Begin typing your search above and press return to search.

అట్లుంటది జగన్ తోని.. గతేడాది పుట్టిన రోజును గుర్తు చేసుకున్న ఆర్ఆర్ఆర్

By:  Tupaki Desk   |   14 May 2022 12:30 PM GMT
అట్లుంటది జగన్ తోని.. గతేడాది పుట్టిన రోజును గుర్తు చేసుకున్న ఆర్ఆర్ఆర్
X
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) 60 వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తిగా రఘురామ ఎంపీ అవకముందు నుంచే పాపులర్. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రఘురామ.. సినిమా సర్కిళ్లలోనూ బాగా పేరున్న వారు. సినిమా దర్శకులు, నటులతో ఆయనకు పరిచయాలున్నాయి. 2019లో నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన.. ఆ వెంటనే వైసీపీకి ఐడియాలజీ పరంగా దూరమయ్యారు.

తర్వాతి కాలంలో ఆ విభేదాలు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ ఢిల్లీ నుంచే రచ్చబండ నిర్వహిస్తూ, వైసీపీ సర్కారుకు కంట్లో నలుసుగా మారారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ బాగా డ్యామేజీ చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు తీవ్ర ఆగ్రహం తెప్పించారు. ఓ దశలో (గతేడాది మేలో) వైఎస్ జగన్ కు పిచ్చి ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది వైసీపీ సర్కారుకు మరింత ఆగ్రహ కారణమైంది. రఘురామ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే.. ఆయనను అలా వదిలేస్తే మరింత ప్రమాదమని గ్రహించిన ప్రభుత్వం అరెస్టు చేసింది. అది కూడా గతేడాది 2021 మే 14. ఆ రోజు ఆయన పుట్టిన రోజు కావడం గమనార్హం.

ఈ పుట్టిన రోజు ఇలా..నిరుడు పుట్టిన రోజున అరెస్టయిన సందర్భంలో జరిగిన దారుణాన్ని రఘురామ గుర్తు చేసుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌ కుమార్ ఇద్దరూ అద్భుత కళాకారులని అన్నారు. ఆ ఇద్దరూ కలిసి కుట్రపూరితంగా అరెస్టు చేసి అత్యంత పాశవికంగా దాడి చేశారన్నారు. తనపై తీవ్రంగా దాడి చేసిన తర్వాత ఓ కానిస్టేబుల్‌ వచ్చి.. ఏం జరిగింది, ఎవరు కొట్టారని అమాయకంగా అడిగారని గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాత ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ వచ్చి తనను మంచంపై పడుకోబెట్టారని వివరించారు. ఉన్మాది సంస్కృతిలో భాగంగానే తనపై దాడి చేశారని ఎంపీ రఘురామ చెప్పారు. ఇది తన 60వ పుట్టిన రోజు అని.. ఎన్నో బర్త్ డేలు వైభవంగా జరుపుకొన్న తనకు, 59వ పుట్టిన రోజు ఘనంగా జరిపిన ఉన్మాదికి ధన్యవాదాలు అంటూ ఏడాది క్రితం జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. తనకు అలా చేసిన వారికి 2024లో ప్రజాక్షేత్రంలోనే ప్రజలు బుద్ధి చెబుతారని రఘురామ పేర్కొన్నారు. కాగా, ఎంపీ రఘురామకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌‌లో శనివారం అమిత్ షా పర్యటన తర్వాత ఆయన్ను కలవనున్నట్లు రఘురామ వెల్లడించారు. నిల్చొనే పరిస్థితి కూడా లేకుండా ఆనాడు తనను కొట్టారని వైకాపా నర్సాపురం ఎంపీ రఘురామ అన్నారు. తన గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారని చెప్పారు. దిల్లీలో రఘురామ మీడియాతో మాట్లాడారు. "నా సెల్‌ఫోన్‌ కోసం వెతికి మళ్లీ నన్ను కొట్టారు. మొత్తం ఐదుసార్లు నన్ను తీవ్రంగా కొట్టారు. ఉన్మాది సంస్కృతిలో భాగంగానే నాపై దాడి చేశారు. ఇది నా 60వ పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజుల ఘనంగా జరుపుకొన్నా. 59వ పుట్టినరోజు ఘనంగా జరిపిన ఉన్మాదికి నా ధన్యవాదాలు. 2024లో ప్రజాక్షేత్రంలోనే ప్రజలు బుద్ధి చెబుతారు" అని రఘురామ అన్నారు.

కుమారుడి వర్థంతి రోజు నారాయణను..పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీపై వైసీపీ సర్కారు ఇటీవల నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు, ఏపీ మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసింది. అయితే, ఆ రోజు నారాయణ కుమారుడి వర్థంతి కావడం గమనార్హం. 2017లో హైదరాబాద్ లో జరిగిన ఘోర కారు రోడ్డు ప్రమాదంలో నారాయణ కుమారుడు దుర్మరణం పాలయ్యారు. దీనికి సంబంధించి వార్షిక వర్ధంతి ఉండగా.. నారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది రఘురామను కూడా పుట్టిన రోజునే అరెస్టు చేశారు. దీన్నిబట్టి.. వైసీపీ సర్కారు తమ విమర్శకులు, టార్గెట్ వ్యక్తులను వారికి సంబంధించిన వ్యక్తిగత కార్యక్రమ రోజుల సందర్భంగానే అరెస్టు చేసిందనే అభిప్రాయం వ్యక్తమైంది.