Begin typing your search above and press return to search.

కొవిడ్‌ రిపోర్టు ఎఫెక్ట్ః రోడ్డుపై నిలిచిన 5 వేల వాహ‌నాలు!

By:  Tupaki Desk   |   14 Jun 2021 6:29 AM GMT
కొవిడ్‌ రిపోర్టు ఎఫెక్ట్ః  రోడ్డుపై నిలిచిన 5 వేల వాహ‌నాలు!
X
సెకండ్ వేవ్ ప్రభావంతో రాష్ట్రాల‌న్నీ స్వీయ నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. త‌మ వ‌ద్ద ఉన్న ప‌రిస్థితిని బ‌ట్టి లాక్ డౌన్ పొడిగింపు.. స‌డ‌లింపు ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో కొవిడ్ త‌గ్గుముఖం ప‌డుతోంది. దీంతో.. రాష్ట్రాల‌న్నీ మెల్ల మెల్ల‌గా నిబంధ‌న‌లు స‌డ‌లిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకుంది.

ఇన్నాళ్లూ అమ‌ల్లో ఉన్న కొవిడ్ నెగెటివ్ రిపోర్టు నిబంధ‌న‌ను తొల‌గించింది. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలంటే.. త‌మ‌కు క‌రోనా లేద‌నే ఆర్టీపీసీఆర్ రిపోర్టును చెక్ పోస్టు వ‌ద్ద‌ చూపించాల్సి ఉంది. తాజాగా.. అలాంటి రిపోర్టు చూపించాల్సిన ప‌నిలేద‌ని ప్ర‌క‌టించింది స‌ర్కారు. దీంతో.. ఆ రాష్ట్రంలో ప‌ని ఉన్న‌వారంతా ‘చ‌లో సిమ్లా’ అంటూ రోడ్లు ఎక్కేశారు. వీరిలో మెజారిటీ ప‌ర్యాట‌కులే కావ‌డం విశేషం.

ఇంకేముందీ..? చినుకు చినుకు వరద అయినట్టు.. వాహనాలన్నీ కలిసి రోడ్లను ముంచెత్తాయి. ఆ విధంగా సిమ్లా స‌రిహ‌ద్దులో ఏకంగా 5 వేల‌కుపైగా వాహ‌నాలు రోడ్డుపైకి రావ‌డంతో.. ట్రాఫిక్ మొత్తం ఎక్క‌డిక‌క్క‌డ స్తంభించిపోయింది. ఈ ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేసేందుకు అధికారులు నానా తంటాలు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో 5,400 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మాస్కులు ధ‌రిస్తూ.. భౌతిక దూరం పాటించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. కొవిడ్ నిబంధ‌న‌లు క‌ఠినంగా పాటించాల‌ని సూచించింది. దీంతో.. ఇన్నాళ్లూ ఇళ్ల‌కే ప‌రిమితం అయిన‌వారు.. ప్ర‌కృతి ఆనందాన్ని ఆస్వాదించేందుకు సిమ్లా వెళ్లిపోతున్నారు.

కాగా.. ఇటు దేశంలోనూ కేసులు త‌గ్గుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 74 వేల కేసులు న‌మోద‌య్యాయి. మ‌ర‌ణాలు మాత్రం అదే స్థాయిలో కొన‌సాగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం. గ‌డిచిన రోజులో 3,921 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.