Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: మోడీ వైఫల్యాన్ని ఎత్తిచూపిన శాంత బయోటెక్ ఎండీ

By:  Tupaki Desk   |   7 May 2021 11:16 AM GMT
వైరల్ వీడియో: మోడీ వైఫల్యాన్ని ఎత్తిచూపిన శాంత బయోటెక్ ఎండీ
X
కరోనాను సరిగ్గా ఎదుర్కోలేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను గతంలో పిచ్చివాడని అందరూ ఆడిపోసుకున్నారు. కానీ ఆ పిచ్చివాడైన ట్రంప్ ముందు చూపే ఇప్పుడు ఆ దేశాన్ని కరోనా నుంచి విముక్తులను చేసిందని ప్రముఖ ఫార్మా కంపెనీ శాంత బయోటెక్ ఎండీ కే వరప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాక్సిన్ పరిశోధన దశలోనే బిలియన్ డాలర్ల సొమ్మును వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఇచ్చి అమెరికా జనాభాకు సరిపోయే వ్యాక్సిన్లను కొన్నాడని.. భారతదేశంలోని మోడీ ప్రభుత్వం ఇక్కడే ఫెయిల్ అయ్యిందని ఆయన వివరించారు.

భారతదేశం ఇప్పటివరకు అత్యంత ఘోరమైన ఆరోగ్య సంక్షోభానికి కారణం మోడీ సర్కార్ కు ముందు చూపులేకపోవడమేనని శాంత బయోటెక్ ఎండీ తెలిపారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం వైరస్ నిర్మూలించడానికి పెద్దగా కృషి చేయడం లేదని ఆయన ఆరోపించారు.. కేసులు లక్షల్లో.. మరణాలు వేలల్లో నమోదవుతున్నాయన్నారు. వ్యాక్సిన్ల కొరత కూడా ఇబ్బంది కలిగిస్తుందన్నారు.

''కరోనాతో ట్రంప్ హయాంలో ప్రపంచంలోనే అత్యంత దెబ్బతిన్న దేశమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఆ కరోనా నుంచి కోలుకుంటోంది. కేసులు తగ్గుతున్నాయి. వైరస్ ను నియంత్రించడంలో అమెరికా ఎలా విజయం సాధించింది? భారతదేశం ఎక్కడ విఫలమైంది?'' అని శాంత బయోటెక్ వ్యవస్థాపకుడు, కె వర ప్రసాద్ రెడ్డి మన దేశంలోని రాజకీయ నాయకులను ఈ విషయంలో నిందించాలని అభిప్రాయపడ్డారు.

" కరోనా రెండో వేవ్ తో చాలా దేశాలు దెబ్బతిన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులకు ఈ రెండో వేవ్ గురించి తెలుసు. అయితే వారు తగిన చర్యలు తీసుకున్నారా? అన్నది ఇక్కడ ప్రశ్న. వారిదగ్గర సమాధానం లేదు ఎందుకంటే వారికి ఎన్నికలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.. ఈ పార్టీ దేశవ్యాప్తంగా తన పార్టీ బలాన్ని విస్తరించాలని కోరుకుంటుంది. ప్రజల ఆరోగ్యాన్ని విధికి వదిలివేసింది. ఫలితంగా మేము ఈ సంక్షోభాన్ని చూస్తున్నాము”అని వరప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ “అమెరికాలో వైరస్ వ్యాప్తి చెందకముందే, అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాక్సిన్ తయారీకి ఫైజర్, జాన్సన్ & జాన్సన్ వంటి సంస్థలకు 2 బిలియన్ డాలర్లను పరిశోధనకే మంజూరు చేశారు. అప్పటికింకా వ్యాక్సిన్ తయారీ కాలేదు. వారి జనాభా 33 కోట్లు, అప్పటి అమెరికా ప్రభుత్వం దాదాపు 65 కోట్ల మోతాదు వ్యాక్సిన్లను ముందస్తుగా బిలియన్ డాలర్లు వెచ్చించి ఆర్డర్ ఇచ్చింది. ఫలితంగా దాదాపు వారందరికీ వ్యాక్సిన్ వచ్చింది. మొదటి.. రెండోడోసు ” కూడా వారు వేసుకున్నారు.

కానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ముందస్తు చొరవ తీసుకోలేదని వరప్రసాద్ రెడ్డి అన్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను కేవలం రెండు కంపెనీలు దేశంలో తయారు చేస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ రెండు సంస్థల నుంచి భారత ప్రభుత్వం ఎన్ని వ్యాక్సిన్లు ఆర్డర్ చేసింది? ఇది కేవలం 4 కోట్ల మోతాదు. 130 కోట్ల జనాభాకు ఇది సరిపోతుందా? సీరం ఇన్స్టిట్యూట్ మరియు భారత్ బయోటెక్ లకు కేంద్రం ఎన్ని నిధులు మంజూరు చేసింది? అవి కేవలం చాలా తక్కువ మాత్రమే. 130 కోట్ల జనాభాకు దాదాపు 300 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ అవసరం. దీనికి చాలా డబ్బు అవసరం' కానీ కేంద్రం ఈ విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదు.

రాజకీయ వ్యవస్థలో లోపాల వల్లే ఈ దేశంలో ఈ దుస్థితి అని వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపి మరణిస్తే ఉప ఎన్నిక మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో జరుగుతుందని పేర్కొన్నారు. కానీ వైస్ ఛాన్సలర్ లేకుండా నడుస్తున్న అనేక విశ్వవిద్యాలయాలు దేశంలో ఉన్నాయి. ఇది విద్యార్థుల జీవితాలను మరియు భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని దేశవ్యవస్థపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భారతదేశంలో దురదృష్టకర పరిస్థితి అని, రాజకీయ నాయకుల ఈ తప్పును చరిత్ర గుర్తుంచుకుంటుందని బయోటెక్ నిపుణుడు తెలిపారు.