Begin typing your search above and press return to search.

స్వామి ఆగ్రహం : వైవీ చేసిన నేరమేమి...?

By:  Tupaki Desk   |   15 May 2022 1:30 PM GMT
స్వామి ఆగ్రహం : వైవీ చేసిన నేరమేమి...?
X
విశాఖలోని శ్రీ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారు అనుగ్రహం కోసం అంతా వస్తారు. వారిలో రాజకీయ నాయకులే ఎక్కువ. అంతా నా భక్తులే అని స్వామి అంటూంటారు. అలాంటి స్వామికి ఆగ్రహం ఒక పట్టాన రాదు. మరి వచ్చినంటే దాని వెనక కారణాలు ఏంటి. ముఖ్యమంత్రి జగన్ తన భక్తుడు అని ధాటీగా చెప్పుకునే స్వామి వారు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి మీద మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా తిరుపతిలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన స్వామి అక్కడ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. టీటీడీ చరిత్రలో ఒకే ఒక్కరు చైర్మన్. ఆయనే కరుణాకరరెడ్డి. ఆయన హయాంలో జరిగిన మేలు మరి ఎపుడూ జరగలేదు. ఇక జరగబోదు అని కూడా స్వామీజీ అనేశారు. మళ్లీ కరుణాకరరెడ్డి లాంటి వారు పుట్టబోరు అని కూడా స్వామి అనడమే విశేషం.

మొత్తానికి గతంలో టీడీపీ చైర్మన్ గా పనిచేసిన కరుణాకరరెడ్డిని పొగడడం వరకూ ఓకే అనుకున్నా ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏలుబడి మీద కూడా స్వామీజీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అసలు ఏం జరుగుతోంది టీటీడీలో అంటూ స్వామి మండిపడ్డారు. అక్కడ సరిగ్గా ఏమీ సాగడంలేదు అంటూ విమర్శలే చేశారు.

నిజంగా ఇది ఘాటు వ్యాఖ్యగానే చూడాలి. స్వామీజీ కి ప్రియ భక్తునిగా వైవీ సుబ్బారెడ్డి ఎపుడూ ఉంటూ వచ్చారు. స్వామి ఆఖరుకు ఉత్తర భారతాన రుషీకేశ్ లో ఉన్నా కూడా వైవీ ఆయన్ని కలసి ఆశీస్సులు పొందిన సందర్భాలు ఉన్నాయి. వైవీ సుబ్బారెడ్డి విశాఖ వచ్చిన ప్రతీ సారీ పీఠాన్ని, స్వామీజీని దర్శించుకోని కానీ వెళ్లరు. అలాంటిది వైవీ భక్తి మీద స్వామికి ఎందుకు ఇంతలా సందేహం వచ్చింది అన్నదే ఒక చర్చగా ఉంది.

అదే సమయంలో ఉమ్మడి విశాఖ వైసీపీ వ్యవహారాలను వైవీ ఇపుడు చూస్తున్నారు. ఆ విధంగా ఆయన తన మకాం విశాఖకు మార్చబోతున్నారు. దాంతో ఇక పైన తరచూ స్వామీజీని కలసే వీలు కూడా ఉంది. మరి ఇంతలా ప్రతీ విషయాన్ని స్వామీజీ దృష్టికి తెస్తూ వైవీ ఆయన పట్ల భక్తి చాటుకోవడమే అంతా చూశారు. మరి వైవీ చేసిన నేరమేంటని ఆయన అనుచరులు అంటున్నారు.

ఒకరిని పొగిడి మరొకరిని తెగడడం ద్వారా స్వామీజీ ఏం చెప్పబోతున్నారు అన్నదే ఇక్కడ పాయింట్. ఇక బాబాయ్ వద్దు అబ్బాయ్ ముద్దు అంటే కూడా కధ సాగుతుందా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి స్వామీజీ చాలా కాలానికి కారాలూ మిరియాలూ నూరుతున్నాయి. గతంలో టీడీపీ టైమ్ లో గట్టిగా మాట్లాడే స్వామీజీ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తరువాత గొంతు సవరిస్తున్నారు.

మరి స్వామీజీ ఆగ్రహానికి హేతువు ఏంటి అన్నది చూడాలి. ఏది ఏమైనా వైవీ సుబ్బారెడ్డి మీద ఒక ధార్మిక పీఠాధిపతి చేసిన కామెంట్స్ ని సగటు జనులు తేలిగ్గా తీసుకోలేరు అనే అంటున్నారు. ఇప్పటికే టీటీడీ మీద టీడీపీ సహా విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఇపుడు అక్కడ ఏమీ బాగా జరగడంలేదు అని స్వామీజీ అంటే అది విపక్షాలకు ఆయుధంగానే మారుతుంది.