నీ పాపిష్టి చేత్తో కప్ తీసుకోం పో.. పాక్ నఖ్వికి టీమ్ ఇండియా షాక్
భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ సరిగ్గా 10.30కు ముగిసింది. ఆ వెంటనే ప్రజంటేషన్ సెర్మనీ మొదలుకావాలి. కానీ, 11.45 కు కూడా సందిగ్ధం వీడలేదు.
By: Tupaki Entertainment Desk | 29 Sept 2025 9:18 AM ISTపెహల్గాంలో అమాయక పర్యటకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులకు అడ్డా అయిన పాకిస్థాన్ కు ఆసియా కప్ లో దిమ్మతిరిగే షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది టీమ్ ఇండియా. అసలు ఈ కప్ లో మేం ఆడేది లేదు పొమ్మని మొదటే తేల్చి చెప్పింది. కానీ, కీలక టోర్నీ కావడంతో కాస్త మెత్తబడింది.. అయితే, అది మైదానంలో మాత్రం కాదు.. టాస్ సందర్భంగానే కాదు.. మ్యాచ్ ముగిశాక కూడా పాక్ ఆటగాళ్లకు మూడు మ్యాచ్ లలోనూ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా
మూడుసార్లు ఓడించింది వాళ్ల మొహం మాడ్చేసింది. దీంతో కడుపు ఉబ్బిపోయిన పాక్ జట్టు తొలి మ్యాచ్ అనంతరం రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ మీద పడి ఏడ్చింది. సూపర్ 4లో ఆ జట్టు ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ గాల్లో తుపాకీ పేల్చుతున్నట్లు, పేసర్ హారిస్ రవూఫ్.. ఫైటర్ జెట్లు కూలిపోతున్నట్లుగా శ్రుతి మించి సంబరాలు జరుపుకొని పైశాచిక ఆనందం పొందారు.
ఇదీ అసలైన ఫినిషింగ్ టచ్...
భారత్ తో వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోవడం.. రవూఫ్ కు 30 శాతం జరిమానా, ఫర్హాన్ కు హెచ్చరికలు రావడంతో ఫైనల్లో పాక్ ఆటగాళ్లు కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకున్నారు. ఇక తుది సమరం ముగిశాకనే అసలు డ్రామా మొదలైంది. సహజంగా సంప్రదాయం ప్రకారం ఆసియా కప్ టైటిల్ ను విజేత జట్టుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) అధ్యక్షుడు అందజేస్తారు. ఈసారి కూడా అలానే జరగాలి. కానీ, కథ మారింది. కారణం.. ఏసీఏ అధ్యక్షుడిగా ఉన్నది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ. శ్రీలంకనో, అఫ్ఘానిస్థానో ఆఖరికి బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి ఏసీఏ చీఫ్ గా ఉన్నా మనవాళ్లు కప్ అతడి చేతుల మీదుగా అందుకునేవారు. కానీ, నఖ్వీ నుంచి మాత్రం తాము తీసుకునేది లేదని తేల్చిచెప్పారు.
కప్ లేకుండా ఖాళీ చేతులతోనే..
భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ సరిగ్గా 10.30కు ముగిసింది. ఆ వెంటనే ప్రజంటేషన్ సెర్మనీ మొదలుకావాలి. కానీ, 11.45 కు కూడా సందిగ్ధం వీడలేదు. నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీ కానీ, మెడల్స్ కానీ తీసుకునే ఉద్దేశం లేదని భారత జట్టు స్పష్టం చేసింది. దీంతో కప్ లేకుండానే... ప్రజంటేషన్ సెర్మనీ ప్రదేశంలో భారత ఆటగాళ్లు చేతులు పైకెత్తి సంబరాలు జరుపుకొన్నారు. మొత్తానికి షేక్ హ్యాండ్ లే కాదు.. ట్రోఫీ బహూకరణ ఆనందం కూడా పాక్ కు మిగల్చకుండా టీమ్ ఇండియా గట్టి బుద్ధి చెప్పింది.
నఖ్వీ ఏసీఏ, పీసీబీ అధ్యక్షుడే కాదు పాక్ మంత్రి కూడా...
సయ్యద్ మొహసిన్ రజా నఖ్వీ.. ఏసీఏ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడే కాదు.. పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రి కూడా. ఆ దేశ మీడియా దిగ్గజం. గత ఏడాది ఫిబ్రవరిలో పీసీబీ చీఫ్ అయ్యాడు. మార్చి నుంచి పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఏసీఏ అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్నారు. భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కారణం అని, అతడిని యూఏఈతో మ్యాచ్ కు తప్పించకుంటే బాయ్ కాట్ చేస్తామని ఈ మొహిసిన్ నఖ్వీని చూసుకునే పాక్ ఆటగాళ్లు బెదిరించారు.
మొహం మాడిపోయిన నఖ్వీ...
నఖ్వీ చేతుల మీదుగా టీమ్ ఇండియా ఆసియా కప్ తీసుకునేందుకు నిరాకరించడం వెనుక మరో కారణం కూడా ఉంది. అతడు విజేత జట్టుకు ట్రోఫీ అందించేందుకు తన స్థానం నుంచి కదలడానికి నిరాకరించాడు. దీంతో బుద్ధి చెప్పాలని భావించిన టీమ్ ఇండియా మొత్తానికే ఎసరు పెట్టింది. దీంతో మొహిసిన్ నఖ్వీ మొహం మాడిపోయింది. ఈ క్రమంలోనే విజేత ట్రోఫీని అక్కడినుంచి తీసివేశారు.
-భారత ఆటగాళ్లు విన్నింగ్ ట్రోఫీని, విన్నర్స్ మెడల్స్ ను తీసుకోలేదు. పాక్ జట్టు రన్నరప్ ట్రోఫీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం నుంచి అందుకుంది.
-ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన తిలక్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అభిషేక్ శర్మ, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ (17 వికెట్లు)లు తమ రివార్డులను స్పాన్సర్ల నుంచి తీసుకున్నారు.
-ఆసియా కప్ గెలిచిన టీమ్ ఇండియా, సహాయక సిబ్బందికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రూ.21 కోట్ల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది.
