నిర్ధారించడానికి రాజ్ ఏడు వేల బాండ్ను అందించాలని కోరారు.