Begin typing your search above and press return to search.

కోర్టు మాటలంటే లెక్కలేదా..ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం ?

By:  Tupaki Desk   |   2 July 2020 9:10 AM GMT
కోర్టు మాటలంటే లెక్కలేదా..ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం ?
X
తెలంగాణలో వైరస్ పరీక్షలు, రోగులకు అందుతున్నచికిత్స తీరుపై ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో పెద్ద మొత్తంలో టెస్ట్‌లు చేస్తున్నప్పటికీ తెలంగాణలో చేయడం లేదని విపక్షలు మండిపడుతున్నాయి. అంతేకాదు ఈ అంశంలో హైకోర్టు సైతం పలు మార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అయినా ప్రభుత్వ తీరు మారడం లేదు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం వైరస్ పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్నారు.. మరోవైపు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సరైన సౌకర్యాలు లేక కరోనా పరీక్షలు నిలిపి వేశామంటున్నారు. ప్రభుత్వ అధికారులు చెబుతున్న దాంట్లోనే తేడాలున్నాయి. దీనిని బట్టి చూస్తే ఐసీఎంఆర్‌ గైడ్ ‌లైన్స్‌ పాటించడం లేదని తెలుస్తోంది అంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది.

మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూన్ 26న ఎంత మందికి పరీక్షలు చేశారు? ఆ రోజు హైదరాబాద్‌ లో టెస్ట్‌లు ఎందుకు నిలిపివేశారో వివరాలను సమర్పించాలని ఆదేశించింది. జూన్‌ 25న ఇచ్చిన బులెటిన్‌లో ఈ సమాచారం ఉంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. వైరస్ మీడియా బులిటెన్‌ లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది

మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు దాని నుంచి ప్రజలను కాపాడడమే ప్రభుత్వ ప్రధాన విధిగా ఉండాలని చెప్పింది. రాజ్యాంగంలోని 21 అధికరణ పార్ట్‌-4లో అదే ఉందని ఎత్తి చూపింది. తమ ఆదేశాలు పాటించకపోతే వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ ఎంసీ కమిషనర్లు జూలై 21న జరిగే విచారణకు హాజరై, వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. జూన్‌ 8, 18 తేదీలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేస్తారని భావిస్తున్నట్లుచెప్పింది.

వైరస్ చికిత్స అందిస్తున్న వైద్యులకు, పారా మెడికల్‌ సిబ్బంది కి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ఇవ్వాలని, చని పోయిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని, సూర్యా పేట, నిర్మల్‌ జిల్లాల్లోని రెడ్‌, కంటైన్మెంట్‌ జోన్ల లో అందరికీ వైరస్ పరీక్షలు చేయాలని కోరుతూ తొమ్మిది మంది దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరో సారి విచారించింది. వైరస్‌ చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆసుపత్రుల్లో ఎలాంటి సౌకర్యాలున్నాయి? వైద్యులకు, పారా మెడికల్‌ సిబ్బంది కి ఇచ్చే పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కుల నిల్వలు ఏ మేరకు ఉన్నాయి? వివరిస్తూ ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు నివేదికలు ఇవ్వాలని 45 రోజుల కిందట తామిచ్చిన ఆదేశాలను ఇంతవరకు అమలు చేయలేదని ప్రస్తావించింది.

వచ్చే 10 రోజుల్లో ప్రభుత్వం 50 వేల వైరస్ పరీక్షలు చేయనుందని గతంలో కోర్టులో చెప్పిన శ్రీనివాసరావు ఇప్పుడు పది రోజుల్లో 30,877 పరీక్షలు మాత్రమే చేసినట్లు చెబుతున్నారని ప్రస్తావించింది. 33 జిల్లాలు ఉండగా ప్రభుత్వం కేవలం 12 జిల్లాల్లోనే పరీక్షలు చేస్తే మిగతా జిల్లాల సంగతేంటని నిలదీసింది. కరోనా కేసుల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉందన్నారు. ఈసారి నివేదికలు సమర్పించకపోతే.. కోర్టు ధిక్కరణగా భావిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.