Begin typing your search above and press return to search.

నిర్భయ తల్లి ఆ కీలక నిర్ణయం తీసుకుంటారా ?

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:12 AM GMT
నిర్భయ తల్లి ఆ  కీలక నిర్ణయం తీసుకుంటారా ?
X
నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1వతేదీన ఉరిశిక్ష విధించనున్నారు. ఉరికి సర్వం సిద్ధమవుతున్న సమయంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2012వ సంవత్సరంలో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి - దారుణంగా కొట్టి హతమార్చిన నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించకుండా తల్లిగా క్షమించాలని మహిళా న్యాయవాది ఇందిరాజైసింగ్ నిర్భయ తల్లిని కోరారు.

ఈ విషయంలో ఆమె పెద్దమనసు చేసుకోవాలని ఇందిరా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో కాంగ్రెస్‌ అధినేత్రి - రాజీవ్‌ గాంధీ భార్య సోనియా గాంధీని ఉదాహరణగా తీసుకోవాలని కోరారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని మానవబాంబు ద్వారా హత్య చేసిన కేసులో నళినిని సోనియా క్షమించినట్టుగానే - నలుగురు దోషులకు కూడా ఆశాదేవి క్షమాభిక్ష పెట్టాలని కోరుతున్నామని జైసింగ్ ట్వీట్ చేశారు. నిర్భయ దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించడంతో ఫిబ్రవరి 1వతేదీన వారిని ఉరి తీయాలని నిర్ణయించిన నేపథ్యంలో సీనియర్ మహిళా న్యాయవాది నిర్భయ తల్లికి ఈ సలహా ఇచ్చారు.

అయితే , నిర్భయ తల్లి ఆశాదేవి ..కొందరు తమ స్వార్థ రాజకీయ లాభాల కోసమే ఉరిశిక్ష అమలును అడ్డుకుంటున్నారని , అయితే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మహిళలపై హింసకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేశారు. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించేవరకూ తనకు సంతృప్తి ఉండదని నిర్భయ తల్లి తెలిపింది. ఈ నేపథ్యంలో ఇందిరాజైసింగ్‌ అభ్యర్థనను, ఆశాదేవి అంగీకరిస్తారా అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏం నేరమూ చేయని తన కుమార్తెను అతికిరాతంగా హత్య చేసిన వారికి మరణ శిక్షే న్యాయమంటూ.. ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన ఆమె ఇపుడు హంతకులను క్షమిస్తారా? లేకపోతే మానవతా దృక్పథంతో అలోచించి నిర్ణయం తీసుకుంటారా?చూడాలి....