Begin typing your search above and press return to search.

ప్రియాంక పాలిటిక్స్‌.. కాంగ్రెస్‌కు ఊపు తెచ్చేనా?

By:  Tupaki Desk   |   20 Jan 2022 4:20 PM GMT
ప్రియాంక పాలిటిక్స్‌.. కాంగ్రెస్‌కు ఊపు తెచ్చేనా?
X
ప్రియాంక గాంధీ. ఇందిర‌మ్మ మ‌న‌వ‌రాలిగా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌మైనా.. ఇటీవ‌ల కాలంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌హిళా నాయ‌కురాలిగా మ‌న్న‌న‌లందుకుంటున్నారు. అందుకే .. ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌ధాన రాష్ట్రం యూపీలో ఆమె ప్ర‌భావం ఎలా ఉంటుంది? గ‌త రెండేళ్లుగా ఈ రాష్ట్రంపై క‌న్నేసిన‌.. ఆమె ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటారు? ఏమేర‌కు కాంగ్రెస్ పార్టీని ముందుకు న‌డిపిస్తారు? అనే చ‌ర్చ జాతీయ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది.

ప్ర‌స్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉనికి కోల్పోయే దశలో కాంగ్రెస్ ఉంద‌నే ప్ర‌చారం అన్ని వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఇది పెయిడ్ ప్ర‌చార‌మ‌ని.. కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నా.. వాస్త‌వాలు ఎలా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో ఊపు మాత్రం క‌నిపించ‌డం లేదనే వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నై నిలిచారు ప్రియాంక గాంధీ. రెండేళ్లు ఇక్క‌డ రాజకీయాలపై దృష్టి సారించిన ఆమె.. కాంగ్రెస్లో జవసత్వాలు నింపేందుకు శక్తియుక్తులు కూడగట్టారు.

ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్‌ బాధ్యతలను పూర్తిగా భుజాలపై వేసుకొని ప్రియాంక రాజ‌కీయాలు చేస్తున్నార‌నే వాద‌న అంద‌రికీ తెలిసిందే. దాదాపు ఏడాది క్రితం నుంచే `ఆపరేషన్‌ యూపీ` ప్రారంభించిన ప్రియాంక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వాస్త‌వానికి 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 90వ దశకం వరకు కాంగ్రెస్‌కు ఉత్త‌రప్ర‌దేశ్‌ కంచుకోటగా ఉంద‌నే విష‌యం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిన పార్టీ ఉనికిని కాపాడేందుకు ప్రియాంక గాంధీ రంగంలో దిగారు. 2017 శాసనసభ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాలతో నిస్తేజం అవహించిన కాంగ్రెస్‌ కేడర్‌లో నేనున్నాంటూ భరోసా కల్పించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌, హథ్రాస్‌ హత్యాచారం ఘటనల్లో బాధితుల పక్షాన పోరాటం ప్రియాంక పోరాటం చేశారు. ఈ క్ర‌మంలోనే ఒక సంద‌ర్భంలో అరెస్ట‌యి.. త‌న‌ను నిర్బంధించిన గ‌దిని శుభ్రం చేస్తూ.. జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చారు. ఇటీవల జరిగిన లఖీంపూర్‌ఖేరీ హత్యాకాండపై ఇంకాస్త దూకుడుగానే వ్యవహరించిన ప్రియాంక.. ఘటన జరిగిన కొన్ని గంటలవ్యవధిలో రాత్రికిరాత్రే యూపీలో ప్రత్యక్షమయ్యారు.

బాధిత కుటుంబాలకు కలిసేందుకు వెళ్తుండగా తనను అడ్డుకున్న పోలీసులను ఇదెక్కడి న్యాయమంటూ నిలదీశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని గదిలో నిర్బంధిస్తే.. ఆ గదిని చీపురుతో ఊడుస్తూ గాంధీగిరి చేశారు. ప్రత్యర్థులు విమర్శలు చేసినా.. వారికి హుందాగానే బదులిచ్చారు. కొంతకాలంగా ప్రియాంక జనం మధ్యలోనే ఉన్నప్పటికీ యూపీ ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంత అనే విషయాన్ని రాజకీయ పరిశీలకులు అంచనా వేయలేకపోతున్నారు.

నిజానికి ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్‌ బలపడి ముక్కోణపుపోటీ ఏర్పడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. తమకు లబ్ధి చేకూర్చుతుందని కమలనాథులు భావించారు. కానీ ప్రియాంక, మాయావతి వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పెద్దగా చీలే అవకాశం లేదని, సమాజ్‌వాదీ పార్టీతో పోటీ తప్పడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి యూపీలో ప్రియాంక జోరుగా తిరుగుతున్నారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు నుంచే యూపీ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించిన ఆమె క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎస్పీలకు భిన్నంగా ప్రియాంకాగాంధీ పావులు కదుపుతున్నారు.మ‌రి ఈ నేప‌థ్యంలో ఆమె ఏ మేర‌కు ఇక్క‌డ స‌త్తా చాటుతారు? అనేది చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుంతో చూడాలి.