Begin typing your search above and press return to search.

కవిత ప్రస్తావన వెనుక ఈటల మైండ్ గేమ్?

By:  Tupaki Desk   |   5 Jun 2021 6:30 AM GMT
కవిత ప్రస్తావన వెనుక ఈటల మైండ్ గేమ్?
X
రాజకీయాల్లో చోటు చేసుకునే పరిణామం ఏదీ ఉత్తినే జరగదు. దాని బ్యాక్ గ్రౌండ్ ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండక మానదు. ఈటల రాజేందర్ విషయానికే వద్దాం. దశాబ్దానికి పైనే కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తి ఈ రోజున పార్టీకి రాజీనామా చేయటం ఎందుకు? మంత్రిగా ఉన్న ఆయన్ను కేబినెట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటమే. అందుకు భూకబ్జా ఆరోపణలే కారణమన్నది నిజమే అయితే.. ఈపాటికి కేసీఆర్ మంత్రివర్గంలోని చాలామంది మంత్రుల టికెట్లు చిరిగిపోయవాల్సి ఉంది. కానీ.. అలా జరగలేదు కదా? మంత్రులుగా ఉన్న ఎంతోమంది మీద ఆరోపణలు వచ్చినా వారి పదవులు చెక్కుచెదరల్లేదు. అలాంటప్పుడు ఈటలపై వేటు వెనుక అసలు కారణం మరేదో ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఈటల.. అందుకు ముందు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై్ చెప్పేస్తూ.. దానికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ ను ఆయన ఏర్పాటు చేశారు. దాదాపు గంటకు పైనేసాగిన ఈ ప్రెస్ మీట్ లో ఆయన కవిత ప్రస్తావనను తెర మీదకు తీసుకొచ్చారు. వాస్తవానికి మంత్రి కేటీఆర్ ను సీఎం చేయటానికి కేసీఆర్ ప్రయత్నిస్తే.. ఈటల అందుకు విరుద్ధంగా మోకాలు అడ్డు వేశారని.. ఆయన కారణంగానే తన కొడుకును సీఎంను చేయలేకపోయినట్లుగా కేసీఆర్ భావిస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈటల టార్గెట్ చేస్తారని అనుకుంటారు ఎవరైనా.

అందుకు భిన్నంగా ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ మాటకు ఇప్పుడామె ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. ఆ మాటకు వస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన కుమార్తె మీద ఈటల చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. కవితకు సంబంధించిన ఆయన ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ కోసం బొగ్గు గని.. ఆర్టీసీ.. విద్యుత్ సంఘాలను తాము పెట్టించామని.. కానీ బొగ్గు గని కార్మిక సంఘం నాయకురాలిగా కవిత ఉన్నారని.. దాంతో ఆమెకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.

అంతేకాదు.. విద్యుత్తు సంఘం పెట్టించింది కొప్పుల ఈశ్వర్ అని.. దాన్నినడపాలని చూస్తున్నది కవితగా ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ సంఘం పెట్టించింది హరీశ్ అయితే.. దాన్ని నడపాలని కవిత చూస్తున్నదంటూ విమర్శల వర్షాన్ని కురిపించారు. ఇప్పుడు సంఘాలకు హక్కులు లేకుండా చేశారన్నారు. అంతేకాదు.. కేసీఆర్ బీఫాంతోనే ఈటల గెలిచారంటూ గులాబీ నేతలు మాటల దాడి చేస్తున్న వేళ.. వారందరికి చురుకు పుట్టేలా ఈటల వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ బీఫారం ఇచ్చినంత మాత్రాన అందరూ గెలవలేదని.. గతంలో ఆయన బంధువు కరీంనగర్ లో.. కుమార్తె నిజామాబాద్ లో ఓడిన వైనాన్ని గుర్తు చేశారు. అంతేకాదు.. 2009లో మహా కూటమితో కలిసి 50 స్థానాలకు పోటీ చేస్తే పది స్థానాల్లో గెలిచామని.. అలా గెలిచిన వారిలో తాను ఒక్కడినే అన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు 17 మంది తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పోటీ చేస్తే.. అప్పుడు గెలిచిన ఏడుగురిలో తాను ఒకడినని చెప్పారు.

తన సుదీర్ఘ ప్రెస్ మీట్ లో కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తావన తీసుకురావటం ద్వారా ఈటల చెప్పకనే కొన్ని విషయాల్ని చెప్పారని చెప్పాలి. కేసీఆర్ ఇచ్చిన టికెట్ తోనో.. సారు బొమ్మతోనో తాను గెలవలేదని.. తనకంటూ సొంత బలం ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సొంత కుమార్తెను ఎన్నికల్లో గెలిపించుకోలేని కేసీఆర్ తనను.. తన ఎన్నికల గెలుపును ప్రశ్నిస్తారా? అన్న సందేహాన్నితన మాటలతో పలువురిలో కలిగేలా చేశారనిచెప్పాలి. అంతేకాదు.. కుమార్తె కవిత పేరును ప్రస్తావించటం ద్వారా.. కేసీఆర్ కుంటుంబంలో ఒత్తిడికి లోనయ్యేలా చేయటమే వ్యూహమన్న మాట వినిపిస్తోంది.

కుమార్తె కవిత అంటే కేసీఆర్ కు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో అథ్మాత్మిక కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్న ఆమెకు.. ఈటల నోటి నుంచి వచ్చిన మాటలు ఇబ్బంది పెట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఈటల ఎపిసోడ్ లో తన పేరు రావటం కవితకు తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు. మరి.. ఆమె ఎలా స్పందిస్తారో?