Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమ రూపురేఖలు మారతాయా?

By:  Tupaki Desk   |   21 Sep 2020 10:30 AM GMT
కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమ రూపురేఖలు మారతాయా?
X
పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తాన‌ని సీఎం జ‌గ‌న్ గతంలో ప్రకటించారు. ఈ విష‌యంపై అధ్యయ‌న కమిటీని నియమించిన జగన్....మార్చి 2021లోపు నివేదిక ఇవ్వాలని కోరారు. మరోవైపు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే తమ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోతామని పలువురు నేతలు వాపోతున్నారట. ప‌క్క జిల్లాల్లో తమ ప్రాంతాలను క‌లప‌వ‌ద్దని కొందరంటుంటే....సొంతంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాల‌ని మరికొందరు కోరుతున్నారట. పెద్ద జిల్లాని చిన్న జిల్లాలుగా ముక్కలు చేస్తే.....తమ పట్టు పోతుందని సీనియర్ల వాదన. దీంతో, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఏపీలో ఈ కొత్త జిల్లాల విభజనపై విపరీతంగా చర్చ జరుగుతోంది.

ఉమ్మ‌డి ఏపీతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ లోనూ విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లా అనంత‌పురం.తాడిప‌త్రి, అనంత‌పురం, హిందూపురం, పుట్ట‌పర్తి వంటి ప‌ట్ట‌ణాలు అనంతపురంలో పెద్ద పట్టణాలు. హిందూపురం లోక్ సభ నియోజకవర్గం క‌ర్ణాట‌క‌కు దగ్గరగా ఉండడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. కానీ, అనంతపురానికి హిందూపురం చాలా దూరం అయినప్పటికీ ఒకే జిల్లా కిందకు వస్తాయి. తాజాగా జిల్లాల విభజన నేపథ్యంలో హిందూపురాన్ని జిల్లా డిమాండ్ తెరపైకి వచ్చింది. మరోవైపు, హిందూపురం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పుట్ట‌ప‌ర్తిని సత్యసాయి జిల్లా చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్ కు హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ కూడా సుముఖంగా ఉన్నారని, ఆ విషయంపై సీఎం జగన్ కు లేఖ కూడా రాశారని టాక్. ఈ క్రమంలోనే అటు పుట్ట‌పర్తికి, ఇటు హిందూపురానికి మ‌ధ్యేమార్గంగా `కియా `ప‌రిశ్ర‌మకు దగ్గరగా కొత్త జిల్లాగా సత్యసాయి జిల్లా ఏర్ప‌డుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

గొల్ల‌ప‌ల్లి డ్యామ్ తో నీటికొరత తీరడం, ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పడితే 500‌ ఎక‌రాల భూమిని ఉచితంగా ఇచ్చే దాత ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. హిందూపురం పార్ల‌మెంట‌రీ ప‌రిధిలోకి వ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ స‌త్య‌సాయి జిల్లాలోకి, అనంత‌పురం పార్ల‌మెంట‌రీ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ పాత జిల్లా కేంద్రంలో ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాలలోనూ విభజన సమస్య ఉంది. క‌డ‌ప జిల్లాలో క‌డ‌ప‌, రాజంపేట‌ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. క‌డ‌ప లోక్ స‌భ నియోజకవర్గ ప‌రిధిలో క‌డ‌ప జిల్లాలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. అయితే, రాజంపేట లోక్ స‌భ నియోజకవర్గా ప‌రిధిలో చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు వ‌స్తాయి. రాజంపేట జిల్లా అయితే, చిత్తూరు జిల్లా భౌగోళిక రూపురేఖలు మారిపోతాయి.

చిత్తూరు లోక్ స‌భ నియోజకవర్గంలో అన్నీ చిత్తూరు జిల్లా ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలే ఉన్నాయి. ప్రస్తుతం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న తిరుప‌తిని కొత్త జిల్లా చేస్తే...నెల్లూరు జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను తిరుపతి జిల్లాలో క‌ల‌పాల్సి వ‌స్తుంది. అయితే, ఇటు రాయల సీమ..అటు కోస్తా...మరోవైపు మద్రాస్....ఈ మూడు కల్చర్ల కాంబినేషన్ ఉన్న నెల్లూరు జిల్లాను పూర్తిగా రాయ‌ల‌సీమ‌ జిల్లా అనలేం కానీ, గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ‌లో నెల్లూరును కలపొచ్చు.అనంత‌పురం, క‌ర్నూలు.. ఈ రెండు జిల్లాల‌నూ నాలుగు జిల్లాలుగా చేయ‌డానికి పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌దు. కర్నూలులోని 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలను పాత జిల్లాగా, నంద్యాల కేంద్రంగా మ‌రో జిల్లా ఏర్పాట‌య్యే అవ‌కాశాలున్నాయి. దీంతో, క‌డ‌ప‌, రాజంపేట‌, తిరుప‌తి, చిత్తూరులు జిల్లా కేంద్రాలుగా కొనసాగినా.. వాటి రూపు రేఖ‌లు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలతో సంబంధం లేకుండా మారాల్సి ఉంటుంది. మరి, ఈ జిల్లాల పంచాయతీని కమిటీ ఏవిధంగా హ్యాండిల్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.