Begin typing your search above and press return to search.

నిర్భయ హంతకులపై సుప్రీంలో కేంద్రం వేసిన పిటిషన్ లో ఏముంది?

By:  Tupaki Desk   |   23 Jan 2020 4:23 AM GMT
నిర్భయ హంతకులపై సుప్రీంలో కేంద్రం వేసిన పిటిషన్ లో ఏముంది?
X
యావత్ దేశం కంట కన్నీరు పెట్టించటమే కాదు.. ప్రతి తండ్రి.. తల్లి.. అన్న.. అక్క.. తమ్ముడు.. చెల్లెలు.. ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా మనిషి అన్న ప్రతి ఒక్కడు అయ్యో అనేలా చేసిన దారుణ ఉదంతం నిర్భయదిగా చెప్పక తప్పదు. దేశంలో మహిళలకు జరిగే లైంగిక దాడులకు చెక్ పెట్టేందుకు వీలుగా నిర్భయ పేరుతో చట్టాన్నే రూపొందించారు. మరి.. ఆ నిర్భయ కేసులోని దోషులకు విధించిన ఉరి శిక్ష ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న వైనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

దారుణమైన నేరానికి పాల్పడిన వారు చట్టంలోని లొసుగులతో శిక్షలు అమలుకు చెక్ చెప్పటం ఎలా? అన్న విషయాన్ని నిర్భయ దోషుల విషయాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. నిర్భయ దోషులను రకరకాల పిటిషన్ల తో వాయిదా వేస్తున్న వేళ.. కేంద్రం రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు లో అనూహ్యం గా ఒక పిటిషన్ వేసింది. ఈ సందర్భం గా కీలక అంశాల్ని ప్రస్తావించింది.

జాతి జనుల భావాల్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ పిటిషన్ లో పేర్కొన్న అంశాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. ఇంతకీ ఆ పిటిషన్ లో ఏమేం అంశాలు ప్రస్తావించారన్నది చూస్తే..% ఒక కేసులో మరణ శిక్ష పడ్డ వ్యక్తి పెట్టుకున్న క్షమా భిక్షను తిరస్కరించాక వారం లోగా డెత్‌ వారెంట్‌ జారీ చేసి ఉరి తీసేయాల్సిందే. అలా నిబంధనలు ఉండాలి. అందుకు తగ్గట్లు మార్గ దర్శకాలు ఇవ్వాలి.

% ఉరి శిక్ష పడ్డ వ్యక్తికి కూడా కొన్ని హక్కులున్నాయని 2014లో శతృఘ్న చౌహాన్‌ కేసులో సుప్రీం కోర్టు ఓ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు నిందితులను దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దోషుల హక్కులు కాదు. బాధితుల ప్రయోజనాలు ముఖ్యం కావాలి.

% అత్యాచారం, అనంతర హత్యల్లాంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన వారు చట్టం తో ఆటలాడుకుంటున్నారు. జాతి ఆత్మను దెబ్బ తీస్తున్నారు. ఈ నేపథ్యం లో నాటి తీర్పును పరిశీలించి స్పష్టత ఇవ్వాలి. అవసరమైతే సవరణలు చేయాలి.

% దోషులు ఇలా పిటిషన్లతో కాలక్షేపం చేస్తూ పోతే బాధిత కుటుంబాలు పడే ఆవేదన అంతాఇంతా కాదు.చివరకు మతి భ్రమణానికి గురికావడమూ జరుగుతోంది.

% క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురయ్యాక పద్నాలుగు రోజులు గడువు ఇచ్చి ఉరి తీయాలన్న నిబంధనను ఏడు రోజులకు మార్చాలి.

% ఉరి శిక్ష పడ్డ దోషులు రివ్యూ పిటిషన్ల ను కోర్టు చెప్పిన నిర్ణీత గడువు లోగా మాత్రమే దాఖలు చేయాలి. డెత్ వారెంట్లను కోర్టులు లేదంటే ప్రభుత్వాలు జారీ చేయాలి. సహ దోషుల పిటిషన్ల తో నిమిత్తం లేకుండా ఉరి తీసే అవకాశం ఉండాలి.