Begin typing your search above and press return to search.

అసలు ఇండియన్ క్రికెట్ టీంలో ఏం జరుగుతోంది..?

By:  Tupaki Desk   |   17 Jan 2022 7:16 AM GMT
అసలు ఇండియన్ క్రికెట్ టీంలో ఏం జరుగుతోంది..?
X
ఇండియన్ క్రికెట్ టీంలో దూకుడు కెప్టెన్.. ఎన్నో వ్యక్తిగత రికార్డులు.. టీమిండియాలో మార్పులు తెచ్చిన నాయకుడు.. అయిన విరాట్ కోహ్లి తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దీంతో అతడు ఇక ఏ ఫార్మాట్ కు నాయకుడు కాడు. ఎన్నో నాటకీయ పరిణామాలు, విమర్శలు, వివాదాల మధ్య సౌతాఫ్రికా టూర్ కెళ్లిన కోహ్లి సేన మూడు టెస్టుల్లో విఫలం కావడంతో ఇక తాను కెప్టెన్సీగా ఉండనని తేల్చేశాడు. దీంతో విరాట్ ప్రస్తుతం కేవలం సభ్యుడు మాత్రమే. అందరి అంచనాలకు భిన్నంగా కోహ్లి తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండియన్ క్రికెట్ లోకంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కోహ్లి తాజా నిర్ణయానికి వరల్డ్ కప్ టీ 20 నుంచే ప్రారంభమైందా..? అనే చర్చ సాగుతోంది. నాలుగు నెలల్లో మూడు ఫార్మాట్ల నుంచి విరాట్ వైదొలగడంపై.. అసలు ఇండియన్ క్రికెట్ టీంలో ఏం జరుగుతోంది..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

2014లో ఆస్ట్రేలియా టూర్ సమయంలో అప్పటి కెప్టెన్ ధోని గాయంతో బాధపడుతున్నాడు.ఈ సమయంలో కోహ్లికి సారథ్యం వహించే అవకాశం వచ్చింది. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తూనే కోహ్లి ఈ సీరిస్లోని తొలి ఇన్నింగ్స్ లో కోహ్లి 115 రన్స్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్ లో 141 చేసి మొత్తం 364 పరుగులు చేశాడు. అయితే వ్యక్తిగతంగా కోహ్లి విజయవంతంగా ప్రదర్శించినా జట్టు మాత్రం గెలవలేకపోయింది. ఆ తరువాత జట్టు బాధ్యతలు తీసుకున్న తరువాత కెప్టెన్ గా కోహ్లి తన సత్తా చాటుకున్నాడు.

అయితే కెప్టెన్సీ ఒత్తిడి అతడి వ్యక్తిగత ప్రతిభపై ప్రభావం చూపింది. గత రెండేళ్లలో టెస్ట్, వన్డే, టీ 20 మ్యాచుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అంతేకాకుండా కోహ్లి సారథ్యంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గానీ, ఐసీసీ చాంపియన్ ట్రోఫీ గాని గెలవలేకపోయింది. అలాగే ఐపీఎల్ లోనూ ఆర్సీబీ ఒక్క టైటిల్ సొంతం చేసుకోలేదు. ఇప్పటి వరకు కోహ్లి 50 టీ 20 మ్యాచులకు సారథ్యం వహించాడు. అందులో 30 మ్యాచ్ లు గెలవగా.. 16 ఓడిపోయారు. రెండు మ్యాచులు టై కాగా.. రెండు ఎలాంటి ఫలితాలు రాలేదు.

దీంతో టీ20 వరల్డ్ కప్ టూర్ కు ముందే గత సెప్టెంబర్ 16న విరాట్ కోహ్లి ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్లో జరిగిన టీ 20 ప్రపంచ కప్ ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత జరిగిన టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ సేన సూపర్ సిక్స్ వరకు కూడా వెళ్లలేకపోయింది. దీంతో కోహ్లీపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. విరాట్ కోహ్లి కెప్టెన్ గా టీ20 మొదటిసారి అవకాశం వచ్చింది. అయితే కెప్టెన్ గా ఇదే చివరి సిరీస్ కావడం గమనార్హం. అయితే ఈ సీరీస్ లో కోహ్లి సారథ్యంలో పాకిస్తాన్ జట్టుపై ఓటమి చెంది మరిన్ని విమర్శలను మూటగట్టుకుంది.

ఆ తరువాత నవంబర్లో న్యూజిలాండ్ సిరిస్ భారత్లో నిర్వహించారు. ఇందులో భాగంగా కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మకు కెప్టెన్సీగా నియమించారు. అయితే రోహిత్ కెప్టెన్సీగా ఈ న్యూజిలాండ్ సిరీస్ గెలపొందడంతో అందరూ రోహిత్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సీరీస్ అనంతరం సౌతాఫ్రికా టూర్ కు ఇండియన్ టీం రెడీ అయింది. ఈ సమయంలో కోహ్లీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం దూమారం లేపినట్లయింది. ఈ జట్టు ఎంపిక కోసం గంటన్నర ముందు నన్ను సంప్రదించారని విరాట్ చెప్పడం పలు పరిణామాలకు దారి తీసింది. అంతేకాకుండా తనను వన్డే జట్టు నుంచి దూరం పెడుతున్నట్లు చెప్పడం తనను అవమానించినట్లు కోహ్లి భావిస్తున్నట్లు తెలిసింది.

తాజాగా సౌతాఫ్రికా సిరీస్ కోల్పోవడంతో కోహ్లి టెస్ట్ ఫార్మాట్ కూ గుడ్ భై చెప్పారు. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశానని, కానీ ఏ రోజు తన ప్రయత్నంలో లోపం ఏర్పడకుండా జాగ్రత్తపడ్డానని తెలిపాడు. అయితే తాను చేసిన ప్రతీ పనిలో కష్టపడ్డానని, అలా చేయని పక్షంలో సారథిగా ఉండడం కరెక్ట్ కాదనే నా భావని అని కోహ్లి చెప్పాడు.