Begin typing your search above and press return to search.

జగన్ ప్రభుత్వానికి టీజీ వెంకటేశ్ చెప్పిన సలహా ఏంటి?

By:  Tupaki Desk   |   24 Nov 2021 1:10 PM GMT
జగన్ ప్రభుత్వానికి టీజీ వెంకటేశ్ చెప్పిన సలహా ఏంటి?
X
ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చిన జగన్ సర్కారు.. మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తాము తీర్మానించిన మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఏపీ ప్రభుత్వం వెల్లడించటం తెలిసిందే. త్వరలో మరో సమ్రగ బిల్లు పెడతామని చెప్పిన జగన్ ప్రభుత్వం.. రాజధానిగా అమరావతిని ఉంచుతారా? లేదంటే.. తమ విధానమైన మూడు రాజధానుల మీదనే ఉంటారా? అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ.. ఊహాగానాలు సాగుతున్నాయే తప్పించి.. ప్రభుత్వ వైఖరి ఫలానా రీతిలో ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

ఇలాంటి వేళ.. రాజ్యసభ సభ్యులు.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న టీజీ వెంకటేశ్ స్పందించారు. రాజధానికి సంబంధించిన ఆయనో సరికొత్త ఫార్ములాను తెర మీదకు తీసుకొచ్చారు.రాయలసీమ హక్కుల వేదిక పేరుతో.. రాయలసీమ ప్రయోజనాల మీద సందర్భానికి మాత్రమే మాట్లాడే టీజీ వెంకటేశ్.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు.

ఏపీలో సమ్మర్.. వింటర్ క్యాపిటల్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. రాజధానిపై ఒకసారి చట్టం అయితే మళ్లీ మార్చటం కష్టమన్న ఆయన.. తన ప్రతిపాదనను వివరిస్తూ..కొన్ని అంశాల్ని ప్రస్తావించారు. టీజీ ప్రస్తావించిన ప్రతిపాదనను ఆయన మాటల్లోనే చూస్తే..

- శ్రీశైలం ప్రాజెక్టుకోసం సీమ రైతులు భూములు ఇచ్చారు. అమరాతి కోసం అక్కడి రైతులు భూములు ఇచ్చారు. అప్పటి త్యాగాలు కనిపించవు. ఇప్పటి పరిస్థితులు మాత్రమే అందరికి కనిపిస్తాయి.

- శ్రీ క్రిష్ణ కమిటీని కర్నూలును రాజధానిగా చేయాలని కోరాం. మా హైకోర్టు బెంచ్ ను మాకివ్వండి. హైకోర్టు కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం.

- విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి. విశాఖలో వేసవికాలం.. కర్నూలులో శీతాకాలం అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించండి.

- మా ప్రాంతం నుంచి సోలార్.. విండ్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ ఇస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి.

- మా ప్రాంతంనుంచి రాజధాని పోయింది. మాకు బాధగా ఉంది. మాకు ప్రాంతీయ డెవలప్ మెంట్ కావాలి. భూములు కోల్పోయిన వారికి అమరావతి రాజధానిఅని చెప్పి.. మిగిలిన ప్రాంతాల్ని డెవలప్ చేయాలి.

ఈ ప్రతిపాదనల్ని ప్రకటించిన టీజీ వెంకటేశ్.. తాను చెప్పినట్లుగా సీఎం జగన్ ఓకే చెబితే.. తాను ప్రాతిపాదించిన ఫార్ములాతో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. ఒకవేళ.. జగన్ గతంలో చెప్పినట్లుగా మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశ పెడితే మాత్రం కోర్టు కేసులు తప్పవంటూ టీజీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి.. టీజీ ప్రతిపాదనపై వైసీపీ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి