Begin typing your search above and press return to search.

అనంత వైసీపీలో వర్గపోరు.. సొంతోళ్లు ఎంతలా కొట్టుకున్నారంటే?

By:  Tupaki Desk   |   25 Jun 2022 4:18 AM GMT
అనంత వైసీపీలో వర్గపోరు.. సొంతోళ్లు ఎంతలా కొట్టుకున్నారంటే?
X
అనూహ్యంగా అధికారంలోకి రావటమే కాదు.. ఏపీ ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుతో తిరుగులేని పవర్ ను సొంతం చేసుకోవటం తెలిసిందే. అధికారంలోకి వచ్చి రావటంతోనే ప్రత్యర్థులతో ఉన్న లెక్కల్ని సరి చేసే పనిలో గడిచిన మూడేళ్లుగా గడిపేసిన ఏపీ అధికారపక్షం వైసీపీలో ఇప్పుడు అది కాస్తా మరింత ముదిరి.. సొంతోళ్ల మధ్య కొట్లాటలకు తెర తీసింది. నలుగురు ఏం అనుకుంటారన్న విషయాన్ని వదిలేసి.. అధినేత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయం అన్నది లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరుకు అవాక్కు అవ్వాల్సిందే. ఉమ్మడి అనంతపురం జిల్లా.. కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వర్గపోరు బరితెగింపు బాట పట్టేసిందిఅధికార పార్టీ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నడుపుతున్న అసమ్మతి రాజకీయం రాజుకొని..

వీధుల్లో పడి కొట్టుకునే వరకు వెళ్లింది. దీనంతటికి కారణం.. రెండు.. మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఇక్బాల్ కు వ్యతిరేకంగా వైసీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామక్రిష్ణారెడ్డి.. హిందూపురం గ్రామీణ ఎంపీపీ రత్నమ్మ స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఏపీ చేస్తున్న దందాపై ఫైర్ కావటమే కాదు.. అతగాడ్ని తొలగించకపోతే.. వారి అవినీతిని బయటపెడతామని వార్నింగ్ ఇచ్చారు.

ఇందులో భాగంగా ఎంపీపీ రత్నమ్మ శుక్రవారం ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ వర్గీయులు అక్కడకు చేరుకొని ఎంపీపీను బెదిరించే ప్రయత్నం చేశారు.ఆ సమయంలో వన్ టౌన్ సీఐ ఇస్మాయిల్ అక్కడకు చేరుకొని ఎంపీపీతో మాట్లాడి.. ఇరు వర్గాలకు సర్దుబాటు చేసి పంపేశారు.

కాసేపటికి అసమ్మతి వర్గానికి చెందిన కౌన్సిలర్ ఇర్షాద్ అక్కడకు వచ్చి.. పరిస్థితి గురించి వాకబు చేయగా.. అక్కడున్న ఎమ్మెల్సీ వర్గీయులు చెలరేగిపోయారు. దారుణంగా తిట్టేయటమే కాదు.. తీవ్రంగా కొట్టేశారు. పోలీసులు కల్పించుకోకుంటే ఇర్షాద్ పరిస్థితి ఏమిటన్నది ఊహించటానికే భయం కలిగే పరిస్థితి నెలకొంది.

కౌన్సిలర్ పై దాడి గురించి తెలుసుకున్న అసమ్మతికి చెందిన పద్దెనిమిది మంది కౌన్సిలర్లు.. సీనియర్ నేత వేణుగోపాల్ రెడ్డి.. మున్సిపల్ వైస్ ఛైర్మన్ బలరామిరెడ్డి.. చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి తదితరులు మరోసారి సాయంత్రం వేళలో ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చారు. పార్టీలో జరుగుతున్న దాడుల గురించి మీడియాకు చెప్పాలని వారు భావించారు. దీనిక గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్ర ఆగ్రహానికి గురై.. నేరుగా ప్రెస్ క్లబ్ లోకి వచ్చి అసమ్మతి వర్గీయుల్ని బండ బూతులు తిట్టేశారు. మరోవైపు ఆయన అనుచరులు రాళ్లు విసురుతూ.. కిటీకీలు.. తలుపుల్ని పగలకొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగారు.

స్థానిక సీఐ.. ఎమ్మెల్సీకి మద్దతు ఇస్తున్నట్లుగా ఆరోపించారు. హాట్ హాట్ గా నడిచిన రచ్చ.. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఇరువర్గాలకు సర్ది చెప్పి.. ఇంటికి పంపేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకాలం ప్రత్యర్థుల మీద పడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు తమలో తాము తిట్టేసుకొని.. కొట్టేసుకునే వరకు వెళ్లిన వేళ.. పార్టీ అధినేత జగన్ ఏం చేస్తారో చూడాలి.