Begin typing your search above and press return to search.

సచివాలయం పరువు గంగలో కలిపేశారు!

By:  Tupaki Desk   |   4 Jun 2020 5:22 PM GMT
సచివాలయం పరువు గంగలో కలిపేశారు!
X
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక... గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలకు కొత్త కళ వచ్చింది. చాలా ఏళ్ల నుంచి వాటికి ప్రజలకు సంబంధం లేకుండా పోయింది. అయితే - వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు - గ్రామ సచివాలయానికి సిబ్బంది కేటాయింపుతో వాటికి మళ్లీ జీవం వచ్చింది. అన్ని సంక్షేమ పథకాలు అక్కడికి వెళ్తే లభ్యం అయ్యేలా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అయితే... కొన్ని ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. అలాంటి ఘటన ఒకటి అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప మండలంలో జరిగింది.

అంకంపల్లి గ్రామ సచివాలయంలో గ్రామకార్యదర్శి - వైసీపీ నాయకులు మందు పార్టీ చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తరచుగా అక్కడ ఇలాగే జరుగుతోందని - ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఇపుడు వెలుగులోకి వచ్చిందంటున్నారు. ఈ వీడియోలో గ్రామ కార్యదర్శి వెంకటేశులు - కొందరు వైసీపీ నేతలు ఉన్నట్టు చెబుతున్నారు.

వెంకటేశులు విధులు ముగిశాక కార్యాలయంలోనే మందుతాగుతున్న దృశ్యాలు వైరల్ కావడంతో అతను స్పందించారు. ఇది కొందరు కుట్రతో చేసిన పని అని - వారడిగిన పని చేయనందుకు ఇలా దుష్ప్రచారం చేశారని అన్నారు. తాగడం నేరం కాదు గాని మరీ సచివాలయంలోనే బార్ గా మార్చడంపై పలువురు జిల్లా స్థాయి వైసీపీ నేతలతో సహా అందరూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఎంపీడీవో ముస్తఫా కమల్‌ బాషా మాట్లాడుతూ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.