Begin typing your search above and press return to search.

సచిన్ పైలెట్ రాజీ వెనుక ఉన్నదెవరో తెలుసా?

By:  Tupaki Desk   |   13 Aug 2020 5:30 AM GMT
సచిన్ పైలెట్ రాజీ వెనుక ఉన్నదెవరో తెలుసా?
X
రాజస్థాన్ అధికారపార్టీలో చోటు చేసుకున్న సంక్షోభం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. తిరుగుబాటునేతగా అవతరించిన సచిన్ పైలెట్ ఇచ్చిన షాక్ తో కాంగ్రెస్ పార్టీ కిందా మీదా పడింది. ఎట్టకేలకు.. ఇష్యూను క్లోజ్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. తల ఎగరేసిన సచిన్ పైలెట్ మీద ఎలాంటి వేటు వేయకుండా.. కాంగ్రెస్ హామీ ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ ఇలా ముగియటానికి కారణాలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

సచిన్ పైలెట్ విషయంలో ప్రియాంక గాంధీ నేరుగా సీన్లోకి వచ్చినా మొత్తబడని ఆయన తాజాగా మాత్రం వెనకడుగు వేయటానికి కారణం మాత్రం ఆయన మామ ఫరూక్ అబ్దుల్లా.. బావమరిది ఒమర్ అబ్దుల్లాగా చెబుతున్నారు. 2014లో కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కమార్తెన సారాను ఆయన పెళ్లాడారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే అబ్దుల్లా ఫ్యామిలీ సచిన్ పైలెట్ ను సమర్థించలేదని చెబుతారు.

సచిన్ పైలెట్ మనసు మార్చేందుకు ప్రియాంక నేరుగా ప్రయత్నించి భంగపడిన తర్వాత.. తెలివిగా ఫరూక్ అబ్దుల్లా.. ఒమర్ అబ్దుల్లాలను తెర మీదకు తీసుకొచ్చినట్లు చెబుతారు. కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడితో పాటు.. రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాల్లో తాము కీలకభూమిక పోషించాల్సిన సమయం వచ్చిందన్న మాటతో సచిన్ కాస్త మెత్తబడినట్లు చెబుతున్నారు.

సోనియా కుటుంబానికి ఫరూక్ కుటుంబానికి మధ్యనున్న సన్నిహిత సంబంధాల గురించి తెలిసిందే. కాంగ్రెస్ సీనయిర్ నేత గులాంనబీ అజాద్ మరోసారి రంగంలోకి దిగి ప్రియాంక కోరుకున్న రీతిలో వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకను భవిష్యత్తు ప్రధానిగా పలువురు అభివర్ణిస్తారు. అది కార్యరూపం దాల్చాలంటే.. సచిన్ ఇప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరం ఉందన్న మాటకు విలువ ఇచ్చినట్లు చెబుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్ని కాకుండా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా పని చేయాలన్న ఆలోచనలు ఉన్నట్లు చెబుతున్నారు.

మరో రెండేళ్లలో (2022)లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రియాంక తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూపీలో అత్యంత ప్రభావం చూపే గుర్జర్లను ప్రభావితం చేసే సత్తా సచిన్ పైలెట్ సొంతం. రాజస్థాన్ ఎన్నికల్లోనూ గుర్జర్ల ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ ఖాతాలో వేయటంలో సచిన్ కీలకభూమిక పోషించారు. గుజ్జర్ల యువత మీద సచిన్ కు మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెనకడుగు వేసినా.. భవిష్యత్తు ప్రయోజనాలకు అందరూ కలిసి ఉండాలన్న రాజీ ఫార్ములాతో మెత్తబడినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రాజకీయంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటే దాని వెనుక చాలానే లెక్కలు ఉంటాయనటానికి రాజస్థాన్ ఎపిసోడ్ నిలువెత్తు నిదర్శనంగా చెప్పక తప్పదు.