Begin typing your search above and press return to search.

చంద్రబాబు హామీలకు గ్యారంటీ ఎక్కడ...?

By:  Tupaki Desk   |   29 May 2023 11:16 AM GMT
చంద్రబాబు హామీలకు గ్యారంటీ ఎక్కడ...?
X
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడానికా అన్నట్లుగా వైసీపీతో టీడీపీ పోటీ పడుతోంది. వైసీపీ అయితే చేతిక ఎముక లేదు అన్నట్లుగా ప్రజలు కట్టే పన్నులతో లెక్కలేనన్ని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చింది. ఇపుడు ఆ హామీలు తీర్చడానికి అన్నట్లుగా అప్పులు చేస్తూ పోతోంది. ఇపుడు టీడీపీ వంతు.

గతంలో అప్పులు చేసి పప్పు బెల్లాలుగా జనాలకు పంచుతున్నారని, ఏపీ ఇక బతికి బట్టలేదని తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు చెప్పుకొచ్చారు తీరా చూస్తే మహానాడులో చంద్రబాబు స్వయంగా టీడీపీ ఎన్నికల మ్యానిఫేస్టో మొదటి భాగం రిలీజ్ చేశారు. అందులో చూస్తే నగదు బదిలీ పథకాలు కనిపించాయి. వారూ వీరూ చూడకుండా పంచేస్తామని చంద్రబాబు చెబుతున్నారు.

హామీలు పెద్ద ఎత్తున గుప్పించారు. తమ్ముళ్ళూ అదీపోయే పధకాలు కదా అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ఎపుడూ చెప్పింది చేయరు. ఒక మాట మీద నిలబడరు అన్న ప్రచారం ఉంది. 1999 నుంచి 2004 మధ్యలో ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన చంద్రబాబు తనను తాను సంస్కరణవాదిగా చెప్పుకున్నారు. ఉచితాలు అనుచితం అని ఆయన నోటితోనే అన్నారు.

అదే చంద్రబాబు 2014లో భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఎన్నికల వేళ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కండిషన్లు అప్లై అని చెప్పింది కూడా ఇదే చంద్రబాబు. అంతే కాదు అలా బాబు ఇచ్చిన హామీల నుంచి కనీసం అయిదు శాతం కూడా ప్రజలకు ఫలితాలు అందలేదు. ఇక చంద్రబాబు వేయి రూపాయల పెన్షన్ మాత్రం నలభై ఎనిమిది నెలలు ఇచ్చి చివరి రెండు నెలలు రెండు వేల రూపాయలు పెంచారు. అలా తాను రెండు వేల పెన్షన్ ఇచ్చానని క్లెయిం చేసుకున్నారు కానీ జనాలు నమ్మలేదు.

మరో వైపు చూస్తే డ్వాక్రా మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదు ఎన్నికలకు వారం ముందు పసుపు కుంకుమ పేరిట డబ్బులు ఇచ్చారు. కానీ అప్పటికే వారంతా టర్న్ అయిపోయారు. అలా టీడీపీ నాటి ఎన్నికల్లో ఓడింది.

ఇపుడు చూస్తే 2024 ఎన్నికలు ఉన్నాయని చెప్పి భారీ హామీలతో చంద్రబాబు రెడీ అవుతున్నారు. నిజానికి చంద్రబాబు చెప్పిన హామీలకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయన్నది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే ఏపీ అన్ని విధాలుగా అప్పుల్లో ఉంది. చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా పాలించి ఆ అయిదేళ్లలో చాలా అప్పు చేశారు. ఇక 2019 నుంచి గత నాలుగేళ్లలో జగన్ అధికారంలోకి వచ్చి అంతకు మరింత అన్నట్లుగా భారీగా అప్పులు చేశారు.

ఇలా ఏపీలో అప్పులు కొండలా పేరుకుపోయాయి. ప్రభుత్వం పధకాలకే అపులు తెచ్చి ఖర్చు పెడుతోంది. ప్రజలు కడుతున్న పన్నుల డబ్బులతో రోడ్లు కూడా వేసే పరిస్థితి కనిపించడంలేదు. ఏపీలో డెవలప్మెంట్ ఎక్కడా లేదని అంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు కూడా ఉచితాలు నగదు బదిలీ పథకం అంటూ హామీలు కుమ్మరించేశారు.

ఇలా ఎన్నో పధకాలు ఇచ్చి ఏపీని సర్వనాశనం చేస్తున్నారు అని ఇప్పటికే వైసీపీని విమర్శించే టీడీపీ పెద్దలు ఇపుడు అవే పధకాలను తామూ కాపీ కొట్టేసి జనాల వద్దకు వెళ్తున్న తీరుని చూసి ఏమనుకోవాలో అర్ధం కావడంలేదు అంటున్నారు ఏపీని ప్రేమించేవారు. వైసీపీ ఎటూ ఏపీని అప్పుల కుప్పగా చేసి పెట్టింది.

ఆ అప్పుల వూబిలో నుంచి ఏపీని కాపాడాల్సిన చంద్రబాబు తాను కూడా మరింతగా గోయి తవ్వుతున్నారా అన్నట్లుగా ఆయన ప్రకటించిన హామీలను చూస్తే అర్ధం అవుతోంది. అసలు ఈ రెండు పార్టీలూ ఏపీని ఏమి చేద్దామని అనుకుంటున్నారు. ప్రజలకు నగదు బదిలీ పధ్కాలు ఇచ్చేసి నాలుగు ఓట్లు వేయించేసుకుని అధికారంలోకి రావడమే పరమావధిగా పెట్టుకున్నాయా అన్నదే చర్చగా ఉంది.

ఏపీ అభివృద్ధి భవిష్యత్తు తరాల ప్రయోజనాలు ఏ మాత్రం పట్టవా అని అడుగుతున్నారు. బ్యాడ్ లక్ ఏంటి అంటే ఏపీలో రెండే పార్టీల వ్యవస్థ ఈ రోజుకీ ఉంది. ఇలా ఇద్దరూ ఉచితాలతో పోటీ పడుతూ ఏపీని నిలువునా ముంచేసేందుకు సిద్ధపడుతున్న వేళ 2024 ఎన్నికల్లో జనాలు ఏ రాయి తో కొట్టుకున్నా ఏపీ సర్వనాశనం కావడం తప్ప ఇంకేమీ మిగిలే సీన్ అయితే కనిపించడంలేదు అన్నదే సగటు ఆంధ్రుడి భావన.