Begin typing your search above and press return to search.

ఏపీ మీద జేసీ అలిగారా ?

By:  Tupaki Desk   |   25 Sep 2021 5:30 AM GMT
ఏపీ మీద జేసీ అలిగారా ?
X
జేసీ దివాకర్ రెడ్డి ఏపీ మీద అలిగినట్లే ఉన్నారు. అందుకనే ‘ఏపిని వదిలేసి తెలంగాణాకు వచ్చేస్తా’ అంటు ఓ ప్రకటన చేశారు. తెలంగాణా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం జేసీ సీఎల్పీ ఆఫీసులో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలు బట్టీ విక్రమార్క, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డితో చాలాసేపు ముచ్చట్లాడారు. అంతకు ముందు కేసీయార్ తో కూడా భేటీ అయ్యారు. తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలేమీ బావోలేదన్నారు. సమాజం కూడా బాగా లేదని తెగ బాధపడిపోయారు.

పనిలో పనిగా ఏపీ వదిలేసి తెలంగాణాకు వచ్చేస్తానంటు ప్రకటనిచ్చేశారు. తెలంగాణాను వదిలిపెట్టేసి జేసీలు చాలా నష్టపోయారట. రాయల తెలంగాణా కావాలని తాము ఎంత చెప్పినా జైపాల్ రెడ్డి అంగీకరించలేదంటూ ఫీలైపోయారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా రాయల తెలంగాణాను ఏర్పాటు చేయాలని జేసీని గట్టిగా డిమాండ్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలంగాణాలోని జిల్లాలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలను కలిపి రాయల తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలని అప్పట్లో జేసీ చాలా గట్టిగానే డిమాండ్ చేశారు.

అప్పట్లో జేసీ ఎంతగా పోరాటం చేసినా అధిష్టానంలో ఎవరు పట్టించుకోలేదు. ఆ బాధ ఇప్పటికీ జేసీలో అలాగే ఉన్నట్లుంది. అందుకనే అప్పటి తన డిమాండ్ ను తాజాగా గుర్తుచేసుకున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పటికిప్పుడు ఏపిని వదిలేసి తెలంగాణాకు వచ్చి జేసీ చేసేది ఏముందో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఏపీలోనే జేసీ సోదరుల రాజకీయ జీవితం దాదాపు చరమాంకానికి వచ్చేసినట్లే.

70 ఏళ్ళ వయస్సు పై బడిన సోదరుల్లో ప్రభాకర్ రెడ్డి కాస్త నయం. ఎలాగంటే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఛైర్మన్ గా గెలిచారు. దివాకర్ రెడ్డి అయితే ఏకంగా రాజకీయాల నుండే తప్పుకున్నారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా తన కొడుకు పవన్ రెడ్డిని పోటీలోకి దించారు. టీడీపీకి భవిష్యత్తుంటుందో లేదో కూడా చాలా మందిలో కన్ఫ్యూజన్లో ఉంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందని జేసీ ప్రభాకర్ రెడ్డే ఈ మధ్య మీడియాతోనే చెప్పారు. కాబట్టి ఏపిలోనే టీడీపీకి దిక్కు లేకపోతే ఇక తెలంగాణాలో పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అలాగని కాంగ్రెస్, బీజేపీలో దేనిలో చేరే అవకాశాలు లేవు. టీఆర్ఎస్ లో చేరాలని అనుకున్నా సాధ్యం కాదు. రాజకీయంగా చరమాంకానికి వచ్చిన ఈ దశలో జేసీ దివాకర్ రెడ్డి ఏపిలో ఉన్నా ఒకటే తెలంగాణాకు మారినా ఒకటే. రాజకీయంగా కాకుండా వ్యాపారాల్లో ఎలాగూ రెండు రాష్ట్రాల్లోను బిజీగానే ఉన్నారు. కాబట్టి దాని కోసమని ప్రత్యేకంగా తెలంగాణాకు వచ్చేస్తానని చెప్పాల్సిన అవసరం లేదు.

జేసీ తాజా ప్రకటన చూస్తే బహుశా ఆయన చంద్రబాబునాయుడు మీద అలిగారా లేకపోతే ఏపీ మీదే అలిగారా అన్న సందేహం వస్తోంది. ఏపీ మీద అలిగితే జేసీ చేయగలిగేదేమీ లేదు. పార్టీలో చాలామంది సీనియర్ నేతలు పార్టీలో యాక్టివ్ గా లేరని అందరికీ తెలిసిందే. వీరిలో దివాకర్ రెడ్డి కూడా ఉన్నారు. తన ఫాంహౌస్ లోనే గడిపేస్తున్నారు ఎక్కువ కాలం. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ సీఎల్పీ ఆఫీసులో కనబడటం, ఏపిని వదిలేస్తా అని ప్రకటించటమంటే ఏదో వ్యూహాత్మకమనే అనుమానాలున్నాయి. అవేంటో తొందరలోనే బయటపడతాయి లేండి.