Begin typing your search above and press return to search.

యూకే వైపు భారత విద్యార్థుల మొగ్గు.. కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   28 Nov 2021 2:30 AM GMT
యూకే వైపు భారత విద్యార్థుల మొగ్గు.. కారణం ఇదేనా?
X
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించింది. ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. ఇక దాదాపు ఏడాదిన్నరపాటు అంతర్జాతీయ రాకపోకలు ఆగిపోయాయి. కాగా ఇప్పుడిప్పుడే విదేశీ ప్రయాణాలు మెరుగవుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుదల, వ్యాక్సినేషన్ వల్ల ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతులు వస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు వేచిచూసిన వాళ్లు ఆలస్యం చేయకుండా చెక్కేస్తున్నారు. మళ్లీ కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఉన్నత చదువులు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లాలనుకునేవారు వీసా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే మనదేశం నుంచి విద్యార్థులు ఎక్కువ మంది యూకే వెళ్తున్నారు.

భారతీయ విద్యార్థులు ఎక్కువశాతం యూకేవైపు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. కొవిడ్ అనంతరం ఉపాధి, చదువుల కోసం ఆ దేశానికి వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఎందుకంటే కొవిడ్ ప్రభావంతో యూరప్ లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కాటుకు ఎక్కువ ప్రాణనష్టం జరగడం వల్ల ఆ ఖాళీని భర్తీ చేయడానికి యూకే ప్రయత్నిస్తోంది. అందుకే త్వరితంగా వీసాలను మంజూరు చేస్తోంది. ఈ ప్రాసెస్ సులభంగా ఉండడం వల్ల చాలామంది యూకేకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం.

అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనుకునేవారిని యూకే ఎక్కువగా ఆహ్వానిస్తోంది. అందుకే ఇండియా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సెప్టెంబర్ 2020 నుంచి 2021 వరకు అత్యధిక వీసాలను మంజూరు చేసిన దేశం యూకేనని పలు నివేదికలు చెబుతున్నాయి. వాటిలో 90,669 స్టూడెంట్ వీసాలు, 53,295 స్కిల్ వర్కింగ్ వీసాలను ఇచ్చినట్లు సమాచారం. ఫలితంగా విద్యార్థులు ఎక్కువమంది యూకేకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వీసాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఫలితంగా వీసా ప్రాసెసింగ్ కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని బ్రిటీషు హైకమిషనర్ అలెక్స్ ఎల్లీస్ వెల్లడించారు. యూకేపై ఇండియా విద్యార్థుల వీసా దరఖాస్తులకు సంబంధించి ట్వీట్ చేశారు.

విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయత్నాలు షురూ చేశారు. మళ్లీ మూడో దశ ఉందనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమవుతున్నారు. ఇకపోతే విమాన సంస్థలు విపరీతంగా ఛార్జీలు పెంచేశాయి. మరోవైపు కరోనా టెస్టుల ఫీజులు కూడా విపరీతంగా పెరిగాయి. అయినా కూడా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య తగ్గకపోవడం గమనార్హం. ఇక యూకేతో పాటు ఇతర దేశాలకు కూడా మరికొందరు వెళ్తున్నారు.