Begin typing your search above and press return to search.

అద్భుతం ఆవిష్కృతమైంది.. భారత్ కు థామస్ కప్ సొంతమైంది

By:  Tupaki Desk   |   16 May 2022 3:00 AM GMT
అద్భుతం ఆవిష్కృతమైంది.. భారత్ కు థామస్ కప్ సొంతమైంది
X
ఈ ఆట మీద మరింత ఫోకస్ చేస్తే తిరుగులేని విజయాలు మన సొంతమన్న విషయాన్ని చాటి చెప్పారు. ఇప్పుడు అదే వాస్తవమైంది. బ్యాడ్మింటన్ కు ప్రపంచకప్ టోర్నీ మాదిరి అభివర్ణించే థామస్ కప్ లో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. దీంతో.. భారత కీర్తి పతాక అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో గర్వంగా రెపరెపలాడింది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చి.. తడబడుతూ ప్రయాణాన్ని షురూ చేసి.. తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటమే కాదు.. మనకు తప్పించి మరెవరూ ప్రదర్శించని అద్భుత క్రీడా ప్రదర్శనతో భారత క్రీడాభిమానులకు పండుగ రోజును తీసుకొచ్చారు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు.

క్రీడల్ని అభిమానించే వారు.. భారత జట్టు ఏదైనా ఆటలో గెలిస్తే ఆనందించే వారికి థామస్ కప్ టోర్నీలో స్వర్ణం సాధించటం ‘ఒక విజయం’ మాత్రమే. కానీ.. బ్యాడ్మింటన్ మీద అవగాహన ఉన్న వారికి.. ఆ ఆటలో భారత్ తన అధిక్యతను స్పష్టంగా చాటాలని తపించే వారికి మాత్రం నిన్నటి (ఆదివారం) రోజు మరిచిపోలేని రోజుగా చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచ బ్యాడ్మింటన్ లో భారత్ ఇప్పటి దాకా సాధించిన విజయాలు ఒక ఎత్తు అయితే.. తాజాగా సాధించిన థామస్ కప్ పురుషుల బ్యాడ్మింటన్ ఫైనల్ లో భారత జట్టు ప్రదర్శించిన ఆట మరో ఎత్తుగా చెప్పాలి.

ఈ టోర్నీలో 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో చిత్తుగా ఓడించటం ద్వారా.. తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది. దీనికి ఏ ఒక్క ఆటగాడి అత్యుత్తమ ప్రదర్శనగా కాకుండా. జట్టుగా క్రీడాకారులంతా ప్రదర్శించిన ప్రతిభతోనే ఈ అసాధారణ విజయం సొంతమైందని చెప్పాలి. ఆదివారం జరిగిన తొలి సింగిల్స్ లో వరల్డ్ చాంపియన్ షిప్ పతక విజేత లక్ష్యసేన్ తన కంటే ఎంతో మెరుగైన ఆంథోని సినిసుక గింటింగ్ పై విజయం సాధించటం ద్వారా శుభారాంభాన్ని షురూ చేశాడు. తొలి సెట్ చేజార్చుకున్నా.. తర్వాతి సెట్లలో చెలరేగిపోయిన అతడు విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత డబుల్స్ లో దేశంలోనే అత్యుత్తమ జోడిగా చెప్పే సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ షెట్టి ద్వయం మహ్మద్ అహ్ సాన్ - కెవిన్ సంజయ సుకాముల్జో జోడిని ఓడించటం ద్వారా భారత్ పై అంచనాల్ని భారీగా పెంచేశారు. ఈ మ్యాచ్ లోనే మొదటి సెట్ ను చేజార్చుకొని.. తర్వాతి సెట్లలో వరుస అధ్యకతను ప్రదర్శించటం ద్వారా.. విజయాన్ని తమ పేరుతో రాసుకున్నారు.

ఇక.. రెండో సింగిల్స్ లో భారత్ స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ జోనాథన్ క్రిస్టీపై విజయం సాధించటంతో భారత జట్టు తొలిసారి థామస్ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. నిజానికి ఈ టోర్నీలో పాల్గొనే సమయంలో ఏదో ఒక పతకాన్ని సొంతం చేసుకుంటే అదే పది వేలు అన్నట్లుగా భారత జట్టు మీద అంచనాలు ఉన్నాయి. అలాంటిది ఏకంగా స్వర్ణాన్ని సాధించటం క్రీడా ప్రపంచానికి భారత్ సత్తా ఏమిటన్నది ఇప్పుడు అర్థమైంది. అప్పుడెప్పుడో.. దాదాపు 43 ఏళ్ల క్రితం ప్రకాశ్ పదుకునే (బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తండ్రి) సయ్యద్ మోడీ లాంటి దిగ్గజ షట్లర్లతో కూడిన భారత జట్టు థామస్ కప్ లో అత్యుత్తమంగా ఆడి సెమీస్ కు రావటం.. ఆ తర్వాత డెన్మార్క్ చేతిలో ఓడటం జరిగింది.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శించటంతో విజేతగా నిలవటమే కాదు.. ఈ గెలుపుతో భారతలో బ్యాడ్మింటన్ కు కొత్త ఊపు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తాజా విజయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. క్రికెట్ ప్రపంచంలో 1983లో కపిల్ సేన ప్రపంచకప్ ను సొంతం చేసుకోవటం ద్వారా క్రికెట్ దేశంలో ఎంతలా పాతుకుపోయిందో.. దానికో కొత్త ఊపు వచ్చిందో.. తాజా విజయం కూడా అలాంటిదేనని చెప్పాలి.