బంగ్లాకు జై 'షాక్'... భారత్ లోనే టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లు
భద్రతా కారణాలను చూపుతూ తమ మ్యాచ్ లను లంకలో నిర్వహించాలన్న బంగ్లా ప్రతిపాదనను ఐసీసీ తోసిపుచ్చింది.
By: Tupaki Entertainment Desk | 7 Jan 2026 12:26 PM ISTస్వదేశంలో మైనారిటీలైన హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులు, హత్యలను ఆపలేని బంగ్లాదేశ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి వారి పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను తప్పించడాన్ని మాత్రం తీవ్రంగా తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము భారత్ లో జరిగే టి20 ప్రపంచ కప్ లో ఆడలేం అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. తమ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ను కోరింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆదేశాలతోనే ఇదంతా చేసింది. కానీ, ఐసీసీ అధ్యక్షుడు జై షా ఆ దేశానికి గట్టి షాక్ ఇచ్చారు. భద్రతా కారణాలను చూపుతూ తమ మ్యాచ్ లను లంకలో నిర్వహించాలన్న బంగ్లా ప్రతిపాదనను ఐసీసీ తోసిపుచ్చింది. ఈ మేరకు మంగళవారం వర్చువల్ గా జరిగిన సమావేశంలో బంగ్లాకు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ మధ్యన భారత్, శ్రీలంక దేశాలు టి20 ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో భాగంగా లీగ్ దశలో బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్ లు భారత్ లో ఆడాల్సి ఉంది. వీటిలో మూడు ఆ దేశానికి దగ్గర్లోని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లోనే కావడం గమనార్హం. మరొక మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది.
భారత్ లో ఆడండి.. లేదంటే పాయింట్లు కట్
ఆడితే భారత్ లో ఆడండి, లేదంటే పాయింట్లు కట్ అంటూ బంగ్లాదేశ్ కు ఐసీసీ తేల్చిచెప్పినట్లు సమాచారం. కానీ, ఐసీసీ నుంచి తమకు ఇలాంటి ప్రతిపాదనలేమీ రాలేదని బంగ్లా బుకాయిస్తోంది. బంగ్లా తమ మ్యాచ్ ల తరలింపు ప్రతిపాదనను గత ఆదివారం తెలిపింది. మరో నెల రోజుల్లో టోర్నీ మొదలుకావాల్సి ఉండగా ఇలాంటి సమయంలో మ్యాచ్ ల తరలింపు అసాధ్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి అల్లర్లు జరుగుతున్నది బంగ్లాలో. బలవుతున్నది అక్కడి మైనారిటీలైన హిందువులు. భారత్ లో భద్రతాపరంగా ఇబ్బందులు ఏమీ లేవు. కేవలం ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ లో ఆడించడంపై భారత ప్రభుత్వం ఆదేశాలు, బీసీసీఐ సూచనలతో సంబంధిత ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నిర్ణయం తీసుకుంది. కానీ, బంగ్లా దీనిని మనసులో పెట్టుకుని భారత్ లో ప్రపంచ కప్ మ్యాచ్ లు ఆడబోం అని చెబుతోంది.
బంగ్లాకే బొక్క...
భారత్-లంక ఆతిథ్యం ఇస్తున్న టి20 ప్రపంచ కప్ లో 20 జట్లు పాల్గొంటున్నాయి. సరిగ్గా నెల రోజుల్లో మొదలవనున్న ఈ టోర్నీలో బంగ్లా గ్రూప్ -సిలో ఉంది. వచ్చే నెల 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లండ్ తో కోల్ కతాలో ఉండనుంది. నేపాల్ తో ఫిబ్రవరి 17నాటి మ్యాచ్ ముంబైలో జరుగనుంది. ఇప్పుడు నాలుగు మ్యాచ్ లు మార్చడం అంటే కష్టం. ఒకవేళ బంగ్లా ఆడకుంటే ఆ జట్టు ప్రపంచ కప్ నుంచి ఔట్ అయినట్లే. ఎందుకంటే దాని లీగ్ మ్యాచ్ లు మొత్తం భారత్ లోనే ఉన్నాయి కాబట్టి.
అదీ భారత్ పవర్...
భౌగోళికంగానే కాదు క్రికెట్లోనూ బంగ్లాకు బతుకునిచ్చిందే భారత్. మన దేశ జట్టుతోనే వారి టెస్టు క్రికెట్ ప్రస్థానం మొదలైంది. అలాంటి మన దేశం మీద ఎప్పుడూ ద్వేషంతోనే ఉన్నారు అక్కడి కొందరు వ్యక్తులు. ఇలాంటివారిలో తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ ఒకడు. నోబెల్ వంటి ప్రతిష్ఠాత్మక బహుమతి గెలుచుకున్న యూనస్ అందుకుతగ్గ స్థాయిలో మాత్రం హుందాగా లేడు. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల గురించి కూడా అతడు అవాకులుచెవాకులు పేలాడు. రాజకీయంగా పరిస్థితి అలా ఉంటే.. క్రికెట్ లోనూ భారత్ తో పెట్టుకోవాలని చూస్తోంది. కానీ, అక్కడ ఐసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నది జై షా అన్నది మర్చిపోయినట్లుంది.
