Begin typing your search above and press return to search.

పునరావాస శిబిరం..తెలుగుదేశం ప్లాన్ రివర్స్ అయ్యిందే!

By:  Tupaki Desk   |   11 Sep 2019 12:16 PM GMT
పునరావాస శిబిరం..తెలుగుదేశం ప్లాన్ రివర్స్ అయ్యిందే!
X
మొత్తానికి చలో ఆత్మకూర్ అంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు విజయవంతం కాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడను గృహనిర్భందంలో పెట్టి తెలుగుదేశం నేతలను ఎక్కడిక్కడ నిలువరించి పోలీసులు శాంతిభద్రతల సమస్య రాకుండా చేశారు. ఇందులో కొంత రాజకీయం ఉన్నా.. మూక స్వభావం ప్రకారం చూస్తే పోలీసులు చేసింది మంచి పనే. ఇదేమీ ప్రజా సమస్య కాదు. రెండు పార్టీల మధ్యన సమస్య. కాబట్టి.. ఇలాంటి నేపథ్యంలో ఒక పార్టీ అధినేత తన పార్టీ వాళ్లను ఒక ఊరికి తీసుకెళ్లి రచ్చ చేస్తే.. అది శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి పోలీసుల వాదనలో పస ఉంది.

ఇక అంతకు మించిన ఆసక్తిదాయకమైన అంశం.. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన పునారావస కేంద్రాన్ని అధికారులు సందర్శించడం. అక్కడ ఎవరున్నారు? ఎందుకున్నారు? అనే అంశాల గురించి పోలీసులు - అధికారులు ఆరా తీశారు. వారి సమస్యలేమిటో తెలుసుకున్నారు. అందులో కొన్ని చిత్రమైన విషయాలు తేలాయట.

రాజకీయ దాడులు - ప్రతిదాడుల భయంతో అక్కడున్న వారు కొందరైతే - వ్యక్తిగత కారణాల రీత్యా అక్కడ ఉన్న వారు మరి కొందరు. వారి వివరాలను తెలుసుకుని పోలీసులు - అధికారులు వారిని వారి వారి సొంతూళ్లకు తలించడం మొదలుపెట్టారు. వారికి సొంతూళ్లలో భద్రత కల్పించే బాధ్యత తమదని పోలీసులు వారిని సొంతూళ్లకు తీసుకెళ్లారు. ఇది పోలీసులు చేయాల్సిన పని.

ఈ పని తను చేస్తానంటూ చంద్రబాబు నాయుడు హడావుడి చేశారు. అది చంద్రబాబు పని కాదు. చంద్రబాబు నాయుడు ఈ మ్యాటర్ లో వేలు పెడతారు సరే - ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ల ఊరికి వెళ్తారు. అయితే రేపు అక్కడ మళ్లీ ఏమైనా జరిగితే? చంద్రబాబు అక్కడే ఉంటూ వాళ్లకు కావలి ఉండలేరు కదా!

అక్కడ శాంతిభద్రతల సమస్యను పరిష్కరించాల్సింది పోలీసులు. ఇప్పుడు బాధితులను తీసుకెళ్లి వాళ్లు వాళ్లకు భరోసా ఇచ్చారు. దీంతో వారిని అడ్డుపెట్టుకుని పునరావస కేంద్రాలు అంటూ రాజకీయం చేయదల్చిన చంద్రబాబు నాయుడుకు ఎదురుదెబ్బ తగిలిందని పరిశీలకులు అంటున్నారు.

తెలుగుదేశం పునరావాస శిబిరాల్లో వ్యక్తిగత కారణాలతో కూడా కొంతమంది ఉన్నారనే .. మాటలు వినిపిస్తూ ఉండటం గమనార్హం.