Begin typing your search above and press return to search.

ఎక్కడికి పోతున్నాం.. ఈ విషయాలు సుప్రీంకోర్టు చెప్పాలా?

By:  Tupaki Desk   |   3 May 2021 4:31 AM GMT
ఎక్కడికి పోతున్నాం.. ఈ విషయాలు సుప్రీంకోర్టు చెప్పాలా?
X
గడిచిన కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. నోట మాట రాని పరిస్థితి. ప్రజల్ని ఎలా పాలించాలి? సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి సుప్రీంకోర్టు చేత చెప్పించుకోవటం ఏమిటి? పాలనా వ్యవస్థలోని వారి మెదళ్లకు ఏమైంది? ప్రజల్ని పాలించేందుకే కదా అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు తాము చేయాల్సిన కనీస ధర్మాన్ని సైతం వారు చేయకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల కోసం లాక్ డౌన్ ను విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్ డివై చంద్రచూడ్.. జస్టిస్ లావు నాగేశ్వరరావు.. జస్టిస్ ఎస్. రవీంద్రభట్ లతో కూడిన ధర్మాసం కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేయటం గమనార్హం.

ప్రజల సంక్షేమం కోసం ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలన్న విషయంలో పాలకులకు ఒక స్పష్టత ఉంటుంది. అందుకు భిన్నంగా.. ఇటీవల కాలంలో తరచూ న్యాయస్థానాలు ప్రభుత్వాలకు సలహాలు.. సూచనలు ఇవ్వాల్సిన దుస్థితి. ఒకవైపు సూచనలు చేస్తూనే.. వాటిని అమలు విషయంలో ప్రభుత్వాలు చెప్పే మాటల్ని ధర్మాసనం ముందే చెప్పేయటం గమనార్హం. లాక్ డౌన్ కారణంగా తలెత్తే సామాజిక.. ఆర్థిక ఇబ్బందుల గురించి తమకు అవగాహన ఉందని.. ముఖ్యంగా పేదలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలుసని.. అందుకే.. ఆయా వర్గాల వారి అవసరాల్ని తీర్చేలా ముందస్తు చర్యల్ని తీసుకోవాలన్నారు.

ఆదివారం రాత్రి.. ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. సుప్రీం ధర్మాసనం చేసిన సూచనలు.. ఇచ్చిన ఆదేశాల్ని చూస్తే..

- సభలు.. సమావేశాలు.. వైరస్ ను సూపర్ స్పైడర్ గా వ్యాపించజేసే కార్యక్రమాలపై కఠిన నిషేధం విధించాలి
- కోవిడ్ సోకిన వైద్య ఆరోగ్య సిబ్బందికి సరైన పడకలు లేవని.. ఆక్సిజన్ అత్యవసర మందులు దొరకటం లేదని తెలిసింది. మరికొందరిని పాజిటివ్ గా తేలిన పది రోజుల్లోనే విధులకు హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారు.
- ప్రాణాల్ని పణంగా పెట్టిన వైద్యుల సేవల్ని గుర్తించేందుకుజాతీయ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాలి.
- మహమ్మారి నియంత్రణ కోసం ఇప్పటివరకు ఏం చేశారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పాలి.
- ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్థించే వారిని అధికార యంత్రాంగం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- ఢిల్లీలోని ఆక్సిజన్ సమస్యను మే 3 తేదీ అర్థరాత్రి లోపు పరిష్కరించండి.
- ఆక్సిజన్ లభ్యత.. వాక్సిన్ అందుబాటు.. వాటి ధరలు.. అందుబాటు ధరల్లో అత్యవసర మందుల లభ్యతతో పాటు.. తాము జారీ చేస్తున్న ఆర్డర్ లో పేర్కొన్న అన్ని అంశాలపై తదుపరి విచారణ జరిగే 10తేదీ లోపు చర్యలు తీసుకోవాలి.