Begin typing your search above and press return to search.

అప్పుకు కూతురు తాక‌ట్టు.. విడిపించిన మాజీ ఎంపీ

By:  Tupaki Desk   |   2 Jun 2020 9:30 AM GMT
అప్పుకు కూతురు తాక‌ట్టు.. విడిపించిన మాజీ ఎంపీ
X
భ‌ర్త అకాల మ‌ర‌ణం.. ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల బాధ్య‌త‌లు.. ఎలా చూసుకోవాలో తెలియ‌ని ఆ మ‌హిళ‌. ఎలాగోలా క‌ష్ట‌ప‌డి ఇద్ద‌రి కూతుళ్ల‌ను చ‌దివిద్దామ‌ని అప్పులు చేసింది. చేసిన అప్పులు తీర్చక‌పోవ‌డంతో అవి భారంగా మారాయి. చివ‌ర‌కు కూలీనాలీ చేసేందుకు వెళ్ల‌గా అనారోగ్యం పాలై మృతి చెందింది. అప్పు తీర్చేందుకు తాక‌ట్టు పెట్టిన కుమార్తె ఒక‌చోట‌.. త‌ల్లి మృత‌దేహం మ‌రోచోట‌. త‌ల్లి మ‌ర‌ణ‌వార్త విని ఆ కూతురు స్వ‌గ్రామం రాలేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఓ మాజీ ఎంపీ స్పందించి ఆ బాలిక త‌ల్లిని క‌డ‌సారి చూసుకునేలా ఏర్పాట్లు చేశాడు. ఈ ఘ‌ట‌న ఒడిశా జిల్లా న‌వ‌రంగ‌పూర్ జిల్లాలో జ‌రిగింది.

నవరంగపూర్‌ జిల్లాకు చెందిన మ‌హిళ అనాది పాణిగ్రహి. ఆమె భ‌ర్త కొన్నేళ్ల కింద‌ట‌నే మ‌ర‌ణించ‌డంతో తన ఇద్ద‌రి ఆడబిడ్డల బాధ్య‌త త‌నే మోసింది. వారిని బాగా చదివించాలని భావించి మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ.30 వేలు అప్పు తీసుకుంది. ఇద్దరు చ‌దువుతుండ‌గా తీసుకున్న అప్పు చెల్లించ‌లేక‌పోయింది. దీంతో పెద్ద కుమార్తె ప్రియాంకను గ్రామంలోని బంధువులకు అప్పగించి తన చిన్న కుమార్తె సాగరిక (16)ను తీసుకుని ఐదు నెలల కింద‌ట ఉపాధి కోసం హైదరాబాద్‌కు వ‌చ్చింది. ఇటుకల కంపెనీలో త‌ల్లీకూతురు పనికి కుదిరారు.

ఈ క్ర‌మంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మందుల కోసమ‌ని కంపెనీ యజమాని దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. దానికి బ‌దులుగా కుమార్తె సాగరికను యజమాని వద్ద తాకట్టు పెట్టి గ్రామానికి వెళ్లింది. కొంతకాలానికే ఆరోగ్యం క్షీణించి మృతిచెందింది. త‌ల్లిని చివ‌రిసారి చూసేందుకు స్వ‌గ్రామం వెళ్లాల‌ని సాగ‌రిక‌కు ఉన్నా లాక్‌డౌన్ కార‌ణంగా వెళ్లలేక‌పోయింది. తాను హైదరాబాద్‌ లో తాకట్టు ఉన్న విష‌యాన్ని సాగరిక ఒడిశా ప్రభుత్వానికి విన్న‌వించినా స్పందన లేదు. ఆ బాలికను స్వ‌గ్రామం త‌ర‌లింయాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్ర‌య‌త్నాలు చేశాయి. చివ‌ర‌కు ఈ విష‌యం తెలుసుకున్న నవరంగపూర్‌ మాజీ ఎంపీ ప్రదీప్‌ మఝి స్పందించి బాలికను విడిపించారు. తిరిగి సొంత ప్రాంతం చేరుకునేలా చేశాడు. కొంత ఆర్థిక స‌హాయం చేశారు. ఇంత‌టి దౌర్భాగ్య ప‌రిస్థితి ఇంకా భార‌త‌దేశంలో కొన‌సాగుతోంది.