Begin typing your search above and press return to search.

గంట‌కు 15 మంది చ‌స్తున్నారు..మ‌న‌దేశంలోనే!

By:  Tupaki Desk   |   20 Nov 2019 9:01 AM GMT
గంట‌కు 15 మంది చ‌స్తున్నారు..మ‌న‌దేశంలోనే!
X
జాతీయ నేర గణాంకాల సంస్థ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో -ఎన్‌ సీఆర్‌ బీ) నివేదిక‌లో సంచ‌ల‌న అంశాలు వెల్ల‌డ‌య్యాయి. దేశంలో జరిగిన వివిధ రకాల నేరాల గురించి సమాచారాన్ని సేకరించి, వాటిని విశ్లేషించిన ఎన్‌ సీఆర్‌ బీ ఆ డేటాకు సంబంధించిన నివేదికను విడుదల చేయ‌గా...దాని ప్ర‌కారం ప్ర‌తి 4 నిమిషాల‌కు ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకొని క‌న్నుమూస్తున్నారు. అంటే గంట‌కు ప‌దిహేనుమంది భార‌తీయులు త‌మ జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఇలా 2016 సంవ‌త్స‌రంలో 131,008 మంది క‌న్నుమూసిన‌ట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో స్ప‌ష్టం చేసింది. 2015లో 1,33,623 మంది మ‌ర‌ణించార‌ని తెలిపింది. అంటే, 2015కు 2016కు 2% త‌గ్గుద‌ల న‌మోదు అయిన‌ట్లు వివ‌రించింది.

మ‌రోవైపు ప్రేమ హ‌త్య‌లు - రైతుల ఆత్మహత్యలు సైతం క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసేలా ఉన్నాయి. ఎన్‌ సీఆర్‌ బీ నివేదిక ప్ర‌కారం - అన్నదాతల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా - ఏపీ నాలుగో స్థానంలో - తెలంగాణ ఆరో స్థానంలో నిలిచాయి. ఎన్‌ సీఆర్‌ బీ గణాంకాల ప్రకారం.. దేశంలో అత్యధిక హత్యలు ప్రేమ వ్యవహారాలు - వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి. 2001-2017 మధ్య కాలంలో జరిగిన హత్యల్లో అత్యధికం ప్రేమ వ్యవహారానికి సంబంధించినవే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ - పంజాబ్ - గుజరాత్ - మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధిక శాతం ప్రేమ వ్యవహారాలవే ఉన్నాయి. ఢిల్లీ - కర్ణాటక - తమిళనాడు రాష్ట్రాల్లో రెండో స్థానంలో ప్రేమ హత్యలున్నాయి.

2001లో దేశవ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదుకాగా - 2017లో 21% తగ్గి 28,653 హత్య కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షలతో చేసే హత్యలు ఈ కాలంలో 4.3% తగ్గగా - ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యలు 12% తగ్గాయి. కులం - మతం - అంతస్తు - హోదా తదితర రాజకీయ - సాంఘిక కారణాలు ప్రధానంగా ప్రేమ హత్యలకు కారణమవుతున్నాయని జేఎన్‌యూ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్‌ లో అసోసియేట్ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న ప్రతీక్ష బక్సీ విశ్లేషించారు.