Begin typing your search above and press return to search.

నువ్వు లేని లోకం నాకొద్దు..ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య

By:  Tupaki Desk   |   25 Oct 2020 11:30 PM GMT
నువ్వు లేని లోకం నాకొద్దు..ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య
X
కళ్ళు చెమర్చే కన్నీటి ప్రేమ కథ ఇది. ప్రియురాలు అనారోగ్యంతో చనిపోగా నువ్వు లేని లోకంలో నేను ఉండలేను.. అంటూ ప్రియుడు ఆమె సమాధి వద్దే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి విన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చుతున్నాయి. ఈ విషాదకర ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కుదురుపల్లిలో జరిగింది. మహదేవపూర్‌ గ్రామానికి చెందిన చల్లా మహేశ్‌(24) టీఎస్‌ ఎండీసీ (తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌)లో వాలంటీర్‌ గా పనిచేస్తున్నాడు. ఇతడు అదే గ్రామానికి చెందిన గీతాంజలి ప్రేమించుకున్నారు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన గీతాంజలి చివరికి కన్నుమూసింది. దీంతో మహేష్ తీవ్ర మనస్థాపంలో కూరుకు పోయాడు. రోజు అదే ఆలోచనతో గడిపేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు ఆమెనుమర్చిపోలేకపోయాడు. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను అని.. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.

గీతాంజలిని సమాధి చేసిన ప్రాంతానికి చేరుకుని అక్కడికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. అంతకుముందు అతడు వాట్సాప్ స్టేటస్ లో ప్రియురాలు లేనిలోకంలో ఉండలేనంటూ.. స్టేటస్‌ పెట్టుకున్నాడు. ఇది చూసిన కొంతమంది స్నేహితులు వెంటనే మహేష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అందరూ ఆమె సమాధి చేసిన ప్రాంతం వద్దకు వెళ్లి చూసేసరికే అప్పటికే మహేశ్‌ చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు.

అది చూసిన మహేష్ తల్లిదండ్రులు - స్నేహితులు బోరున విలపించారు. చెట్టంత కొడుకు హఠాత్తుగా ప్రాణాలు తీసుకోవడంతో వాళ్ళను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సమాచారం అందుకున్న మహదేవపూర్‌ ఎస్సై అనిల్‌ కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం మహదేవపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమించిన అమ్మాయి చనిపోవడంతో అది భరించలేకే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మహేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.