Begin typing your search above and press return to search.

చైనాకు షాకిచ్చిన డబ్ల్యూహెచ్ఓ: ప్రపంచాన్ని మేమే అప్రమత్తం చేశాం

By:  Tupaki Desk   |   4 July 2020 12:10 PM GMT
చైనాకు షాకిచ్చిన డబ్ల్యూహెచ్ఓ: ప్రపంచాన్ని మేమే అప్రమత్తం చేశాం
X
ప్రపంచ దేశాలు చేస్తున్న ఆరోపణలు.. విమర్శలే వాస్తవమయ్యాయి. చైనా దేశంపై తీవ్ర విమర్శలు చేస్తున్నవే నిజమయ్యాయి. వాస్తవానికి మహమ్మారి వైరస్ పై ప్రపంచాన్ని మొదట అప్రమత్తం చేసింది చైనా కాదని.. తామే చేశామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సంచలన ప్రకటన చేసింది. వైరస్‌ విస్తరణపై వివరాలను అందించకుండా చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది.

మహమ్మారి వైరస్ పై సమాచారాన్ని చైనాలోని తమ కార్యాలయమే తెలియజేసిందని, చైనా కాదంటూ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీన వుహాన్ నగరంలో న్యూమోనియా వంటి కేసులు నమోదైన సమయంలో మొదట మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని చైనాలోని తమ కార్యాలయమే వెల్లడించిందని తెలిపింది. ఆడబ్ల్యూహెచ్ఓ తాజా ప్రకటనతో చైనాపై ఆరోపణలు.. విమర్శలు చేస్తున్న దేశాలకు కలిసొచ్చింది.

ప్రధానంగా చైనాపై మొదటి నుంచి విమర్శలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఇది గుడ్ న్యూస్. చైనాకు అనకూలంగా డబ్ల్యూహెచ్ఓ పని చేస్తుందని ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రకటన ఆసక్తికరంగా మారింది. వారంలో వైరస్ గురించి డబ్ల్యూహెచ్ఓ వెల్లడించిన ‍ క్రోనాలజీలో తాజా వివరాలను పొందుపర్చింది. వైరల్ న్యుమోనియా కేసులను గుర్తించినట్టు వుహాన్ హెల్త్ కమిషన్ వెబ్‌సైట్‌లో డిసెంబర్ 31వ తేదీన ప్రకటించిన తర్వాత చైనాలోని డబ్ల్యూహెచ్‌ఓ కార్యాలయం నుంచి తమకు సమాచారం వచ్చినట్టు వెల్లడించింది. దీంతోపాటు అదే రోజు అమెరికాలోని డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఎపిడిమియోలాజికల్ నిఘా నెట్‌వర్క్ ప్రోమెడ్ కూడా వుహాన్‌లో అంతుచిక్కని కారణాలతో న్యుమోనియా కేసులు బయటపడింది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకుని కొత్తరకం వైరస్ కేసుల గురించి ఈ ఏడాది జనవరి 1, 2 తేదీల్లో చైనా అధికారులను సమాచారం కోరితే, జనవరి 3వ తేదీన సమాచారం అందజేశారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. చైనా పట్ల తమకు ఎలాంటి ఆశ్రిత పక్షపాత ధోరణి లేదని మరోసారి ఈ సందర్భంగా ఈ నివేదికతో డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.

దీనిపై శుక్రవారం మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడారు. ఒక సంఘటనను అధికారికంగా ధ్రువీకరించడానికి, దాని స్వభావం లేదా కారణం గురించి అదనపు సమాచారాన్ని అందజేయడానికి దేశాలకు 24-48 గంటలు సమయం ఉంటుందని తెలిపారు. తమ నివేదికను ధ్రువీకరించమని కోరిన వెంటనే చైనా అధికారులు డబ్ల్యూహెచ్‌ఓను సంప్రదించారని పేర్కొన్నారు. ఏప్రిల్ 9వ తేదీన పేర్కొన్న వివరాల ప్రకారం.. హుబే ప్రావిన్స్‌లో న్యుమోనియా కేసులను డిసెంబర్ 31వ తేదీన వుహాన్ మున్సిపల్ ఆరోగ్య కమిషన్ గుర్తించినట్టు తెలిపింది. చైనా నుంచి తొలి నివేదిక వచ్చిందని ఏప్రిల్ 20వ తేదీన డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టేడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే, ఎవరు తెలియజేశారో మాత్రం డబ్ల్యూహెచ్ఓ పేర్కొనలేదు

వైరస్ నివారించడానికి అవసరమైన సమాచారాన్ని అందించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని, చైనాకు డబ్ల్యూహెచ్ఓ వత్తాసు పలుకుతోందని ట్రంప్ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్ఓకు నిధులను నిలిపివేయడంతోపాటు, సంబంధాలను తెంచుకున్న విషయం తెలిసిందే.