Begin typing your search above and press return to search.

వైసీపీలోకి కేఈ ఫ్యామిలీ..రంగం సిద్ధమవుతోందట!

By:  Tupaki Desk   |   19 Nov 2019 1:35 PM GMT
వైసీపీలోకి కేఈ ఫ్యామిలీ..రంగం సిద్ధమవుతోందట!
X
రాయలసీమ ముఖ ద్వారం కర్నూలు జిల్లా రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కేఈ కృష్ణమూర్తి తన సోదరులు - కుమారులతో కలిసి టీడీపీని వీడేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారట. అతి త్వరలోనే కేఈ ఫ్యామిలీ మొత్తం టీడీపీని వీడి వైసీపీలో చేరిపోతుందట. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గానీ... రాయలసీమలో ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. వయసు రీత్యా యాక్టివ్ పాలిటిక్స్ కు స్వస్తి చెప్పేందుకు కృష్ణమూర్తి రెడీ అయిపోయారు. అదే సమయంలో తన వారసుడిగా ఇటీవలే తెరంగేట్రం చేసిన తన కుమారుడు కేఈ శ్యాంబాబు - సోదరులు కేఈ ప్రభాకర్ - కేఈ జయన్న - కేఈ ప్రతాప్ లను వైసీపీలోకి పంపేందుకు కృష్ణమూర్తి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని - ఈ క్రమంలో కర్నూలు జిల్లాకే చెందిన ఓ మంత్రి ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా పరశీలిస్తూ వస్తున్నారన్న వార్తలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అయినా వైసీపీలోకి కేఈ శ్యాంబాబుతో కూడిన కేఈ ఫ్యామిలీకి ఎంట్రీ లభిస్తుందా? అన్న విషయం పైనా ఆసక్తికర చర్చ నడుస్తోందట. ఎందుకంటే... పత్తికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నది శ్యాంబాబే కదా. శ్యాంబాబును ఓడించడంతో పాటుగా ఎలాగైనా నారాయణ రెడ్డి కుటుంబానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వాలన్న కసితో సాగిన జగన్... పత్తికొండలో తాను అనుకున్నట్లుగానే శ్రీదేవిని గెలిపించారు. కేఈ శ్యాంబాబుపై శ్రీదేవికి పీకలదాకా కోపం ఉంది. ఈ నేఫథ్యంలో కేఈ శ్యాంబాబుతో కూడా కేఈ ఫ్యామిలీకి వైసీపీలోకి ఎంట్రీ ఎలా లభిస్తుందన్న చర్చ ఆసక్తికరంగా మారిపోయింది.

అయితే నాలుగు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీతో కేఈ ఫ్యామిలీకి కొనసాగుతున్న మైత్రీ బంధం... ఈ అడ్డంకులను ఈజీగానే బ్రేక్ చేయగలదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి - నారా చంద్రబాబునాయుడులతో కలిసి కేఈ కృష్ణమూర్తి కూడా ఒకేసారి 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. వారిద్దరితో కలిసి కేఈ కూడా తొలి యత్నంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాకుండా చాలాకాలం పాటు ముగ్గురూ స్నేహితులుగానే కొనసాగారు. టీడీపీలోకి మారిన తర్వాత చంద్రబాబు... వైఎస్ తో విబేధించినా... కేఈ కూడా టీడీపీలోకి వచ్చినా వైఎస్ తో ఆత్మీయంగానే కొనసాగారన్న వాదనలు వినిపించాయి. వైఎస్ హయాంలో టీడీపీలో ఉన్నా కూడా కేఈ ఫ్యామిలీ అనుకున్న మేరకు చాలా పనులు జరిగిన వైనమే ఇందుకు నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కేఈ ఫ్యామిలీకి వైసీపీలోకి ఎంట్రీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాదన్న వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. జిల్లాలో కేఈ ఫ్యామిలీకి ఆగర్భ రాజకీయ శత్రువుగా ఉన్న కోట్ల ప్రకాశ్ రెడ్డిని మొన్నటి ఎన్నికల ముందు చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. నాడు కేఈ అయిష్టంగానే కోట్ల ఎంట్రీకి తలూపాల్సి వచ్చిందన్న వాదనలూ వినిపించాయి. ఇక చంద్రబాబు హయాంలో బీసీ కోటాలో కేఈ కృష్ణమూర్తికి పేరుకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, రెవెన్యూ శాఖను కట్టబెట్టినా... ఆ శాఖ వ్యవహారాలన్నీ కూడా చంద్రబాబే చూసుకున్నారు. దీంతో కేఈ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కిన విషయమూ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా కాలం నుంచే కేఈ ఫ్యామిలీ వైసీపీలో చేరాలని చూసినా కుదలేదు. ఇప్పుడు టీడీపీ అడ్రెస్ గల్లంతయ్యే పరిస్థితులు తలెత్తడం, రాజకీయంగా మంచి పట్టున్న ప్యామిలీగా ఉన్న కేఈ ఫ్యామిలీ ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా వైసీపీలోకి చేరిపోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.