Begin typing your search above and press return to search.

గన్నవరం పంచాయితీ.. యార్లగడ్డ తేల్చిందిదే..!

By:  Tupaki Desk   |   20 Nov 2019 10:26 AM GMT
గన్నవరం పంచాయితీ.. యార్లగడ్డ తేల్చిందిదే..!
X
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీని వీడారు. జగన్ ను పొగిడేశారు. వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. గన్నవరంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీచేసి వల్లభనేని వంశీ గెలిచారు. ఈయన తన సమీప వైసీపీ ప్రత్యర్థి అయిన యార్లగడ్డ వెంకట్రావ్ పై గెలుపొందారు. వంశీ చేరికతో గన్నవరం పంచాయితీ మొదలైంది.

వంశీ వైసీపీలో చేరికను యార్లగడ్డ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుధవారం పార్టీ అధినేత జగన్ ను కలిసిన యార్లగడ్డ తన భవిష్యత్తుపై సమారు 40 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ.. ‘వల్లభనేని వంశీ ఎప్పుడు పార్టీలోకి వస్తారో ఆయననే అడగాలని’ విలేకరులను ప్రశ్నించారు. జగన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని.. ఇందులో మరో వాదనకు తావు లేదని స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ పై ఇష్టంతో రాజకీయాల్లోకి వచ్చానని.. తాను ఆయనకు అభిమానినని యార్లగడ్డ చెప్పుకొచ్చాడు. తాను వైసీపీని వీడి వేరే పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. జగన్ కోసమే పనిచేస్తానని తేల్చిచెప్పారు.

జగన్ తో భేటిలో వంశీ గురించిన ప్రస్తావనే రాలేదని యార్లగడ్డ చెప్పుకొచ్చాడు. వంశీ పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తానని..వంశీతో తనకు వైరం లేదని స్పష్టం చేశారు. గన్నవరం అసెంబ్లీ సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ తో చర్చించానని యార్లగడ్డ తెలిపారు. గన్నవరానికి ఉప ఎన్నికలు వస్తే పార్టీ తరుఫున ఎవరిని నిలుబెడుతారనే విషయాన్ని జగన్ చేతుల్లోనే ఉంచుతానని అన్నారు.