Begin typing your search above and press return to search.

విధేయతకే పట్టం కడుతున్నాడా ?

By:  Tupaki Desk   |   21 Nov 2020 3:50 PM GMT
విధేయతకే పట్టం కడుతున్నాడా ?
X
తాజాగా మొదలైన డెవలప్మెంట్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ తరపున పోటీ చేయటానికి డాక్టర్ గురుమూర్తిని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసినట్లు సమాచారం. అభ్యర్ధి విషయంలో నిర్ణయం తీసేసుకున్నా అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. అభ్యర్ధి ఎంపిక విషయంలో చనిపోయిన ఎంపి బల్లి దుర్గా ప్రసాదరావు కొడుకు కల్యాణ చక్రవర్తికి ఇవ్వాలని కొందరు ఎంఎల్ఏలు సూచించారు. ఇదే సమయంలో గూడూరుకు చెందిన మరో నేత మేరిగ మురళీధర్ కు ఇవ్వాలని ఐదుగురు ఎంఎల్ఏలు సూచించారు. అయితే స్వయంగా జగనే డాక్టర్ పేరు ప్రస్తావించేసరికి ఇక ఎవరు అభ్యంతరం చెప్పలేకపోయారని సమాచారం.

ఇంతకీ గురుమూర్తిని ఎంపిక చేయటంలో కీలక పాయింట్ ఏమిటి ? ఏమిటంటే విధేయతే అని అర్ధమైపోతోంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి 3640 కిలోమీటర్ల పాదయాత్రను సక్సెస్ ఫుల్లుగా ముగించారంటే ఇందులో గురుమూర్తి పాత్ర చాలానే ఉంది. ప్రతిరోజు పాదయాత్ర ముగించి టెంటులోకి తిరిగి రాగానే డాక్టర్ తన పనిమొదలుపెట్టేవారు. దెబ్బతిన్న పాదాలకు మందులు రాయటం, కట్లు కట్టడం, కాళ్ళకు మర్దనచేయటం లాంటివి చేసేవారు. మరుసటి రోజు ఉదయానికల్లా జగన్ను నూరుశాతం ఫిట్ గా ఉండేట్లు చూడటంలో డాక్టర్ పాత్ర చాలా ఉంది. డాక్టర్ జగన్ కు టెంటులో మాత్రమే సాయం చేయలేదు. మొత్తం జగన్ తో పాటే తాను కూడా నడిచారట.

సరే పాదయాత్ర పూర్తయిన తర్వాత చాలా డెవలప్మెంట్లు జరిగాయి. పాదయాత్రలో అంటిపెట్టుకుని ఉన్న డాక్టర్ తర్వాత చాలా కాలానికి మళ్ళీ కనబడ్డారు. దాంతో అప్పటికప్పుడు ఓ పోస్టును సృష్టించి డాక్టర్ ను జగన్ తన వద్దే అట్టిపెట్టేసుకున్నారట. ఇపుడు ఏకంగా ఎంపి అభ్యర్ధిగానే ఎంపిక చేసేశారు. గురుమూర్తిని ఎంపిక చేయటంలో ప్రధాన అంశం విధేయతే అని అర్ధమైపోతోంది. బాగా చదువుకున్న వ్యక్తి, యువకుడిని రాజకీయాల్లోకి తీసుకొస్తే చివరివరకు తనతోనే ఉంటాడని, తనకే పూర్తి విధేయతతో ఉంటాడని జగన్ భావించినట్లు సమాచారం.

నిజానికి పార్టీ తరపున ఎవరిని అభ్యర్ధిగా పోటీ చేయించినా గెలుపు ఢోకా లేదని పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో బల్లి దుర్గాప్రసాదరావు కొడుకు కల్యాణ చక్రవర్తికి తొందరలో ఎంఎల్సీ పదవిని ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అందుకు బల్లి కుటుంబం కూడా అంగీకరించింది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో బాపట్ల ఎంపి నందిగం సురేష్ ను కూడా ఇలాగే జగన్ ఎంపిక చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబునాయుడు హయాంలో తగలబడిన పొలాల విషయంలో ఆందోళనలు చేసిన సందర్భంలో ఎంపి మొదటిసారి జగన్ కంట పడ్డారు. సీన్ కట్ చేస్తే ఏకంగా బాపట్ల ఎంపి అయిపోయారు.

ఇక్కడ జగన్ ఆలోచనలు చూస్తుంటే రాజకీయ నేపధ్యం లేని వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి నిలబెట్టాలని అనుకుంటున్నట్లుంది. కర్నూలు,అనకాపల్లి ఎంపిలు కూడా ఎటువంటి నేపధ్యం లేకుండానే మొదటిసారి కేవలం జగన్ కారణంగా రాజకీయాల్లోకి వచ్చారు. రేపు గురుమూర్తి గెలిస్తే ఎంపిగా మూడో డాక్టర్ అవుతారేమో వైసీపీ తరపున. చూద్దాం అంతిమంగా ఏమవుతుందో.