విశాఖలో ఆ మాత్రం ఉంటది… నెక్స్ట్ స్పోర్ట్స్ హబ్ ఆఫ్ ఇండియా!
భారత్–దక్షిణాఫ్రికా పోరు చివరి బంతి వరకు ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా ఉంచింది. భారత జట్టు చివరి ఓవర్ వరకు బలంగా పోరాడినా, చివరికి స్వల్ప తేడాతో ఓడిపోయింది.
By: A.N.Kumar | 10 Oct 2025 3:51 PM ISTవిశాఖపట్టణం మరోసారి తన క్రికెట్ చరిత్రలో గోల్డెన్ పేజీని రాసుకుంది. మహిళా క్రికెట్ ప్రపంచకప్లో గురువారం జరిగిన భారత్–దక్షిణాఫ్రికా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగి, అభిమానులను చివరి వరకూ ఉత్కంఠలో ఉంచింది. ఈ మ్యాచ్ ఫలితం ఎంతగానో ఆశ్చర్యపరిచినా, విశాఖ స్టేడియం సాక్షిగా నిలిచిన క్రికెట్ పండుగకు సమానం.
విశాఖలో క్రికెట్ జ్వరం
మహిళా ప్రపంచకప్ పోటీలు ప్రారంభమై దాదాపు పది రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పెద్దగా ఉత్సాహాన్ని రేపే మ్యాచ్ ఏదీ జరగలేదు. కానీ విశాఖపట్టణం మాత్రం ఈ నిశ్శబ్దాన్ని ఛేదించింది. భారత్–సౌత్ ఆఫ్రికా పోరు ప్రతి ఓవర్, ప్రతి బంతి, ప్రతి షాట్ ప్రేక్షకుల హృదయ స్పందనలతో సమానంగా సాగింది.
విజయవాడ, హైదరాబాద్లతో పోలిస్తే అంతగా ప్రాధాన్యం పొందని విశాఖ స్టేడియం, ఈ మ్యాచ్ ద్వారా మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. ఉత్తమ మౌలిక సదుపాయాలు, సక్రమ నిర్వహణ, సౌకర్యవంతమైన సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండటం విశాఖ స్టేడియం బలాన్ని స్పష్టంచేసింది.
లోకేశ్ ఫోకస్తో వచ్చిన మార్పులు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ క్రీడా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా విశాఖలో క్రికెట్ మౌలిక వసతులను మెరుగుపర్చడంపై దృష్టి సారించారు. బీసీసీఐ, ఐసీసీ అధ్యక్షుడు జై షాతో వ్యక్తిగతంగా సమావేశమై, రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లు పెరగాలన్న దిశగా కృషి చేశారు.
ఆ ప్రయత్నాల ఫలితంగా మొదట ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లు విశాఖలో నిర్వహించగా, ఇప్పుడు మహిళల ప్రపంచకప్ పోటీలకు వేదికగా నిలవడం గర్వకారణం. ఇది విశాఖను క్రీడా అభివృద్ధి కేంద్రంగా రూపుదిద్దుతున్న సంకేతం.
మ్యాచ్లో ఉత్కంఠ శిఖరాలకు..
భారత్–దక్షిణాఫ్రికా పోరు చివరి బంతి వరకు ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా ఉంచింది. భారత జట్టు చివరి ఓవర్ వరకు బలంగా పోరాడినా, చివరికి స్వల్ప తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ ఈ మ్యాచ్ అందించిన థ్రిల్, క్రీడాస్ఫూర్తి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
విశాఖ పిచ్ బ్యాలెన్స్, అవుట్ఫీల్డ్ వేగం, ఆటగాళ్లకు అందించిన సదుపాయాలు అన్నీ అత్యుత్తమంగా నిలిచాయి. ఇది విశాఖ క్రికెట్ వేదిక అంతర్జాతీయ గుర్తింపు పొందే దిశగా ముందడుగుగా భావిస్తున్నారు.
భవిష్యత్తు వైపు విశాఖ అడుగులు
సరైన ప్రణాళిక, నిరంతర అభివృద్ధి, క్రీడా సదుపాయాల విస్తరణతో విశాఖ స్టేడియం రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ క్రికెట్లో కీలక వేదికగా నిలవనుంది. ఇది నగరానికి క్రీడాపరమైన గౌరవాన్ని మాత్రమే కాదు, ఆర్థిక, పర్యాటక రంగాల్లో కూడా ఉత్సాహాన్ని తీసుకువస్తుంది.
క్రీడాభిమానులు, విశాఖ ప్రజలంతా ఇప్పుడు ఒకే మాట చెబుతున్నారు.. “విశాఖ… నెక్స్ట్ స్పోర్ట్స్ హబ్ ఆఫ్ ఇండియా!” అని చూడాలి మరి ఏం జరుగుతుందో..
