Begin typing your search above and press return to search.

సుశీల్ కేసులో కీలక మలుపు.. హత్యకు కారణం ఆ విదేశీ యువతేనట?

By:  Tupaki Desk   |   16 Jun 2021 5:30 AM GMT
సుశీల్ కేసులో కీలక మలుపు.. హత్యకు కారణం ఆ విదేశీ యువతేనట?
X
ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ మెడలిస్ట్, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్న యువ రెజ్లర్ సాగర్ ధన్ఖర్‌ హత్య కేసు తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సాగర్ ప్రాణాలు కోల్పోవడానికి ఓ విదేశీ మహిళ ప్రధాన కారణమైందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ కు చెందిన యువతి సాగర్ స్నేహితురాలు. కాగా, పుట్టిన రోజు పార్టీలో సుశీల్ ఫ్రెండ్ అజయ్ , ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని , ఆ కారణంగానే గొడవ స్టార్ట్ అయ్యిందని, అదే సాగర్ హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

యువ రెజ్లర్‌ సాగర్‌ హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసులో రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ నిందితుడి , కస్టడీలో ఉన్నాడు. అతని కస్టడీని జూన్‌ 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. రెజ్లర్‌ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్‌ సహా మొత్తం పది మందిని ఇప్పటివరకు అరెస్ట్‌ చేశారు. ఈ హత్య కేసులో అరెస్టుకు ముందు సుశీల్ కుమార్ మూడు వారాల పాటు పరారీలో ఉన్నాడు. ఇతని సహచరుడైన అజయ్ కుమార్ ని పోలీసులు మొదట అరెస్టు చేశారు. 15 రోజులు తీవ్రంగా గాలించిన ఢిల్లీ పోలీసులు ,లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు. సుశీల్ ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష నగదు రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు. అతడి కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఎట్టకేలకు పంజాబ్‌ లో చిక్కాడు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి పంజాబ్ వెళుతుండగా ఓ టోల్ గేట్ వద్ద సీసీటీవీలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పంజాబ్‌ లోని సుశీల్ స్నేహితుల సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని గాలింపు చేపట్టడంతో చివరకు పోలీసులకి దొరికాడు. సాగర్ మృతి చెందినప్పటి నుంచి సుశీల్ కుమార్ పరారీలోనే ఉన్నాడు. మే మొదటి వారంలో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ఖర్ చనిపోయాడు. సాగర్ పై దాడి చేసిన వారిలో సుశీల్ కుమార్ కూడా ఉన్నట్టు విచారణలో గుర్తించారు.