ఓటీటీల్లో కూడా చిల్లర ఏరుకుంటున్నారా?
కరోనా మహమ్మారి కారణంగా లాభపడింది ఏదైనా ఉందంటే అది ఓటీటీ బిజినెస్ మాత్రమే. కరోనా తరువాత నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ల బిజినెస్ క్రమ క్రమంగా తారా స్థాయికి చేరి థియేటర్లని కనుమరుగు చేసే స్థాయికి వెళ్లింది.
By: Tupaki Desk | 16 May 2025 10:00 PM ISTకరోనా మహమ్మారి కారణంగా లాభపడింది ఏదైనా ఉందంటే అది ఓటీటీ బిజినెస్ మాత్రమే. కరోనా తరువాత నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ల బిజినెస్ క్రమ క్రమంగా తారా స్థాయికి చేరి థియేటర్లని కనుమరుగు చేసే స్థాయికి వెళ్లింది. రెండు మూడు వారాల్లో సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో ఆ వరకు ప్రేమీకులు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. దీంతో థియేటర్ వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవడం మొదలు పెట్టింది.
స్టార్ హీరోల సినిమాలతో పాటు పేరున్న కంపనీలు నిర్మించిన సినిమాలకు ఓటీటీలు మంచి రేట్ని కోట్ చేస్తుండటంతో చిన్న సినిమాలు కూడా ఓటీటీల్లోకి వెంట వెంటనే వచ్చేస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ తగ్గి ఓటీటీ బిజినెస్ బాగా పెరగడంతో ఓటీటీల్లో కొత్త బ్యాచ్ చేతి వాటం చూపించడం మొదలు పెట్టింది. ధియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాని పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో చాలా మంది దర్శకులు ఓటీటీల్లో సినిమాలు, సిరీస్లు చేయాలని స్క్రిప్ట్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
అయితే ఇలా తిరుగుతున్న దర్శకనిర్మాతలకు అక్కడ ఉండే చిల్లర బ్యాచ్ ఇబ్బందికరంగా మారుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య దర్శకుడు హరీష్ శంకర్ సైతం ఓటీటీ సిబ్బంది తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే. డైరెక్టర్ వ్యాల్యూ, సినిమా అంటే ఏంటో తెలియని, సినిమాలు తీయలేని బ్యాచ్లు అక్కడ చేరి ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు.
ఆయన చెప్పిన మాటలని ఇప్పుడు కొన్ని ఓటీటీల్లోని వారు అక్షర సత్యం చేస్తున్నారు. సినిమాలు, లేదా సిరీస్లు చేయాలని సంప్రదిస్తున్నవారితో డీల్స్ మాట్లాడుకుని, ప్రాజెక్ట్ ఓకే చేయిస్తే రూ.20 నుంచి 25 లక్షల వరకు కమీషన్ ఇవ్వాలని వేధిస్తున్నారట. అలా ఇవ్వని వారు ఎంత మంచి కథ చెప్పినా చెత్తకథ అని చెప్పి అవకాశం లేకుండా చేస్తున్నారట. ఇలా ప్రవర్తిస్తున్న వాళ్లకు సినిమాపై పెద్దగా అవగాహన లేకపోవడం గమనార్హం. 25 నుంచి 35 ఏళ్లున్న వాళ్లే కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్లలో చిల్లర ఏరుకుంటూ కొంత మంది డైరెక్టర్లు, నిర్మాతల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.