Begin typing your search above and press return to search.

ఏపీలో వైసీపీకి 20 లక్షల ఓట్లు పోతాయా... ఏ లెక్కన...?

By:  Tupaki Desk   |   7 July 2022 7:47 AM GMT
ఏపీలో వైసీపీకి 20 లక్షల ఓట్లు పోతాయా... ఏ లెక్కన...?
X
ఏపీలో వైసీపీకి 2024 ఎన్నికలు ఒక విధంగా అగ్ని పరీక్షగా మారుతాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. 2019లో వైసీపీ రావాలీ అంటూ ఓటేసిన అనేక వర్గాలు ఇపుడు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్న వేళ కచ్చితంగా డబుల్ డిజిట్ నంబర్ లో లక్షల్లో వైసీపీ ఈసారి ఓట్లు కోల్పోనుందని అంటున్నారు. విషయానికి వస్తే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిపి దాదాపుగా ఏడు లక్షల మంది దాకా ఉన్నారు. అలాగే 50 వేల మంది దాకా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారికి పీయార్సీ పేరిట ప్రభుత్వ ఇచ్చిన జీతభత్యాల పెంపు ఏ మాత్రం సంతోషంగా లేదని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే వారంతా సర్కార్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉంటున్నారు అని అంటున్నారు. దీంతో వీరంతా వైసీపీకి వచ్చే ఎన్నికలో యాంటీగా ఓట్లేస్తారు అని చెబుతున్నారు. ఉదాహరణకు ఈ లెక్కల ప్రకారం చూస్తే ఇలా అంచనాకు రావచ్చు.

ఈ వ్యతిరేక ఓట్లు అయిన ఏడు లక్షలను ఇంటికి ముగ్గురు వంతున హెచ్చిస్తే 21 లక్షల మందిగా లెక్క తేలుతోంది. ఇందులో కూడా ముప్పయి శాతం వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారని అనుకుంటే ఆ సంఖ్య అక్షరాలా 6.3 లక్షలు అవుతుంది. ఆ నంబర్ ని ఇందులో తీసేస్తే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 14.7 లక్షల ఓట్లు వైసీపీకి యాంటీగా పడిపోవడం ఖాయమని తేలుతోంది.

ఇక మరో వైపు చూస్తే అమ్మ ఒడి పధకం అందుకుంటున్న లబ్దిదారుల నుంచి లక్ష మందిని తీసేస్తారు, కోత పెడతారు అని ప్రచారం సాగుతోంది. ఆ సంఖ్యను తీసుకుంటే ఇంటికి ముగ్గురు వంతున మూడు లక్షల ఓట్లు అయితే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గల్లంతు అవడం ఖాయం. ఇందులో కూడా హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ 30 శాతం అనుకుంటే అవి 90 వేల ఓట్లుగా లెక్కించాలి. ఆ నంబర్ ని తీసేసినా కచ్చితంగా 2.1 లక్షల ఓట్లు ఈసారి వైసీపీకి పోతాయని చెప్పుకోవాలేమో.

ఇక ఆర్టీసీ ఎంప్లాయీస్ దాదాపుగా 50 వేల మంది దాకా ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని వారిని ప్రభుత్వ ఉద్యోగులను చేశారు కానీ సర్కార్ ఉద్యోగులుగా వారికి ఏ మాత్రం లాభం లేదని అంటున్నారు. ఆ అసంతృప్తి అయితే వారిలో తీవ్రంగా ఉంది మరి. ఇక వారి ఓట్ల సంఖ్యను తీసుకుంటే ఇంటికి ముగ్గురు వంతున కచ్చితంగా లక్షా యాభై వేల మంది అవుతారు. ఇక ఇందులో 45 వేల మంది వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఓట్లుగా తీసి పక్కన పెట్టినా దాదాపుగా లక్ష ఓట్లు ఇక్కడ కూడా పోతాయని అంటున్నారు.

ఇక అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా అవి దక్కని వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు వాహన మిత్ర పధకాన్నే తీసుకుంటే ఒక వాహన యజమానికి నాలుగు వాహనాలు ఉంటే అతనికి నాలుగు రకాలుగా డబ్బులు వస్తున్నాయి కానీ ఆ వాహనాన్ని నడిపే డ్రైవర్ కి డబ్బులు రావడం లేదు అని అంటున్నారు. ఇక కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి అని చాలా సంక్షేమ పధకాలకు ప్రభుత్వం కత్తెర వేస్తోంది. ఇదంతా వైసీపీకి వ్యతిరేకంగానే జరిగే ప్రచారంగా చివరకు మారుతోంది అంటున్నారు.

ఇలా ఒక అవగాహన లేకుండా మంచి సలహా తీసుకుని పని చేయకుండా ముందుకు వెళ్తున్న నేపధ్యంలో వైసీపీకి దాదాపుగా వచ్చే ఎన్నికల్లో ఇరవై లక్షల ఓట్ల దాకా పోతాయని ఆ పార్టీ వర్గాలే భయపడుతున్న పరిస్థితి ఉందిపుడు. అయితే జగన్ మంచి సలహాలను పాటించేందుకు ఇప్పటికీ టై, ఉంది. అలాగే జనాలను ఆకట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. వైఎస్సార్ మాదిరిగా అసంతృపిగా ఉన్న వర్గాలను జగన్ పిలిచి మాట్లాడి వారిని బుజ్జగించి సర్దుబాటు చేసుకుంటే ఈ లెక్కలు అంచనాలు అన్నీ మారే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఏ దారిని ఎంచుకుంటారో.

అలాగే అంతా బాగానే ఉంది. అన్నీ మేము చేసేశాం, మాకు తిరుగులేదు, ఎదురులేదు అని ఎవరినీ సంప్రదించకుండా తన దారి తనదిగా ముందుకు పోతే మాత్రం వైసీపీకి ముందు రోజులు గడ్డు రోజులే అని చరిత్ర చెబుతున్న పాఠం. మరి వైసీపీ ఏ దారిని ఎంచుకుంటుందో తనకు దూరం అవుతున్న వర్గాలను ఎలా దగ్గరకు తీసుకుంటుందో చూడాల్సిందే.