Begin typing your search above and press return to search.

ఆ లాయర్ కు చీఫ్ జస్టిస్ట్ కు రూ.10వేలు ఎందుకు ఇచ్చారు?

By:  Tupaki Desk   |   16 July 2020 5:45 AM GMT
ఆ లాయర్ కు చీఫ్ జస్టిస్ట్ కు రూ.10వేలు ఎందుకు ఇచ్చారు?
X
ఆయనో లాయర్. నిజానికి ఇలాంటి యువ న్యాయవాదులు చాలామందే ఉంటారు. కాకుంటే.. ఈయన కాస్త భిన్నమైన వ్యక్తి. కాలం విసిరే సవాళ్లను తట్టుకునేందుకు పోరాటం ఆపని నైజం ఎక్కువ. ఆయన గురించి తెలుసుకున్న న్యాయమూర్తి సైతం కదిలిపోయారు. తక్షణ సాయం కింద రూ.10వేలు అందించి ఆపన్నహస్తాన్ని చాటారు. విన్నంతనే కదిలిపోవటమే కాదు.. మాయదారి కరోనా ఎన్ని కష్టాలు తెచ్చి పెట్టిందో అన్న భావన కలుగక మానదు.

తమిళనాడుకు చెందిన యువ న్యాయవాది ఉత్తమకుమరన్. గిరిజన కుటుంబానికి చెందిన అతడు.. వారి కుటుంబాల్లో మొదటి లాయర్. వీరి ఇంట్లో కులవృత్తి వెదురుబుట్టల్ని అల్లుతుంటారు. లాయర్ వృత్తిని నమ్ముకున్న ఇతగాడికి భార్య.. ఏడేళ్ల కొడుకు ఉన్నారు. కరోనా కారణంగా చాలామంది మాదిరే లాయర్ల పరిస్థితి ఏ మాత్రం బాగోలేని పరిస్థితి. నెలల తరబడి ఇంట్లో ఉండిపోవాల్సిన వేళ.. చేతులో డబ్బులు అయిపోవటంతో.. తమ కులవృత్తిని నమ్ముకున్నారు. బుట్టలు అల్లుతూ.. వాటిని అమ్మకానికి పెట్టి కుటుంబాన్ని పోషించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ యువ న్యాయవాది గురించి ఒక జాతీయ మీడియా సంస్థలో ఒక కథనం వచ్చింది. కుటుంబాన్ని పోషించటం కోసం ఏం చేయటానికైనా సిద్ధమేనని పేర్కొన్న లాయర్ ఉదంతాన్ని చూసిన ఛత్తీస్ గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మీనన్ కదిలిపోయారు. వెంటనే ఆ లాయర్ కు రూ.10వేల మొత్తాన్ని ఒక లేఖను పంపారు. తాను పంపుతున్న మొత్తాన్ని ఆయన పరిస్థితిని చూసి జాలిపడి కాదని.. ఇదేమీ విరాళం కాదన్నారు.

‘‘కష్టించి పని చేయటంలో ఉన్న గౌరవాన్ని గుర్తించిన మీ వ్యక్తిత్వానికి ఇదో గుర్తింపు. దీన్ని బహుమతిగానే పంపుతున్నా. మీరు స్వీకరించాలి’’ అంటూ యువలాయర్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇప్పుడీ లాయర్ ఉదంతం వైరల్ గా మారటమే కాదు.. న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి కరోనా సవాళ్లను తెలిసేలా చేసిందని చెబుతున్నారు.