Begin typing your search above and press return to search.

భర్త మీద కక్షతో ఏ తల్లి చేయని పని చేసింది!

By:  Tupaki Desk   |   22 Aug 2019 8:10 AM GMT
భర్త మీద కక్షతో ఏ తల్లి చేయని పని చేసింది!
X
అమ్మతనానికి మచ్చ తెచ్చిందో మహిళ. భర్త మీద ఉన్నకోపంతో.. అతడి మీద కక్ష తీర్చుకోవటం కోసం ఆమె చేసిన దారుణం అవాక్కు అయ్యేలా చేయటమే కాదు.. మద్రాసు హైకోర్టుకు తీవ్ర ఆగ్రహం కలిగేలా చేసింది. ఇంతకూ ఆమె చేసిన దారుణం ఏమిటి? మద్రాసు హైకోర్టుకు ఎందుకంత కోపం వచ్చింది? అన్న వివరాల్లోకి వెళితే..

తన నుంచి విడిపోయిన భర్తపై కక్ష తీర్చుకోవాలని భావించిందో భార్య. అంతే.. అతడిపై ఆమె దారుణమైన అభియోగాన్ని మోపింది. తన 11 ఏళ్ల కుమార్తెపై తండ్రే అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసింది చెన్నైకి చెందిన మహిళ. అంతేకాదు.. తన భర్త చేసిన వెధవ పని కారణంగా తన కుమార్తె గర్భం దాల్చినట్లుగా పేర్కొంది.

దీంతో.. చెన్నై పోలీసులు సదరు భర్త మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే.. తన మీద పెట్టిన అభియోగాన్ని కొట్టేయాలని సదరు భర్త కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ తో కూడిన ధర్మాసనం ఊహించని అంశాన్ని గుర్తించింది. బాధితురాలిగా పేర్కొన్న చిన్నారి.. తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని.. తన తల్లి చేసినవి తప్పుడు ఆరోపణలుగా పేర్కొంది. దీంతో.. ధర్మాసనం షాక్ తిన్నది.

భర్త మీద కక్ష సాధింపు చర్యల కోసం కుమార్తె మీద ఏ తల్లి చేయనంత దారుణమైన ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా పరిగణించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన సమాచారాన్ని.. హైకోర్టు న్యాయమూర్తులు కూడా గుర్తించి..సదరు తల్లిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భర్త మీద కక్ష తీర్చుకోవటానికి కుమార్తె మీద అలాంటి ఆరోపణ చేయటానికి ఆమెకు మనసు ఎలా వచ్చిందన్న వ్యాఖ్యను చేశారు. అంతేకాదు.. భర్త మీద ఏ పోక్సో కేసు నమోదు చేశారో.. అదే కేసును ఆమె మీద నమోదు చేయాలని ఆదేశించారు. భర్త మీద కక్ష సాధించటం తర్వాత.. ఇప్పుడు జైల్లో కూర్చొని ఊచలు లెక్కేసే పరిస్థితి దాపురించింది. ఎవరెంత చేస్తే.. అంత వెనక్కి వస్తుందని ఊరికే అనలేదేమో?