Begin typing your search above and press return to search.

విరుచుకుపడుతున్న కరోనా.. కేజ్రీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు

By:  Tupaki Desk   |   20 Nov 2020 6:00 AM GMT
విరుచుకుపడుతున్న కరోనా.. కేజ్రీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు
X
కొన్ని విషయాల్ని తేలిగ్గా అస్సలు తీసుకోకూడదు. కరోనా విషయంలో ఇది మరింత ముఖ్యం. కేసుల నమోదు తగ్గిందన్న ఉద్దేశంతో చెలరేగిపోతున్న ప్రజానీకం మరోసారి భయంతో వణికిపోయేలా చేస్తోంది కరోనా. చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్లుగా.. కరోనా సెకండ్ వేవ్ అంతకంతకూ విస్తరిస్తోంది. నిబంధనల్ని పట్టించుకోకుండా తమకు తోచినట్లుగా వ్యవహరించే వారి పుణ్యమా అని కరోనా మరింత దూకుడుగా విస్తరిస్తోంది. మొన్నటివరకు సెకండ్ వేవ్ అన్నంతనే అమెరికా.. యూరప్ దేశాలను చూపేవారు.

ఇప్పుడు మన దగ్గరకు ఆ ముప్పు వచ్చేసింది. దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. ఒక్కరోజులో అత్యధిక కేసులు మాత్రమే కాదు.. అత్యధిక మరణాలు చోటు చేసుకోవటం విషాదంగా మారింది. నిన్న ఒక్కరోజులోనే 131 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక్కరోజులో నమోదైన కొత్త పాజిటివ్ ల సంఖ్య 7486. గడిచిన పద్దెనిమిది రోజులుగా కేసులు పెరుగుతున్న వేళ..న్యాయవాది రాకేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

దీనిపై విచారించిన హైకోర్టు.. కేజ్రీవాల్ సర్కారును తలంటింది. హైకోర్టు జోక్యం చేసుకునే వరకు చర్యలు షురూ చేయరా? ముందే ఎందుకు మేల్కొనలేదు? గడిచిన పద్దెనిమిది రోజుల్లో తమ వారిని కోల్పోయిన వారికి మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించింది. దేశంలో నమోదైన మరణాల రేటులో ఢిల్లీ వాటానే అత్యధికమని చెప్పాలి. కరోనా కేసుల్లో న్యూయార్క్ లాంటి నగరాల్ని ఢిల్లీ దాటేయటాన్నికోర్టు ప్రస్తావించింది. ఓపక్క అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా కేసుల తీవ్రతపై ఢిల్లీ సర్కారు ఆశించినంత దూకుడుగా వ్యవహరించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.