Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలోని మహిళలకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్ ఇచ్చి.. మూడేళ్లు డేటా ఉచితం

By:  Tupaki Desk   |   20 Aug 2022 4:36 AM GMT
ఆ రాష్ట్రంలోని మహిళలకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్ ఇచ్చి.. మూడేళ్లు డేటా ఉచితం
X
చేతిలో స్మార్ట్ ఫోన్ లేనోళ్లు కనిపించరు. ఫోన్ తో ఆగకుండా.. అందులో డేటా కూడా ఇప్పుడు నిత్యవసరంగా మారిన సంగతి తెలిసిందే మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పడుతున్న వేళ.. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త పథకానికి తెర తీసింది. రాష్ట్రంలోని మహిళల మనసుల్ని దోచేందుకు తీసుకొచ్చిన ఈ ఫ్రీ స్మార్ట్ ఫోన్ పథకం ఎలాంటి ఫలితాల్ని ఇస్తుందో చూడాలి. ఇంతకీ విషయం ఏమంటే.. రాష్ట్రంలోని మహిళలందరికి ఉచితంగా స్మార్ట్ ఫోన్.. అందులో మూడేళ్ల పాటు ఇంటర్నెట్ ఉచింగా ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ పథకాన్ని అమలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మీద రూ.12వేల కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. అయినప్పటికి వెనక్కి తగ్గని అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఈ కొత్త పథకాన్నిఅమలు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన టెండర్లను పిలచే దిశగా అడుగులు వేస్తోంది.

ఒకవైపు ఉచితాలపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న వేళ.. ఇలాంటి పథకం తెర మీదకు రావటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.అయితే.. ఈ ఉచితాన్ని మహిళలు అందుకోవాలంటే.. వారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య బీమా పథకంలో చేరి ఉండాల్సిందే.

వారికి మాత్రమే ఉచిత స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.35 కోట్ల మంది మహిళలు ఉంటారని.. వారందరికి ఫ్రీగా స్మార్ట్ ఫోన్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ భారీ పథకాన్ని అమలు చేయటానికి వీలుగా ప్రభుత్వానికి చెందిన బీఎస్ఎన్ఎల్ తో పాటు.. ప్రైవేటు ఆపరేటర్లతో కూడా చర్చలు జరుపుతున్నారు.

ఈ పథకానికి సంబంధించిన ఏ సంస్థకు టెండర్ లభించినా.. ఏకంగా వారికి 1.35 కోట్ల కొత్త ఖాతాలు వచ్చి చేరినట్లే అవుతుంది. ఈ పండుగ సీజన్ తొలిదశలోనే ఉచిత స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ ఫోన్ లో మొదటి సిమ్ కార్డు లాక్ చేసి ఉంటుంది. రెండో సిమ్ స్లాట్ లోని ఇంకో సిమ్ కార్డు వేసుకునే వీలు కల్పిస్తారు. స్మార్ట్ ఫోన్లతో పాటు.. మూడేళ్ల పాటు ఇంటర్నెట్ డేటా ఇవ్వటానికి ప్రభుత్వానికి రూ.12వేల కోట్ల ఖర్చు వచ్చి పడనుంది.

ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మహిళల మనసుల్ని దోచుకునే అవకాశం ఉందని భావిస్తున్న ఈ పథకం గురించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది.