Begin typing your search above and press return to search.

వారికి ఓటేస్తే దెయ్యాల‌కు పెన్ష‌న్లుః చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   5 July 2017 4:49 PM GMT
వారికి ఓటేస్తే దెయ్యాల‌కు పెన్ష‌న్లుః చంద్ర‌బాబు
X
కాంగ్రెస్ పార్టీపై ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పాల‌న‌లో దెయ్యాలు కూడా పెన్ష‌న్లు తీసుకొనేవ‌ని, మళ్ళీ ఆ దుర్మార్గులు అధికారంలోకి వస్తే దెయ్యాలు వస్తాయని అన్నారు. టీడీపీ పాలనలో దయ్యాలు లేవ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అనంత‌పురం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌జ‌ల నుంచి తాను పూర్తి స‌హ‌కారాన్ని మాత్ర‌మే కోరుకుంటున్నాన‌ని చంద్ర‌బాబు అన్నారు. ముక్తాపూర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేశామన్నారు. అక్రమాలుచోటుచేసుకోకుండా ఆధార్ కార్డును కూడ అనుసంధానం చేశామన్నారు. సంక్షేమ పథకాలు పక్కదారి పట్టే అవకాశమే లేదన్నారు.

డ్వాక్రా మహిళలకు, వృద్ధుల‌కు పెన్ష‌న్లు అందిస్తున్నామ‌ని, లబ్దిదారుడికే ఖాతాలోకే నేరుగా డబ్బులు జ‌మ అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. గర్బిణులకు ఎన్టీఆర్ కిట్, బసవతారకం కిట్ లను అందిస్తున్నామ‌ని తెలిపారు. ఎవరైనా చనిపోతే మహాప్రస్థానం పేరుతో వాహనాన్ని సమకూర్చి అంత్యక్రియలకు కూడ స‌హాయం అందిస్తున్నామ‌న్నారు.

పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సకాలంలో కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చామని చంద్ర‌బాబు తెలిపారు. జిల్లాలో రెయిన్ గన్లతో వేరుశెనగ పంటను కాపాడామని తెలిపారు. ప్రపంచం మొత్తం అనంతపురం కూరగాయలు, పళ్లు తినే రోజు వస్తుందని చెప్పారు. చెరువులకు నీళ్లు ఇచ్చి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీయిచ్చారు