Begin typing your search above and press return to search.

కేఏపాల్ ను పట్టించుకోరా? సున్నా వేయండి

By:  Tupaki Desk   |   21 May 2019 5:11 AM GMT
కేఏపాల్ ను పట్టించుకోరా? సున్నా వేయండి
X
కేఏ పాల్ తెలుగు రాజకీయాల్లో తనదైన శైలితో సీరియస్ కామెడీ పండించిన రాజకీయ నాయుడు. ఏమాత్రం పరిచయం అక్కర్లేని ఈయన ఎన్నికల వేళ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. కానీ ఇప్పుడు ఫలితాలకు వేళయ్యింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కానీ కేఏపాల్ ఎక్కడ కనిపించడం లేదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ లో పాల్ ప్రస్తావనే లేదు. కనీసం సున్నా సీట్లు అయినా ఇచ్చినా బాగుండేది.. అదీ సర్వే సంస్థలు చేయకపోవడంతో పాల్ అభిమానులు తెగ బాధపడుతున్నారట..

ఓ చంద్రబాబు, మరోవైపు జగన్ ప్రచార వేడి సెగలు పుట్టించారు. సీరియస్ కామెంట్లతో రాజకీయాన్ని హీటెక్కించారు. కానీ పాల్ మాత్రం ఎన్నికల సమరంలో ఏం చేసినా సరే అది కామెడీని మాత్రమే పండించింది. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో చిందులు, వారితో డ్యాన్సులు చేయగల సత్తా పాల్ కే సొంతం..

అంతేకాదు కేఏ పాల్ తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. చంద్రబాబును అసిస్టెంట్ గా పెట్టుకుంటాననని అనడం.. జగన్ నాకు అసలు పోటీనే కాదని అనడం జోకులు పంచింది. జనసేనను అసలు లెక్కలోకే తీసుకోని కేఏపాల్ కామెడీ టైమింగ్ కు అందరూ నవ్వుకున్నారు.

అయితే నెలన్నర రోజులు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ గా.. యూట్యూబ్ లో లక్షల హిట్స్ తెచ్చుకొని ప్రతీ ఒక్కరికి చిరపరిచితుడైన కేఏపాల్ ను అస్సలు ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అస్సలు ప్రస్తావించనే లేదు. ఏపీకి తానే సీఎం అన్నారు కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేను గెలిపించిన నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తామన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. కేఏపాల్ ఎన్నికల వేళ చిన్న మాట మాట్లాడినా చిన్న సైగ చేసినా అది కామెడీ బాంబులా పేలింది. అలాంటి పాల్ ను ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పక్కనపడేశాయి. జాతీయ సర్వే సంస్థలు, చానెళ్లు, ప్రాంతీయ పార్టీల చానెళ్లు కూడా పూర్తిగా పక్కనపడేశాయి. ఏ ఒక్కరు కేఏపాల్ ను పట్టించుకున్న పాపాన పోలేదు. అంతా కలిసి ఆటలో అరటిపండులా తీసిపారేశారన్న చర్చసాగుతోంది.

ఏపీలో ప్రధాన పోరు టీడీపీ, వైసీపీ మధ్యే సాగింది. జనసేన మధ్యలో జనసేన కొన్ని స్థానాల్లో ప్రభావం చూపింది. వీటన్నింటితో పోల్చితే అస్సలు ప్రజాశాంతి లెక్కలోకే రాదు. అయితే ప్రజాశాంతి పార్టీకి సున్నా సీట్లు అని వేసి ఎగ్జిట్ పోల్స్ లో కనీసం ప్రస్తావించినా బాగుండేదని ఆయన అభిమానులు, ప్రజల్లో చర్చ సాగుతోంది.

పోలింగ్ కు ముందు అలరించిన పాల్ ప్రస్తుతం అమెరికాలోని హుస్టన్ లో 30 ఏళ్లుగా తానుంటున్న ఇంట్లో ఉంటున్నాడు. ఈ మేరకు పాల్ తన పాత ఇంటి వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. పోలింగ్ ముగిశాక జగన్ సీఎం అని చెప్పి అమెరికా వెళ్లిన పాల్ ఇక కనిపించలేదు. మండే ఎండలకు మించిన సెగలు పుట్టిన ఏపీ రాజకీయాల్లో తన కామెడీతో కూల్ చేసింది కేఏపాలే.. అలాంటి పాల్ ను ఎగ్జిట్ పోల్స్ లో కనీసం సున్నా అయినా వేసి ప్రస్తావిస్తే బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి మే 23 తర్వాతైనా కేఏపాల్ స్పందిస్తాడా.? ఎగ్జిట్ పోల్స్ తనను పట్టించుకోకపోవడంపై కామెంట్ చేస్తారా.? సీఎం అవుతానన్న పాల్ అసలు ఫలితాల వేళ మళ్లీ ఇండియా వస్తాడా లేదా అన్నది వేచిచూడాలి.