Begin typing your search above and press return to search.

అసలు నిత్యానందకు ఏమైంది ?

By:  Tupaki Desk   |   18 May 2022 5:30 AM GMT
అసలు నిత్యానందకు ఏమైంది ?
X
వివాదాస్పద స్వామి నిత్యానందకు ఏమైంది ? గడచిన ఆరు మాసాలుగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని చెబుతున్నారు. భోజనం తీసుకోవటంలో బాగా ఇబ్బందులు పడుతున్నారని, శ్వాస తీసుకోవటం కూడా కష్టమవుతోందని అంటున్నారు. అసలు ఒక దశలో నిత్యానంద చనిపోయారని కూడా పెద్ద ఎత్తున ప్రచారమైంది. అయితే కొద్ది రోజుల క్రితం తాను బతికే ఉన్నానని, సమాధిలో ఉన్నట్లు చెప్పారు. తాజాగా దీనికి సంబంధించి మరింత క్లారిటి ఇచ్చారు.

తన అనారోగ్యంపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో విచారణ ధిక్కరించి విదేశాలకు పారిపోవటంతో నిత్యానంద విషయంపై జనాల్లో బాగా ఆసక్తి పెరిగిపోయింది.

అప్పటికే సెక్స్ కుంభకోణంలో కూడా ఈ స్వామి ఇరుక్కోవటం, కోర్టు విచారణకు కూడా హాజరయ్యారు. ఈయన రాసలీలలంటు కొన్ని వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. రెగ్యులర్ గా ఏదో ఒక వివాదంలో ఉంటున్న నిత్యానంద తనపై జరుగుతున్న విచారణలను తప్పించుకుని ఏకంగా దేశం వదిలేసి పారిపోయారు.

ఎక్కడో ఈక్వెడార్ దగ్గరలోని ఒక దీవిని సొంతం చేసుకుని దానికి కైలాసదేశమనే పేరుపెట్టుకున్నారు. సొంతంగానే కరెన్సీ, పాస్ పోర్టు, వీసాల్లాంటివి కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి స్వామికి తీవ్ర అనారోగ్యమనగానే మీడియా, సోషల్ మీడియా పెద్దగా స్పందిస్తోంది. అందుకనే ఆయన స్పందించి తన ఆనారోగ్యంపై ఫెస్ బుక్ ద్వారా సమాచారమిచ్చారు.

దాని ప్రకారం తనకు క్యాన్సర్ కానీ లేదా ఎలాంటి కణితులు లేవని స్పష్టంచేశారు. తన అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నట్లు వైద్యపరీక్షల్లో తేలిందన్నారు. తాను ఆహారాన్ని సక్రమంగా తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు.

తీసుకున్న ఆహారం కూడా జీర్ణం కావడం లేదట. అన్నీ అవయవాలు సక్రమంగా పనిచేస్తుంటే ఆహారం తీసుకోలేకపోవటం ఏమిటో ? తిన్నది జీర్ణం కాకపోవటం ఏమిటో నిత్యానందే చెప్పాలి. తాను తరచూ నిర్వికల్ప సమాధిలోకి వెళుతున్నానని, నిత్యపూజలు మాత్రమే చేయగలుగుతున్నారట. మెరుగైన వ్యైద్యం అందించే ఆసుపత్రులు లేకపోవటంతో తన శిష్యులైన వైద్యులే తనకు వైద్యం చేస్తున్నట్లు చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది.