Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుపై మోడీకి లేఖ రాసేది ఇప్పుడా బాబు?

By:  Tupaki Desk   |   21 Feb 2021 2:30 PM GMT
విశాఖ ఉక్కుపై మోడీకి లేఖ రాసేది ఇప్పుడా బాబు?
X
చేయాల్సిన పనిని ఎప్పుడు చేయాలన్న దానిపైనే దాని ప్రభావం ఉంటుంది. ఎప్పుడో చేయాల్సిన పనిని మరెప్పటికో చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సిత్రంగా వ్యవహరిస్తుంటారు. కొన్ని అవసరం లేని అంశాలపై అదే పనిగా స్పందించే బాబు.. కీలకమైన అంశాల విషయంలో అంతులేని జాప్యాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా అలాంటి పనే విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ చేశారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిపై ఇప్పటికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం తీరుపై రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నిర్ణయంపై రగడ మొదలైనంతనే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. అధికారపక్షంలో ఉన్న అధినేత వెంటనే లేఖ రాసినప్పుడు.. ఇలాంటి విషయాల్లో విపక్ష నేత మరెంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి?

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దన్న విన్నపాన్ని ప్రధానికి పంపేందుకు చంద్రబాబు ఇంత ఆలస్యంగా ఎందుకు నిర్ణయాన్ని తీసుకుంటారన్నది అర్థం కాని ప్రశ్న. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపై మెరుపువేగంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోడీపై పోరుకు సిద్ధంగా లేని చంద్రబాబు.. అందుకే లేఖ రాయకుండా కాలయాపన చేశారని చెబుతున్నారు.

ఇదే విషయాన్ని అధికారపక్షం అదే పనిగా ప్రస్తావించటంతో ప్రధానికి లేఖ రాయక తప్పింది కాదు. తమ్ముడు.. తమ్ముడే, పేకాట పేకాటే అన్న రీతిలో రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి..తనకింకేమీ ముఖ్యం కాదన్నట్లుగా కమిట్ మెంట్ నుప్రదర్శించాల్సిన అవసరం ఉంది.కానీ.. అదేమీ చేయని చంద్రబాబు.. తీరిగ్గా.. ఉద్యమం మొదలైన ఇంతకాలానికి.. ప్రధాని మోడీకి లేఖ రాయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అవకాశం తలుపు తట్టినా.. అందుకు తగ్గట్లు స్పందించని బాబు తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉక్కును పోరాడి సాధించుకుంటామని బీరాలు పలికే బాబు..కనీసం ఇదే అంశంపై తమ వాదనను ప్రధానికి లేఖ రూపంలో అయినా ఇంతకాలం రాయకపోవటం ఏమిటి చెప్మా?