Begin typing your search above and press return to search.

దావోస్ లో సీఎం జగన్ ఏం చేశారు? ఎవరెవరిని కలిశారు?

By:  Tupaki Desk   |   23 May 2022 3:20 AM GMT
దావోస్ లో సీఎం జగన్ ఏం చేశారు? ఎవరెవరిని కలిశారు?
X
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రోటీన్ కు భిన్నంగా వార్తల్లో నిలిచారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన జర్నీ రాజకీయ రచ్చగా మారింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో దావోస్ లో ల్యాండ్ కవాల్సిన ఆయన.. అందుకు భిన్నంగా దానికి దూరంగా ఉండే లండన్ కు వెళ్లటం ఒక ఎత్తు అయితే.. ప్రత్యేక విమానంలో సతీమణి భారతితో పాటు.. మరొకరు మాత్రమే ఉండటం పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది.

దీనిపై అధికార.. విపక్షాల మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు సంధించుకుంటూ వాతావరణం హాట్ హాట్ గా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో ప్రత్యేక విమానంలో తన టీం మొత్తాన్ని తీసుకెళితే విమర్శించిన సీఎం జగన్.. తాను మాత్రం సీఎంగా ఉంటూ కేవలం సతీమణిని మాత్రమే వెంట పెట్టుకొని వెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అధికారిక షెడ్యూల్ కు భిన్నంగా లండన్ కు వెళ్లిన ఆయన.. తన కుమార్తెల్ని వెంట పెట్టుకొని దావోస్ కు వెళ్లినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. దావోస్ కు చేరుకున్న ఏపీ సీఎం ఏం చేశారు? ఎవరెవరితో భేటీ అయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

ఆదివారం దావోస్ లో సీఎం జగన్ ముఖ్యులతో భేటీ అయ్యారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ప్లాట్ ఫాం పార్టనర్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్ తో భేటీ అయ్యారు. ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని.. ధాన్యాగారంగా పేరొందిన ఏపీ ఫుడ్ హబ్ గా మారేందుకు అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచంలో పలు చోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న వేళ.. దాన్ని అధిగమించటంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంతేకాదు.. అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో డీల్ కుదుర్చుకోవటానికి ష్వాప్ ను ఆహ్వానించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు.. ఎయిర్ పోర్టుల నిర్మాణం.. డెవలప్ మెంట్ మీద చర్చలు జరిపారు.

పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ.. మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపర్చుకోవటంపై శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. అదే సమయంలో తమ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణల్ని వివరించినట్లుగా చెబుతున్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆరోగ్యం – వైద్య విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తోనూ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించి ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పుల్ని ఆయనకు సీఎం జగన్ వివరించారు. అక్కడి నుంచి నేరుగా ఏపీ పెవిలియన్ కు చేరుకొని.. జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. పెవిలియన్ అంటే మరేమీ కాదు.. ఏపీ రాష్ట్రం గురించి తెలిపే స్టాల్ మాత్రమే. ఈ స్టాల్ ను ప్రారంభించిన సీఎం జగన్.. అనంతరం పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు.

ఇంకెవరిని సీఎం జగన్ భేటీ అయ్యారంటే..
- డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టెయిన్‌బిలిటీ విభాగాధిపతి పెడ్రో గోమెజ్‌
- బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) గ్లోబల్‌ చైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌
- అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌ గౌతం అదానీ
- మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే

ఈ రోజు సీఎం జగన్ ఎవరితో భేటీ కానున్నారంటే..
- టెక్‌ మహీంద్రా ఛైర్మన్, సీఈఓ సీపీగురానీ
- దస్సాల్ట్‌ సీఈఓ బెర్నార్డ్‌ ఛార్లెస్‌
- జపాన్ కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ సీఈఓ తకేషి హషిమొటో
- హీరోమోటార్‌ కార్పొరేషన్‌ చైర్మన్, ఎండీ పవన్‌ ముంజల్‌
- ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్‌ కృష్ణ