Begin typing your search above and press return to search.

అమెరికా అత్యంత సంపన్న మహిళల్లో భారతీయులు!

By:  Tupaki Desk   |   11 July 2023 11:40 AM GMT
అమెరికా అత్యంత సంపన్న మహిళల్లో భారతీయులు!
X
భారతీయులు, భారత సంతతి వ్యక్తుల శక్తిసామర్థ్యాలు అంతర్జాతీయంగా మరోసారి నిరూపితమయ్యాయి. అమెరికా లో తొలి వంద మంది "స్వయంకృషితో ఎదిగిన మహిళా సంపన్నుల" జాబితా ను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితా లో నలుగురు భారత సంతతి మహిళల కు చోటు దక్కింది. వ్యక్తిగత ఆస్తుల విలువతో పాటు, కంపెనీల్లో వారికున్న వాటాల విలువ ఆధారంగా ఈ జాబితా ను రూపొందించినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది.

అవును... "స్వయంకృషితో ఎదిగిన మహిళా సంపన్నుల" లిస్ట్ లో నలుగురు భారతీయ మహిళలు సత్తా చాటారు. మహిళా శక్తికి తిరుగులేదని నిరూపించే ప్రయత్నం చేశారు. వీరి లో... పెప్సికో మాజీ ఛైర్మన్‌, సీఈఓ ఇంద్రా నూయీ.. ఆరిస్టా నెట్‌ వర్క్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ జయశ్రీ ఉల్లాల్‌.. సింటెల్‌ ఐటీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ.. కాన్‌ ఫ్లూయెంట్‌ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే ఉన్నారు.

వీరిలో జయశ్రీ ఉల్లాల్ విషయాని కొస్తే... సిలికాన్‌ వ్యాలీ ఇంజనీర్‌ అయిన 62 ఏళ్ల జయశ్రీ ఉల్లాల్‌ ప్రస్తుతం అరిస్టా నెట్ వర్క్ కు ప్రెసిడెంట్, సీఈవో గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ప్రస్తుతం 2.4 బిలియన్‌ డాలర్ల నికర ఆస్తులతో ఈ జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ఆరిస్టా నెట్‌ వర్క్‌ సంస్థలో ఆమెకు 2.4 శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్‌ తెలిపింది.

ఇక, 68 ఏళ్ల నీర్జా సేథి.. ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల ర్యాంకులో 25వ స్థానంలో ఉన్నారు. నీర్జా సేథి 1980లో మిచిగాన్‌ లోని ట్రాయ్‌ లో సొంత అపార్ట్‌ మెంట్‌ లో భర్త భరత్ దేశాయ్‌ తో కలిసి ఐటీ కన్సల్టింగ్, ఔట్‌ సోర్సింగ్ సంస్థ సింటెల్‌ ను స్థాపించారు. ప్రస్తుతం ఈమె 990 మిలియన్‌ డాలర్ల సంపదతో ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది.

38 ఏళ్ల నేహా నార్ఖెడే, ఫోర్బ్స్ 2023 మహిళా సంపన్నుల ర్యాంకులో 50వ స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 520 మిలియన్‌ డాలర్లు. నేహా గతం లో లింక్డ్‌ ఇన్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గా పనిచేశారు. అనంతరం కీలకమైన ఓపెన్‌ సోర్స్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌ అపాచీ కఫాను రూపొందించడం లో ఆమె కీలక పాత్ర పోషించారు. అనంతరం ఈమెకు సంస్థలో ఆరు శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ ఏడాది మార్చిలో కంపెనీ మోసాలను గుర్తించే ఓస్కీలార్‌ సంస్థను తన భర్తతో కలిసి ప్రారంభించారు.

పెప్సికో మాజీ సీఈవో అయిన 67 ఏళ్ల ఇంద్రానూయి 2023 స్వీయ మహిళా సంపన్నుల ర్యాంకులో 77వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఈమె 350 మిలియన్‌ డాలర్ల సంపదతో ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. 24 ఏళ్ల పాటు పెప్సికో సంస్థలో అత్యున్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఇంద్రా నూయీ.. ఆ సంస్థ ఆదాయాన్ని పెంచడంలో కీలక భూమిక పోషించారని చెబుతారు. ఈ క్రమంలో... 2019లో పెప్సికో నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి అమెజాన్‌ లో బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు.